ETV Bharat / state

బెజవాడలో భానుడి భగభగలు.. ఎండకు ఉక్కిరిబిక్కిరవుతోన్న ప్రజలు

author img

By

Published : Jun 5, 2023, 1:34 PM IST

ఎండ వేడికి తట్టుకోలేక బెజవాడ వాసులు అల్లాడిపోతున్నారు. అధిక వేడితో పాటు తీవ్ర ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాత్రి సమయంలో కూడా వేడి ప్రభావం ఉంటోందని ఆవేదన చెందుతున్నారు. గత మూడు నాలుగు రోజుల నుంచి ఈ పరిస్థితులున్నాయని, మరికొన్ని రోజుల తప్పేలా లేదని నిట్టూరుస్తున్నారు.

sun in vijayawada
విజయవాడలో ఎండ

Summer stroke in Vijayawada భానుడి ప్రతాపంతో బెజవాడ నగరం ఉక్కిబిక్కిరవుతోంది. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతన్న ఎండ వేడి, వడగాడ్పులు సాయంత్రం వరకూ తగ్గుముఖం పట్టడం లేదు. ఉదయం వేళ 10 దాటిన తర్వాత బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వడగాల్పుల వల్ల ఇంట్లో కూడా ఉండలేకుండా పోతున్నామని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉదయం 8 గంటలకే ఎండ వేడిమితో చిటపటలు మొదలవుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నగరలోని ప్రధాన రహదారులు జనసంచారం లేక బోసిపోతున్నాయి. రోహిణి కార్తె కావడంతో గత నాలుగైదు రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి రోజు 45 డిగ్రీలకు పైనే ఉష్ణ్రోగతలు నమోదవుతున్నాయి. 10 దాటిన తర్వాత ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో విజయవాడ నగరం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. భానుడి భగభగలకు తోడు విపరీతమైన వేడి గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఉదయం 9 గంటల నుంచి మొదలవుతున్న వేడి గాలులు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు కూడా తగ్గుముఖం పట్టడం లేదు. ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు బయట అడుగు పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఏదైనా అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు బయటకు వచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రోహిణి కార్తె కావడంతో ఎండలు ఇంతలా మండిపోతున్నాయని స్థానికులు చెబుతున్నారు. వేడి గాలులకు ఇంట్లో ఉండలేకపోతున్నామని వాపోతున్నారు. రాత్రి అయినా వేడి గాలులు తగ్గడం లేదని అంటున్నారు.

"ఎండలు బాగా మండుతున్నాయి. ఎండుకు వేడిగా, వడగాలులు వీస్తున్నాయి. రాబోయే నాలుగు రోజుల నుంచి వారం రోజుల వరకు ఎక్కువగా ఉంటుంది. తర్వాత వాతావరణం చల్లగా అవుతుందేమోనని చూస్తున్నాము." - స్థానికులు

"ఈరోజుకు నాలుగు రోజులు.. సాయంత్రం ఆరు గంటల వరకు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి. ఎండ నుంచి తట్టుకోవటానికి ఎక్కడైనా చల్లటి వాతావరణం ఉంటే అక్కడ ఉపశమనం పొదంటం.. ఏసీలు ఆన్​ చేస్తేనే చల్లగా ఉంటోంది. కొద్ది సమయం పని చేసిన తర్వాత ఏసీలు కూడా ఆగిపోతున్నాయి." - స్థానికులు

ఎండ తీవ్రత కారణంగా చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేడి, విపరీతమైన ఉక్కపోత, వడగాలులతో సతమతమవుతున్నారు. ఇంట్లో ఫ్యాన్లు, కూలర్లు తిరుగుతున్న ఉండలేని పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. అధిక వేడికి ఆనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్తున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రోహిణి కార్తెలో ఎండల తీవ్రత అధిమని తెలిసిన.. మరి ఇంత దారుణంగా ఉంటుందని తాము అనుకోలేదని అంటున్నారు.

గతంతో పోలిస్తే ఈసారి ఉష్ణోగ్రతలు విజయవాడలో విపరీతంగా ఉన్నాయని.. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే ఎండ ధాటికి నీరసించిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఉపాధి, ఉద్యోగాల కోసం వెళ్లే వారు సైతం మండుతున్న ఎండల కారణంగా అవస్థలు పడుతున్నారు. భానుడి ఉగ్రరూపంతో పగటిపూట పనులు కూడా చేసుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఎండ వేడికి ఇంట్లో ఉండలేక, బయట ఉండలేక నరకం చూస్తున్నామని వాపోతున్నారు. పగలంతా పని చేసి రాత్రి సమయంలో ప్రశాంతంగా నిద్ర పోవాలనుకున్న ఎండకు రాత్రుల్లో కూడా వేడి తగ్గటం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

భానుడి భగభగలతో ప్రజల అవస్థలు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.