ETV Bharat / state

Vijayawada to Secretariat, High Court Road : ప్రజాప్రతినిధులు వెళ్లేమార్గమే ఇలా ఉంటే.. మరీ సాధారణ రోడ్లు

author img

By

Published : May 24, 2023, 9:36 AM IST

Vijayawada to Secretariat Road
కరకట్ట రోడ్డు

Vijayawada to Secretariat Road : ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయ ఉద్యోగులు, హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు.. నిత్యం ప్రయాణం సాగించే రహదారి అది. విజయవాడ నుంచి సచివాలయం, హైకోర్టుకు వెళ్లాలంటే అదొక్కటే మార్గం. అంతటి ముఖ్యమైన రహదారి విస్తరణ పనులు.. ముందుకు సాగడం లేదు. ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు ఆ దారి గుండా వెళ్లే సమయాల్లో సాధారణ ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్భాటంగా విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పూర్తిచేయడంలో శ్రద్ధ చూపట్లేదు సామాన్యులకు కష్టాలు తప్పడం లేదు.

ముందుకుసాగని విజయవాడ-ఉండవల్లి కరకట్ట రహదారి విస్తరణ పనులు

Vijayawada to Secretariat Road Construction Works : విజయవాడ నుంచి సచివాలయం, హైకోర్టుకు వెళ్లే రహదారి.. విస్తరణకు నోచుకోవడం లేదు. 150 కోట్ల రూపాయలతో ఉండవల్లి కరకట్ట రహదారి విస్తరణ పనులకు 2021 మే నెలలో ముఖ్యమంత్రి జగన్‌ భూమి పూజ చేశారు. రెండేళ్లు పూర్తయినా విస్తరణ పనులు ముందుకు సాగడం లేదు. ఉండవల్లి కరకట్ట నుంచి వైకుంఠపురం వరకు దాదాపు 15 కిలోమీటర్ల పొడవునా.. రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 10 మీటర్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ చేపట్టాలని భావించినా.. పనులు పూర్తి కావడం లేదు.

ఈ రహదారిలో ఒక వాహనం వెళ్తే మరో వాహనం పక్కనుంచి వెళ్లడానికి అవకాశం లేదు. ఈ దారి గుండా విజయవాడకు ప్రయాణాన్ని కొనసాగించాలంటే వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రైతుల నుంచి కొంత భూసేకరణ చేసి.. మట్టి, కంకర వేసి రహదారికి అనుగుణంగా చదును చేశారు. మిగతా పనులు పూర్తి చేయడానికి భూములివ్వడానికి రైతులు అంగీకరించడం లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది. రైతులను ఒప్పించి భూమి సేకరించడంలో.. అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు.

రోడ్డు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. పైగా ఇదే రహదారిలో ముఖ్యమంత్రి, మంత్రులు సహా ఉన్నతాధికారులు, హైకోర్టు న్యాయమూర్తులు రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉండటంతో.. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్‌ అధికంగా ఉంటుంది. ఆ సమయాల్లో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురువతున్నాయి. చాలా సేపు వేచి ఉండాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ఉదయం పూట విజయవాడు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఉదయం 9గంటలకు ఆపారంటే 11గంటల వరకు విజయవాడ వెళ్లటానికి ఈ రోడ్డు గుండా ప్రవేశం లేదు. ఉండవల్లి నుంచి తిరిగి వెళ్లాలి. రోడ్డు పనులు చేపట్టారు. అది సగం పూర్తి చేసి ఆపారు. సాయంత్రం 5 అయ్యిందంటే.. 7 గంటల వరకు రానివ్వరు." -ప్రయాణికుడు

కరకట్ట రోడ్డును బైపాస్‌కు అనుసంధానం చేయాలన్న లక్ష్యంతో ప్రారంభించిన విస్తరణ పనులు.. నేటికీ ముందుకు సాగకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. త్వరగా విస్తరణ పనులు పూర్తయితే తమకు ప్రయాణ కష్టాలు తప్పుతాయని కోరుతున్నారు.

"రోడ్డు వెడల్పుగా లేకపోవటం వల్ల వాహనాలు ఆగి ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. దీనివల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు విస్తరణ పనులు త్వరితగతినా పూర్తి చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కోరుతున్నాను." -ప్రయాణికుడు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.