'కొడుకు చనిపోయి రూ.5లక్షలు వస్తే.. ఆ మంత్రి సగం ఇమ్మంటున్నారు'

author img

By

Published : Dec 20, 2022, 10:02 AM IST

Updated : Dec 20, 2022, 5:23 PM IST

ALLEGATIONS ON MINISTER AMBATI RAMBABU

ALLEGATIONS ON MINISTER AMBATI: జనసేన అధినేత పవన్​ తనపై చేసిన వ్యాఖ్యలను నిజమని నిరూపించాలని మంత్రి అంబటి సవాల్​ చేసి 24గంటలు గడవకముందే.. బాధితులు బయటికొచ్చారు. డ్రైనేజి ప్రమాదంలో తమ బిడ్డ చనిపోతే.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో మంత్రి సగం వాటా అడిగారని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పర్లయ్య, గంగమ్మ దంపతులు ఆరోపించారు. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోయినప్పుడు పడిన బాధ కంటే.. వచ్చిన పరిహారంలో వాటాలు అడిగిన తీరుని చూసి వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ALLEGATIONS ON MINISTER AMBATI RAMBABU : కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో పర్యటించిన పవన్‌... మంత్రి అంబటి రాంబాబును ఉద్దేశించి పలు ఆరోపణలు చేశారు. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వమిచ్చే పరిహారం డబ్బుల్లోనూ MLA, మంత్రి స్థాయి వ్యక్తులు లంచం డిమాండ్‌ చేస్తున్నారంటూ.. అంబటి రాంబాబు పేరును ప్రస్తావించారు. ఆ వెంటనే పవన్‌ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన అంబటి రాంబాబు.. తాను లంచం అడిగినట్లు ఏ ఒక్కరితోనైనా చెప్పించాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే మంత్రి పదవితోపాటు శాసనసభ్యత్వానికి రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు.

మంత్రి అంబటి సవాల్ చేసిన 24 గంటల్లోపే ఆయనపై ఆరోపణలు గుప్పిస్తూ బాధిత కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న వీడియోలు వైరల్​గా మారాయి. సత్తెనపల్లిలో అచ్చంపేట రైల్వేగేట్ సమీపాన నివసించే పర్లయ్య, గంగమ్మ దంపతులు.. అంబటి రాంబాబు తమను డబ్బులు డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్లయ్య, గంగమ్మ దంపతుల కుమారుడు అనిల్.. ఈ ఏడాది ఆగస్టు 20వ తేదిన డ్రైనేజి శుభ్రం చేసేందుకు వెళ్లి అందులో ప్రమాదవశాత్తూ పడి మరణించాడు. దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల సాయం మంజూరైంది.

అందులో రూ.2.50 లక్షలు ఇవ్వాలని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ చలంచర్ల లక్ష్మితులసి భర్త సాంబశివరావు అడిగారని.. దీనిపై మంత్రి అంబటి రాంబాబును కలిసి ఫిర్యాదు చేస్తే ఆ నగదు ఇవ్వాల్సిందేనన్నారని దంపతులు వాపోయారు. తమకు ఎలాంటి ఆస్తులు లేవని.. ప్రభుత్వ సాయం రూ.5 లక్షలు అందజేస్తే కుమార్తె పెళ్లిచేద్దామనుకున్నట్లు తెలిపారు. డబ్బులు ఇచ్చేయాలని లేకపోతే ఇబ్బందులు తప్పవని సీఐ నుంచి బెదిరింపులు రావడంతో ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు వాపోయారు. కేవలం తమ కుమార్తె కోసమే ఆగామని ఆవేదనగా చెప్పారు. 20 రోజులక్రితం వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి రూ.5 లక్షల చెక్కు రాగా.. ఇంకా అది వీరి చేతికి చేరలేదు.

"ఆ ఐదు లక్షల తోటి నా బిడ్డకు పెళ్లి చెద్దామనుకున్నాం. కానీ అందులో సగం అడుగుతున్నారు. ఈ విషయంపై మంత్రి అంబటి రాంబాబు గారికి ఫిర్యాదు చేస్తే వాళ్లకి అవసరం లేకపోతే.. నాకు కావాలని అన్నారు. పోలీసుల బెదిరింపులతో మాకు సాయం చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. మేము పేదవాళ్లమనే ముఖ్యమంత్రి జగన్​ సాయం చేశారు. ఆ డబ్బుల్లో సగం అడిగితే మేము ఎవరికి చెప్పుకోవాలి. ఇప్పటికైనా మాకు న్యాయం చేసి 5లక్షల రూపాయలు అందజేయాలని కోరుకుంటున్నాం"-గంగమ్మ, బాధిత మహిళ

వీడియోలు బయటకు రావటంతో పర్లయ్య దంపతులపై వైసీపీ నేతల బెదిరింపులు మొదలయ్యాయి. దీంతో వారు స్థానిక జనసేన నాయకులకు సమాచారమిచ్చారు. వైసీపీ నాయకుల నుంచి ఆ కుటుంబానికి ముప్పు ఉన్న నేపథ్యంలో వారిని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. మంత్రి అంబటి రాంబాబుపై పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు నిజమని.. అందుకు పర్లయ్య, గంగమ్మ రోదనే సాక్ష్యమని.. ఇంతకంటే నిదర్శనం కావాలా అని జనసేన నేత సాంబశివరావు ప్రశ్నించారు. పవన్‌ కల్యాణ్‌కు ఛాలెంజ్‌లు విసిరేప్పుడు సంయమనంతో మాట్లాడాలని మంత్రి రాంబాబుకు హితవు పలికారు.

చేతికి అందివచ్చిన కొడుకు పోయి ఏడుస్తుంటే.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో వాటా అడగడం వైసీపీ నాయకులకే చెల్లుబాటు అయ్యిందని.. దీనికి మంత్రి అంబటి సమాధానం చెప్పాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు.

'కొడుకు చనిపోయి రూ.5లక్షలు వస్తే.. ఆ మంత్రి సగం ఇమ్మంటున్నారు'

ఇవీ చదవండి:

Last Updated :Dec 20, 2022, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.