మాచర్ల.. మరో చంబల్​లోయ... వైసీపీ ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం

author img

By

Published : Dec 18, 2022, 7:30 AM IST

YCP workers attacked TDP workers

YCP activists attack on TDP: విక్రమార్కుడు సినిమాలో చంబల్‌ లోయ అనే ప్రాంతం గుర్తుందా అక్కడ విలన్‌ చేసే అకృత్యాలకు అంతే ఉండదు. అరాచకాలు, అత్యాచారాలు, దోపిడీలు, బెదిరింపులతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా తన ఆధిపత్యంలో ఉంచుకుంటాడు. దాష్టీకాలను ఎదిరించినా, ప్రశ్నించినా వాళ్లను అంతం చేస్తాడు. ఇంతటి దారుణాలను చూస్తున్న పోలీసులు కూడా ఆ విలన్‌కే జీ హుజూర్‌ అంటారు. ఇలాంటి ప్రాంతమే మన రాష్ట్రంలోనూ ఉంది. అదే పల్నాడు జిల్లా మాచర్ల. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది విక్రమార్కుడు సినిమాలోని విలన్‌ పాత్రలాంటిదే. 2019లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు నియోజకవర్గమంతా చెలరేగిపోవడం మొదలు పెట్టారు. శుక్రవారం మాచర్లలో జరిగిన విధ్వంసమే ఇందుకు తాజా ఉదాహరణ.

YCP activists attack on TDP: 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఆ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మనుషులు నియోజకవర్గమంతా చెలరేగిపోవడం మొదలుపెట్టారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు, వేధింపులకు దిగారు. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న గ్రామాల్లో ఆ పార్టీకి చెందినవారిని గ్రామ బహిష్కరణ చేసి తరిమికొట్టారు. దుర్గి మండలం ఆత్మకూరు, జంగమేశ్వరపాడు వంటి గ్రామాల నుంచి తెదేపా మద్దతుదారుల్ని కట్టుబట్టలతో వెళ్లగొట్టారు. వారికి ఆశ్రయం కల్పించేందుకు తెదేపా కొన్నాళ్లు గుంటూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించాల్సి వచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు బాధితులకు అండగా నిలిచేందుకు ఆత్మకూరు బయల్దేరితే, ఆయనను ఉండవల్లిలోని ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టేసి మరీ పోలీసులు అడ్డుకున్నారు. జంగమేశ్వరపాడులో 2020లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా తెదేపా శ్రేణులపై వైసీపీ వర్గీయులు దాడిచేయడంతో సుమారు 60 కుటుంబాలు గ్రామం వదిలివెళ్లిపోయాయి. గుండ్లపాడు గ్రామం నుంచి కొన్ని కుటుంబాలు తరలిపోయాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని పట్టపగలే గొంతు కోసి చంపేయడం మాచర్లలో వైసీపీ నేతలకు మంచినీళ్లు తాగినంత తేలిక. 2022 జనవరిలో వెల్దుర్తి మండలం గుండ్లపాడుకి చెందిన తెదేపా నేత చంద్రయ్యను నడిరోడ్డుపై పట్టపగలే గొంతు కోసి హత్యచేశారు. ఆ కేసులో ప్రధాన నిందితుడు శివరామయ్యతో పాటు, మరికొందరు కొన్ని రోజులు జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ గ్రామంలో తెదేపా మద్దతుదారులకు చెందిన కొన్ని కుటుంబాలు వైకాపా దాడులతో గ్రామం విడిచి వెళ్లిపోయాయి. 2022 జూన్‌ నెలలో దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో తెదేపా నాయకుడు జల్లయ్యను అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు దారికాచి హత్యచేశారు.

మాచర్ల నియోజకవర్గంలో ఎన్నిక ఏదైనా దాదాపు ఏకగ్రీవం కావాల్సిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకే ఒక్క గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మాచర్ల మున్సిపాలిటీతోపాటు, దుర్గి, కారంపూడి, రెంచచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ పదవులు అన్నీ వైసీపీ అభ్యర్థులకే ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్యే అనుచరులు ప్రత్యర్థి పార్టీల నాయకుల్ని బెదిరించి భయ పెట్టి ఎవరూ నామినేషన్లు వేయకుండా బీభత్సం సృష్టించి ఎన్నికలన్నీ ఏకగ్రీవం చేసుకున్నారు. ఒక్క దుర్గి మండలంలోని ధర్మవరంలో మాత్రం సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరిగింది. మాచర్ల మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు నామినేషన్‌ వేయడానికి ప్రయత్నిస్తే వైసీపీ నాయకులు దాడిచేసి నామినేషన్‌ పత్రాలు చించేశారు. వెల్దుర్తి మండలం బొదలవీడు గ్రామంలో తెదేపా తరపున ఎంపీటీసీ స్థానానికి నామినేషన్‌ వేయడానికి మహిళ వెళ్లగా అధికారుల ముందే నామినేషన్‌ పత్రాల్ని వైకాపా కార్యకర్తలు బలవంతంగా లాక్కొని చించేశారు.బొదలవీడు ఘటన తర్వాత అక్కడ పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమ, బుద్ధా వెంకన్న, న్యాయవాదులతో కలసి వెల్దుర్తి వెళ్తున్నప్పుడు వారి వాహనం మాచర్ల పట్టణంలోకి ప్రవేశించగానే దాడి జరిగింది. అప్పటి వైకాపా పట్టణ యువజన నాయకుడు తురక కిశోర్‌ పెద్ద పెద్ద కర్రలతో కారు అద్దాలు పగలగొట్టారు. తెదేపా నాయకుల్ని గాయపరిచారు. న్యాయవాదికి తీవ్ర రక్తస్రావమైంది. ఆ దాడి తర్వాత విపక్ష పార్టీలకు చెందినవారు ఎక్కడా నామినేషన్లు వేయడానికి ముందుకు రాలేదు. విపక్ష నాయకులపై దాడి ఘటనతో కిశోర్‌ వైకాపా పెద్దల కళ్లల్లో పడి స్థానికంగా పెద్ద నాయకుడైపోయాడు. తర్వాత అతడిని మాచర్ల మున్సిపాలిటీకి ఏకంగా ఛైర్మన్‌నే చేశారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఆ దాడికి సంబందించి వీడియోలు, ఫొటోలు సహా అన్ని అధారాలూ ఉన్నా ఇప్పటి వరకు కేసులో ఎలాంటి పురోగతీ లేదు. శుక్రవారం జరిగిన బీభత్సకాండకూ కిశోరే సూత్రధారి కావడం విశేషం. మాచర్లలోని 13వ వార్డుకి చెందిన కిశోర్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డికి ప్రధాన అనుచరుడు. వారి అండదండలతో 2012 నుంచి వైకాపా మాచర్ల పట్టణ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. 2020లో పురపాలక ఎన్నికల్లో కౌన్సిలర్‌గా పోటీ చేసే ప్రయత్నాల్లో ఉన్నప్పుడే బొండా ఉమా, బుద్ధా వెంకన్నలపై దాడికి పాల్పడ్డారు. దాడి ఘటనతో కిశోర్‌ని కౌన్సిలర్‌ అభ్యర్థిగా ఖరారు చేశారు. మాచర్లలో అన్ని కౌన్సిలర్‌ స్థానాలూ ఏకగ్రీవమవడం ఛైర్మన్‌ పదవి బీసీలకు రిజర్వు కావడంతో కిశోర్‌ ఏకంగా మున్సిపల్‌ ఛైర్మన్‌ అయిపోయారు. ఛైర్మన్‌ పదవిని అడ్డుపెట్టుకుని మాచర్లలో కిశోర్‌ అనేక భూకబ్జాలు, సెటిల్‌మెంట్‌లకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి.

మాచర్ల నియోజకవర్గంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు పెద్ద తేడా లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అక్కడ పోలీసులు పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. బాధితులకు అండగా నిలవాల్సిన పోలీసులు వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారు. వెల్దుర్తి మండలంలోని ఒక గ్రామం నుంచి తెదేపా మద్దతుతో సర్పంచ్‌ పదవికి నామినేషన్‌ వేసేందుకు ఒక అభ్యర్థి వెళ్తుంటే పోలీసులే అతనికి ఫోన్‌ చేసి నామినేషన్‌ వేస్తే గంజాయి కేసు పెడతామని బెదిరించారు. గుండ్లపాడులో చంద్రయ్య హత్య తర్వాత కిరాయి హంతకులతో వైకాపా నాయకుల్ని హత్య చేయించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభియోగం మోపి చంద్రయ్య బంధువుల్నే పోలీసులు అరెస్ట్‌ చేయడం వారి దాష్టీకానికి అద్దం పడుతోంది. దుర్గి మండలం జంగమహేశ్వరపురంలో జల్లయ్య హత్య తరువాత గ్రామంలో పోలీసు పికెట్‌ కొనసాగుతుండగానే తెదేపా నేతలపై దాడులు జరిగాయి. శుక్రవారం కూడా వైసీపీ శ్రేణులు మాచర్లను రణరంగంగా మారి, బీభత్సం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారే తప్ప, అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. మాచర్ల నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాల్లో మద్యం గొలుసు దుకాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.. అధికారపార్టీ నాయకులు తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తెచ్చి స్థానికంగా విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నారు. ఎమ్మెల్యే సన్నిహితుల కనుసన్నల్లోనే అవన్నీ జరిగినట్టు ఆరోపణలున్నాయి. అధికారపార్టీనేతలు విచ్చలవిడిగా గంజాయి వ్యాపారం చేస్తున్నారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్‌ లారీల నుంచి ఒక్కొక్క లారీకి 12వేలు చొప్పున అధికార పార్టీ నాయకులు వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో చేపట్టే పనుల టెండర్లనీ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే సన్నిహితులే దక్కించుకుంటున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వెంచర్లు వేయాలన్నా, భారీ నిర్మాణాలు చేయాలన్నా 5 శాతం వాటా అడుగుతున్నారు. ఇటీవల గుంటూరు రహదారిలో భూములు కబ్జాకు గురవుతుండటంతో అధికారపార్టీ నాయకులకు భయపడి పలువురు వ్యాపారులు తమ స్థలాల్లో నిర్మాణాలు ప్రారంభించుకున్నారు.

మాచర్ల పట్టణానికి చెందిన తెదేపా నేత ఇంటిపై వైసీపీ శ్రేణులు ఆ మధ్య దాడికి పాల్పడ్డాయి. ఆయన ఆస్తులు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే రిజిస్ట్రేషన్‌ జరకుండా అడ్డుకుని ముప్పుతిప్పలు పెట్టారు. దాంతో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం మానేశారు. మరో నియోజకవర్గ స్థాయి తెదేపా నేత కుమారుడిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించారు. మాచర్ల పట్టణంలో ఒక తెదేపా నేతకు చెందిన పెట్రోల్‌ బంక్‌ని స్వాధీనం చేసుకోవడంతోపాటు, అతని ఆస్తుల్ని తక్కువ ధరకు వారే కొనుగోలు చేశారు. దాంతో ఆయన మాచర్లను వదిలిపెట్టి... మరో నగరానికి వెళ్లిపోయారు. ఒక తెదేపా నేత ఇంట్లో జరిగిన శుభకార్యానికి పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మారెడ్డి హాజరయ్యారు. బ్రహ్మారెడ్డిని ఎందుకు పిలిచారంటూ ఆ తెదేపా నేతపై పోలీసులతో కేసు పెట్టి కొట్టించారు. ఒక తెదేపా నేతపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించి.. ఎమ్మెల్యేనే రాజీ కుదిర్చి కేసు లేకుండా చేసి, వైకాపా కండువా కప్పారు. మాచర్ల మండలం రాయవరం గ్రామంలో తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నాయకుల ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో వైకాపా నాయకులు తలదూర్చారు. దాంతో వారు వైకాపా కండువా కప్పుకోక తప్పలేదు. తెదేపా మాచర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించాక... ఆయన అధికార పార్టీ నాయకుల ఆగడాల్ని గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. తెదేపా శ్రేణులు మళ్లీ బలపడటం మొదలయ్యాయి. అది చూసి అధికార పార్టీ నాయకులు బ్రహ్మారెడ్డిని దెబ్బతీయడమే లక్ష్యంగా కుట్రలు పన్నుతున్నారు. బ్రహ్మారెడ్డికి మాచర్లలో ఎవరూ ఇల్లు అద్దెకు ఇవ్వకుండా వైకాపా నాయకులు చాలా ప్రయత్నించారు. శుక్రవారం కూడా బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా మాజీ మున్సిపల్‌ ఛైర్మన్‌ తురక కిశోర్‌ ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో తేదేపా శ్రేణులు బీభత్సం సృష్టించాయి. ఇంత ఘోరం జరిగినా ముఖ్యమంత్రిగానీ, హోంమంత్రిగానీ ఆ ఘటనల్ని ఖండిస్తూ పల్లెత్తు మాట అనలేదు. ఒక్క సమీక్షా లేదు. పైగా తెలుగుదేశం నేతలపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు విధ్వంసకాండకు తెగించిన వైసీపీ నేతలపై మాత్రం బెయిలబుల్‌ సెక్షన్ల కింద కేసులు పెట్టి మరోసారి అధికార పక్ష పక్షపాతాన్ని చాటిచెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.