కలిసి రాని 'రాజధాని'.. ఉత్తరాంధ్ర తీర్పుపై వైసీపీ అంతర్మథనం

author img

By

Published : Mar 19, 2023, 9:41 AM IST

ysrcp defeat

MLC Elections : మండలి ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టి విజయం సాధించాలని.. వచ్చే తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు కావాలని గతంలో వైసీపీ నేత వైవీసుబ్బారెడ్డి అన్నారు. ఇప్పుడు పట్టభద్రులు ఇచ్చిన ఎన్నికల తీర్పులో వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. అసలు ఈ ఎన్నికలు దేనికి సంకేతం.

MLC Elections Results : సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించిన మండలి ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం..? ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పట్టభద్రులు ఓటు రూపంలో ప్రతింబింబించారా..? మరీ ముఖ్యంగా రాజధాని తరలిస్తున్నాం.. పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ అధికార పార్టీ నేతలు ఊదరగొట్టినా.. ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఏమాత్రం అంగీకరించలేదంటే వారు ఏం కోరుకుంటున్నారు..? ఆరు జిల్లాల పరిధిలో పోలింగ్ జరిగినా ఏ ఒక్కరౌండ్‌లోనూ అధికార పార్టీ అభ్యర్థి మెజార్టీ సాధించలేదంటే.. ప్రభుత్వ పాలనపై అంత వ్యతిరేకత ఉందా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

గతంలో ఎన్నికపై వైవీ సుబ్బారెడ్డి : 'ఈ ఎన్నిక ఎంత ప్రతిష్టకరంగా తీసుకున్నామనే దానికి మనం గత వారం, పదిరోజులుగా దీనిపై దృష్టి పెట్టి.. మన పార్టీ మద్దతుతో ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థి గెలుపు ఏ విధంగా ఉండాలి. గత నాలుగు సంవత్సరాల నుంచి మన ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ పాలనే మనకి.. ఈ ఎన్నికలలో బలం చేకూరుస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రతిపక్షాలు మనపై దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిని మనం సమర్థవంతంగా తిప్పికొట్టడానికి మనం ఈ ఎన్నికలను వాడుకోవటానికి దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ ఎన్నికలలో ఓటు వేసే ప్రతి ఒక్కరూ పట్టభద్రులు. వారు ప్రభుత్వంపై, ప్రభుత్వంపై అవగాహన కలిగి ఉంటారు. వారిచ్చే తీర్పుతోనైనా ప్రతిపక్షాలకు కనువిప్పు కలుగుతుంది' అని వైసీపీ నేత సుబ్బారెడ్డి పిబ్రవరి 23వ తేదీన ఓ సమావేశంలో అన్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల మండలి ఎన్నికల్లో ఓటమిపై వైసీపీ అంతర్మథనం

ఇవి వైసీవీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేవారంతా పట్టభద్రులేనని, వారికి ఖచ్చితంగా రాష్ట్ర పాలనపైనా, రాష్ట్రంలో పరిస్థితులపైనా ఖచ్చితమైన అవగాహన ఉంటుందని.. వారిచ్చే తీర్పు వైసీపీ పాలనకు గీటురాయి అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఒకరకంగా వారి తీర్పు రాష్ట్ర పరిస్థితులను ప్రతిబింబిస్తాయన్న రీతిలో ఆయన వ్యాఖ్యానించారు. మరి వీటిని ప్రామాణికంగా తీసుకుంటే.. ఉత్తరాంధ్ర ప్రజలు వైసీపీ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టమైన తీర్పు ఇచ్చారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

మూడు రాజధానుల నిర్ణయానికి రెఫరెండం అన్న రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ముమ్మర ప్రచారం చేసినా.. ఉత్తరాంధ్ర ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. రాజధాని, దానివల్లే కలిగే లాభనష్టాలను కొద్దొగొప్పో అంచనా వేయగలిగే పట్టభద్రుల మద్దతు కూడగట్టుకుని తద్వారా తమ వాదనకు బలం చేకూర్చుకోవాలనుకున్న ప్రభుత్వ పెద్దలకు ఊహించని షాక్‌ తగిలింది. ముఖ్యంగా పట్టభద్రుల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకతలను వారు ఊహించలేదు. అసలు తప్పు ఎక్కడ జరిగిందన్న దానిపై నేతలు తీవ్రస్థాయిలో మదనపడుతున్నారు .

అభ్యర్థి ఎంపిక కూడా.. ఎన్నికలో పోటీగా దించేందుకు అభ్యర్థి ఎంపిక సైతం బెడిసికొట్టిందన్న వాదన ఉంది. గోదావరి జిల్లాకు చెందిన సీతంరాజు సుధాకర్‌ విశాఖలో స్థిరపడ్డారు. విజయసాయితోపాటు వైవీసుబ్బారెడ్డితోనూ సత్సంబంధాలు ఉండటం.. ఆర్థికంగానూ ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో వైసీపీ పట్టభద్రుల అభ్యర్థిగా పోటీలో దించారు. అయితే క్షేత్రస్థాయిలో నేతలతో అభ్యర్థి సరిగా సమన్వయం చేసుకోకపోవడం, రెండో ప్రాధాన్యత ఓటు గురించి వైసీపీ పెద్దగా ఆలోచించకపోవడం ఓటమికి కారణాలుగా పేర్కొంటున్నారు.

వ్యతిరేకతను ఓటు రూపంలో : తెలుగుదేశం అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు ఉత్తరాంధ్ర పట్టభద్రులకు సుపరిచితుడు కావడం బాగా కలిసొచ్చింది. ఆర్థికశాస్త్ర అధ్యాపకుడిగా యువతలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో వారు తెలియపరిచారు. రెండో ప్రాధాన్య ఓట్లను సంపాధించడంలోనూ తెలుగుదేశం ముందుగానే తెలివిగా వ్యవహరించడం బాగా కలిసొచ్చింది. రాజధాని తరలిస్తున్నామంటూ స్వయంగా ప్రభుత్వ పెద్దలు ప్రకటించినా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా పెట్టుబడిదారుల సదస్సు సైతం ఇటీవలే విశాఖలో నిర్వహించినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.