ETV Bharat / state

భేటీపై మాటల యుద్దం.. చీకటి ఒప్పందమన్న వైసీపీ.. భయమెందుకంటున్న టీడీపీ నేతలు

author img

By

Published : Jan 9, 2023, 7:40 AM IST

Ysrcp Reaction : తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ భేటీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఇరువురి భేటీని చీకటి ఒప్పందంగా వైసీపీ నేతలు అభివర్ణించగా.. భయంతో వణికిపోతున్నారంటూ తెలుగుదేశం నేతలు ప్రతి దాడి చేశారు.

ysrcp party reaction
పవన్​, చంద్రబాబుల భేటి

Ysrcp Reaction : చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ భేటీపై అధికార పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. సంక్రాంతి మామూళ్ల కోసమే దత్త తండ్రి వద్దకు దత్త పుత్రుడు వెళ్లారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విమర్శించారు. వారి చీకటి బంధం ఇప్పటిది కాదని మరో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఎద్దేవా చేశారు. రాజకీయ ఎజెండా లేని పవన్‌.. జనసేనను ఎందుకు స్థాపించారో చెప్పాలని మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ రాజకీయ డ్రామాలు మానాలని మరో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. వారిరువురిని రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తారని మంత్రులు సీదిరి అప్పలరాజు, దాడిశెట్టి రాజా జోస్యం చెప్పారు .

" పవన్​ కల్యాణ్​ డబ్బులు సంపాదించటం బాగా నేర్చేశాడు. బీజేపీతో పొత్తులో ఉన్నామని అంటే చంద్రబాబు ఆటోమేటిక్​గా రేటు పెంచుతాడు కదా. అందరం దీన్ని లాజీకల్​గా అర్థం చేసుకోవాలి. ఎవరు ఉలిక్కిపడుతున్నారు. సింగిల్​గానే పోటీ చేస్తామని చెప్తున్న నాయకుడు జగన్​మోహన్​ రెడ్డి. ఉలిక్కిపడాల్సిన అవసరం మాకు లేదని.. ఎవరు ఎవరితో కలిసిన జగన్​మోహన్​ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి అని నా అభిప్రాయం." -సీదిరి అప్పలరాజు, మంత్రి

"ప్యాకేజీ పెంచమని పవన్​ కల్యాణ్​ చంద్రబాబు దగ్గరికి వెళ్లినట్లు అనిపిస్తుంది కానీ, వేరే ఉద్ధేశ్యం ఏమి లేదని అనిపిస్తోంది. పవన్​ మాటల్లో నాకు స్పష్టత కనిపించటం లేదు. జగన్​మోహన్​ రెడ్డే ప్రవేశపెట్టినట్టు జీవో నెం1 గురించి మాట్లడుతున్నారు.. స్వాత్వంత్రం వచ్చిన తర్వాత నుంచే జీవో నెం 1 ఉంది. డబ్బుల కోసం రాజకీయం చేసేది కూడా పవన్​ ఒక్కడే." -దాడిశెట్టి రాజా, మంత్రి

అధికార పార్టీ నేతల విమర్శలపై తెలుగుదేశం ఘాటుగా బదులిచ్చింది. పవన్‌, చంద్రబాబు భేటీ జగన్ రెడ్డి ముఠాలో వణుకు పుట్టిస్తోందని టీడీపీ నేతలు ఎద్దేవా చేశారు. ఇరువురు కప్పు కాఫీ తాగితే..వైసీపీ నేతలు మాత్రం మూడు చెరువుల నీళ్లు తాగారని టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్నపాత్రుడు చురకలంటించారు. బాబు, పవన్‌ కలిస్తే భయం లేదని చెప్పేందుకు ఇంత మంది మంత్రులు బయటికి వచ్చారంటే ఎవరు ఎక్కువగా భయపడుతున్నారో ప్రజలకు అర్థమవుతోందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మాజీమంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. పచ్చి అబద్దాలు వల్లె వేస్తున్న మంత్రులు.. 12 తీవ్రమైన కేసుల్లో ముద్దాయి, బెదిరించి కమీషన్లు లాక్కునే వారే ప్యాకేజీలిస్తారని ప్రతిదాడి చేశారు. తన అవలక్షణాలను ఎదుటివారిపైకి నెట్టడం జగన్ రెడ్డికి అలవాటైపోయిందని మండిపడ్డారు. కోడికత్తి, వివేకాపై గొడ్డలివేటును చంద్రబాబుపైకి నెట్టే ప్రయత్నం చేసి విఫలమైన జగన్‌ ముఠా.. చీకటి జీవో తెచ్చేందుకు అమాయకులను పొట్టనబెట్టుకుందని ఆరోపించారు. కందుకూరు, గుంటూరు ఘటనలను కూడా చంద్రబాబుకు ఆపాదించాలని జగన్ ముఠా కుట్ర చేస్తోందని విమర్శించారు.

"పవన్​ కల్యాణ్​ పదే పదే చెప్తున్నారు.. ఈ దుర్మార్గ ప్రభుత్వం, నియంత పరిపాలనకు వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా చీలనివ్వమని ఇది మంచి పరిణామం. దీన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. చంద్రబాబు, పవన్​ కలిస్తే ఒక ప్రభంజనం. మంత్రుల కామెంట్లు చూస్తే వారు వణికిపోతున్నట్లు అనిపిస్తోంది. ఒక మంత్రి అంటున్నాడు, డూడూ బసవన్న లాగా వెళ్లిపోయాడని. బసవన్న నందీశ్వరుడితో సమానం. పండగకు బసవన్న వస్తే ప్రజలు సంతోషిస్తారు. దానికి అర్థం తెలియని మంత్రులు ఈరోజు ఉన్నారు." - సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీమంత్రి

చంద్రబాబు, పవన్‌కల్యాణ్ భేటీని శుభపరిణామంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభివర్ణించారు. ప్రతిపక్షాలు అన్నీ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న వైకాపాపై పోరాడాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.