Two-wheeler theft gang arrested: ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లులో అంతరాష్ట్ర ద్విచక్ర వాహనాల చోరీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 23వ తేదీన జగ్గయ్యపేట ఆటో నగర్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేపడుతున్న సమయంలో.. రెండు బైక్లపై ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోతుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ముఠాలో నలుగురు నిందితులను అరెస్ట్ చేయగా.. వారి నుంచి 40 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనపరచుకున్నట్లు డీఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. వీటి విలువ సుమారు రూ.25లక్షల వరకూ ఉండవచ్చని అంచనా వేశారు.
ఈ నెల 9వ తేదీన ముక్త్యాల గ్రామంలో ఒక మోటార్ సైకిల్ దొంగతనం చేసి మరో ప్రాంతంలో దాచిపెట్టి.. 23న అమ్మేందుకు వెళ్తుండగా పోలీసులు దానిని దొంగిలించిన వాహనంగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన మక్కాల ముకేష్, బూరె సైదా, గుంజి లక్ష్మయ్య అనే ముగ్గురు వ్యక్తులు జల్సాలకు అలవాటు పడి డబ్బులు లేక మోటార్ సైకిళ్లు దొంగతనం చేసి.. అమ్ముతున్నారని పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 11 మోటార్ సైకిళ్లు, నల్గొండ, చిలకలూరిపేటలో 2, నరసరావుపేట, వినుకొండ, పరుచూరు, సత్తెనపల్లి, కారంపూడి, అద్దంకి, మిర్యాలగూడల్లో ఒక్కో మోటార్ సైకిల్, ప్రకాశం జిల్లాలో 8, గుంటూరు జిల్లా వివిధ ప్రాంతాల్లో 10 మోటార్ సైకిళ్లను దొంగతనం చేసినట్లు గుర్తించామన్నారు.
దొంగింలించిన వాహనాల్లో కొన్నింటిని నరసరావుపేట చెందిన కొమ్మిశెట్టి కోటేశ్వరరావుకు అమ్మినట్లు పోలీసులు గుర్తించి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు నుంచి 20 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులు కె.అగ్రహారం అట్టల ఫ్యాక్టరీ వద్ద దాచిన 19 వాహనాలు, ముకేష్ నుంచి ఒక వాహనం.. మొత్తం 40 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డిప్యూటీ కమిషనర్ మేరీ ప్రశాంతి తెలిపారు.
ఇవీ చదవండి: