ETV Bharat / state

మిగ్​జాం ప్రభావంతో కుండపోత వర్షాలు - నెల్లూరు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 2:24 PM IST

Cyclone_Michaung_Effect_in_Nellore_District
Cyclone_Michaung_Effect_in_Nellore_District

Cyclone Michaung Effect in Nellore District: మిగ్​జాం తపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతూ నెల్లూరు జిల్లాలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Cyclone Michaung Effect in Nellore District: నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో తుపాను ప్రభావంగా నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. జిల్లాలో చాలాచోట్ల 10 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మనుబోలులో 36.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులోని గిరిజన కాలనీ చుట్టూ నీరు చేరడంతో స్పందించిన ఆత్మకూరు ఆర్​డీఓ వెంటనే జేసీబీ సహాయంతో నీటిని బయటకు తోడించే పనులు చేపట్టారు.

మర్రిపాడు మండలం పడమటినాయుడుపల్లి వద్ద కేతా మన్నేరు వాగు, ఎస్‌.పేట మండలం తెల్లపాడు వద్ద ప్రధాన రహదారిపై అలుగు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉగ్రరూపం దాల్చాయి. పెన్నా పరివాహకమైన అనంతసాగరం ఆత్మకూరు సంఘం చేజెర్ల మండలం పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

ఈదురు గాలులకు స్తంభాలు నేలకొరగడంతో నిన్నటి నుంచి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంగం వద్ద జాతీయ రహదారిపై కొండ నుంచి రాళ్లు రోడ్డు మీదకు పడుతుండడంతో ప్రమాదం పొంచి ఉందని పరిసర లోతట్టు ప్రాంతాల్లోని గిరిజనులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఉత్తర దిశగా కదులుతున్న తీవ్రతుపాను - కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడి

ఉదయగిరి నియోజకవర్గంలో ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. వరికుంటపాడులో వీస్తున్న గాలులకు ఓ ఇంటిపై చెట్టు విరిగిపడగా.. తుపాను ప్రభావంతో కారంచెరువులో పాడుబడిన పాఠశాల భవనం కుప్పకూలింది. దుత్తలూరు మండలంలో బ్రహ్మేశ్వరం వద్ద కల్వర్టు తెగిపడటంతో నెల్లూరు, కావలి, పామూరు వరుకు వెళ్లే వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులపై మోకాళ్లోతు వరద నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. తుమ్మలపెంట, కొత్తసత్రం, పెదపట్టుపాలెం వంటి పలు ప్రాంతాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రంలోకి మత్స్యకారులను వెళ్లొద్దంటూ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఏపీని కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను - స్తంభించిన జనజీవనం, అన్నదాతల్లో ఆందోళన

మిగ్​జాం తుపాను ప్రభావంతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు దిగువ ప్రాంతాలను ముంచెత్తుతోంది. పాఠశాలలన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తుపాను ప్రభావం దృష్ట్యా పాఠశాలలకు ఈ రోజు కూడా సెలవు ప్రకటించారు. మిగ్​జాం తుపాను ప్రభావంతో వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలు నేలకొరిగాయి.

ఈదురుగాలులతో కూడిన వర్షంతో వరి పంట నేలకొరిగింది. కోతలు కోసే సమయంలో వర్షాలు పడటంతో పంటను కాపాడుకునేందుకు కంటికి కునుకులేకుండా రైతులు నానావస్థలు పడుతున్నారు. మరోరెండు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో చేతికందిన పంట నీటిపాలవుతుందేమోనని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

తిరుపతిలో నీట మునిగిన ప్రాంతాలు - వాగులో చిక్కుకున్న యువకులను కాపాడిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.