నెల్లూరు జిల్లాలోని జగనన్న కాలనీల్లో అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నట్లు జిల్లా పాలనాధికారి చక్రధర బాబు తెలిపారు. మొత్తం 1,477 కాలనీలు ఏర్పాటు చేసి, 1,73,800 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇందుకోసం 1,063 ఎకరాల ప్రైవేటు స్థలంతో పాటు మొత్తం 3,743 ఎకరాల స్థలాన్ని సేకరించామని చెప్పారు. స్థలాల సేకరణ, వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.646 కోట్లు వెచ్చించిందన్నారు. రూ.290 కోట్లతో స్థల సేకరణ చేస్తే, రూ.356 కోట్లతో పనులు నిర్వహించారు.
ఇల్లు లేని అర్హులు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే, వారికి 90రోజుల్లో స్థలాలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మర్రిపాడు మండలంలో కొన్ని స్థలాల ఎత్తు పెంచుతామని వివరించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో న్యాయపరమైన సమస్యలున్న నాలుగువేల ఇళ్ల స్థలాలకు, ప్రత్యామ్నాయ స్థలాలు సేకరిస్తామని స్పష్టం చేశారు. చరిత్రలో మొదటిసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతోందని, ఎలాంటి లోటుపాట్లు ఉన్నా, తమ దృష్టికి తీసుకువస్తే వాటిని సవరిస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: 'కార్యకర్తలపై దాడులను వైకాపా మానుకోవాలి'