ETV Bharat / state

పల్నాడులో రాజకీయ కాష్ఠం.. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు

author img

By

Published : Jun 4, 2022, 5:38 AM IST

Updated : Jun 4, 2022, 5:47 AM IST

పల్నాడులో రాజకీయ కాష్ఠం రగులుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి 2 నియోజకవర్గాల్లో 6 హత్యలు చోటుచేసుకోవడం... ఇక్కడి దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది. నడిరోడ్డుపై పట్టపగలే దాడులు చేసి, మారణాయుధాలతో చంపేస్తున్నా... ఏమాత్రం పట్టించుకోని పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పల్నాడులో రాజకీయ కాష్ఠం.. నడిరోడ్డుపై పట్టపగలే దాడులు
పల్నాడులో రాజకీయ కాష్ఠం.. నడిరోడ్డుపై పట్టపగలే దాడులు

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. పల్నాడులో రాజకీయ రావణకాష్ఠం రగులుతూనే ఉంది. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే మొదలైన హత్యలు, దాడులకు అంతే లేకుండా పోయింది. కళ్లెదుటే దారుణాలు జరుగుతున్నా.. పట్టపగలు ఊరి నడిబొడ్డున ప్రత్యర్థుల్ని పాశవికంగా హత్య చేస్తున్నా పోలీసులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న విమర్శల జడివాన తీవ్రమవుతోంది. ఈ హత్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నా, పోలీసులు కేసులు నమోదు చేస్తున్నా హంతకుల్లో మార్పు రాకపోగా వర్గపోరాటాలతో మరింత చెలరేగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు చాటుమాటుగా జరిగే దాడులు, హత్యలు ఇప్పుడు యథేచ్ఛగా నడిరోడ్డుపైనే చేస్తున్న తీరు మారుతున్న ధోరణికి అద్దం పడుతోంది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో ఇటీవల జరిగిన చంద్రయ్య హత్య మరవక ముందే.. శుక్రవారం మధ్యాహ్నం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన కంచర్ల జల్లయ్య దారుణ హత్యకు గురవడం పల్నాడులో పరిస్థితిని కళ్లకు కడుతోంది. ఈ దారుణాలకు బలైపోతున్న బాధితుల్లో ఎక్కువ మంది వెనుకబడిన సామాజికవర్గాలవారే.

కాపు కాచి.. మట్టుబెడుతున్నారు..
పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో రాజకీయ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం, పోలీసులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రమేనన్న ఆరోపణలు వస్తున్నాయి. సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన ఈ రెండు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు సార్వత్రిక ఎన్నికలు ముగిసినప్పటి నుంచి గ్రామాలు విడిచిపెట్టి ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అయినప్పటికీ వారు బయటకు వచ్చిన సమయాన్ని పసిగట్టి అదును చూసి కాపు కాచి, బహిరంగంగానే మట్టుపెడుతున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు నియోజకవర్గాల్లో ఆరుగురు నాయకులు దారుణ హత్యకు గురయ్యారు. వీటిని నియంత్రించేందుకు పటిష్ఠమైన చర్యలు తీసుకోవడంలో అన్ని విభాగాలు విఫలమవుతున్నాయి. కొందరు పోలీసులు అధికార పార్టీ నాయకులతో అంటకాగుతుండటంతో నేరాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు నమోదు చేస్తున్న కేసుల్లో లొసుగుల ఆధారంగా నిందితులు తక్కువ సమయంలోనే జైలు నుంచి విడుదలవుతూ బాధితులపైనే ఎదురుకేసులు బనాయిస్తున్నారు.

మొన్న గుండ్లపాడు...
వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెదేపా గ్రామ అధ్యక్షుడు తోట చంద్రయ్యను జనవరి 12న ఉదయాన్నే గ్రామం నడిబొడ్డున అందరూ చూస్తుండగా గొంతు కోసి అత్యంత కిరాతకంగా చంపారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. శుక్రవారం హత్యకు గురైన కంచర్ల జల్లయ్య కూడా సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రాణభయంతో గ్రామం నుంచి వెళ్లిపోయి గురజాల మండలం మాడుగుల గ్రామంలో తలదాచుకుంటున్నారు. బొల్లాపల్లి మండలం రావులాపురంలో బంధువుల వివాహం కోసం గ్రామం విడిచి బయటకొచ్చిన ఆయనను ప్రత్యర్థులు కాపు కాచి కొట్టారు. పంచాయతీ కార్యాలయానికి తీసుకొచ్చి మారణాయుధాలతో మరోసారి దాడి చేశారు.

ఎప్పుడు ఏం జరుగుతుందో?
నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షన్‌ గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన గ్రామస్థుల్లో నెలకొంది. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన భార్య, తండ్రిని కోల్పోయిన పసిపిల్లలు, కన్నకొడుకు కళ్లముందే కడతేరిపోతే వృద్ధులైన తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. హత్యకు గురైన వారి పిల్లలు పగతో రగిలిపోయి, ప్రత్యర్థులపై ప్రతిదాడులు చేసేందుకూ వెనుకాడటం లేదు. ఇది వర్గపోరును ఆరని కాష్టంలా మారుస్తోంది. భవిష్యత్తులో మరింత దుష్పరిణామాలు తలెత్తుతాయని మానవతావాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి..

RIVAL ATTACK: ప్రత్యర్థుల దాడిలో తెదేపా కార్యకర్త మృతి.. గ్రామంలో పోలీసుల బందోబస్తు

Last Updated : Jun 4, 2022, 5:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.