ETV Bharat / state

తెలంగాణ కొత్త సచివాలయం పనులు చకచకా.. ప్రారంభం అప్పుడేనా..!

author img

By

Published : Jan 15, 2023, 7:33 AM IST

Telangana New Secretariat : నెలాఖరులోపు కొత్త సచివాలయాన్ని ప్రారంభించే ఆలోచనతో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు అనుగుణంగా భవనాన్ని సిద్ధం చేసేలా పనులు వేగవంతం చేశారు. తుదిదశ పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. అమరవీరుల స్మారకం, అంబేద్కర్ విగ్రహం పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిర్ధేశిత గడువులోగా పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయి.

telangana new secretariat
తెలంగాణ కొత్త సచివాలయం

Telangana New Secretariat : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం పనులు తుదిదశకు చేరుకున్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చే తదుపరి మంచిరోజున సచివాలయాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో సర్కార్ ఉంది. ఐతే ఈనెల 18న కంటివెలుగు రెండోవిడత కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండడంతోపాటు ఖమ్మం వేదికగా భారత రాష్ట్ర సమితి భారీ బహిరంగసభ నిర్వహిస్తున్నారు. టీఆర్​ఎస్​ను బీఆర్​ఎస్​గా మార్చిన తర్వాత జరుగుతున్న తొలిసభ కావడంతో పార్టీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొంది.

Telangana New Secretariat inauguration : సచివాలయానికి సంబంధించిన తుదిపనులు ఇంకా కొనసాగుతుండటంతో నెలాఖరులోపు ప్రారంభించాలన్న ఆలోచనలో రాష్ట్రప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీలైతే మొత్తం భవనం లేదంటే ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే ఆరోఅంతస్థు, సాధారణ పరిపాలనాశాఖ కోసం మరో అంతస్థు సిద్ధం చేసి ప్రారంభిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఐతే ఇప్పటివరకు సచివాలయభవన ప్రారంభంపై అధికారికంగా ఎలాంటి ఆదేశాలు, సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు.

ఫ్లోరింగ్, ఫాల్ సీలింగ్, ప్రధాన ప్రవేశద్వారం, పోర్టికో వంటి పనులు జరుగుతున్నాయి. భవనంముందు విశాలంగా ఉండేలా పచ్చికబయళ్లు, ల్యాండ్‌స్కేపింగ్‌ పనులు సమాంతరంగా సాగుతున్నాయి. మూడు షిఫ్టుల్లో 24 గంటల పాటు పనులు చేస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తరచూ సచివాలయ పనులు పరిశీలిస్తూ పురోగతిని తెలుసుకోవడం సహా వేగవంతానికి ఆదేశాలిస్తున్నారు. వీలైనంత త్వరగా పనులన్ని పూర్తి చేయాలని గుత్తేదారుకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

సచివాలయం ఎదురుగా మరో ప్రతిష్టాత్మక నిర్మాణమైన తెలంగాణ అమరవీరుల స్మారకం పనులు తుదిదశలో ఉన్నాయి. స్మారకానికి చెందిన ఫినిషింగ్ పనులు సాగుతున్నాయి. స్టీల్ ప్యానెలింగ్ ఇప్పటికే పూర్తికాగా లోపలఫాల్‌సీలింగ్ పనులు జరుగుతున్నాయి. అమరులస్ఫూర్తి నిత్యం జ్వలించేలాస్మారకంపైన ఉన్న దీపానికి రంగుల పనులు సాగుతున్నాయి. నిత్యం వెలుగుతున్నట్లు అనిపించేలా రంగులు అద్దుతున్నారు. 20 ఏళ్ల పాటు రంగులు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం దుబాయ్ నుంచి అవసరమైన సామాగ్రి తీసుకొచ్చారు. స్మారకం ప్రాంగణంలో ల్యాండ్ స్కేపింగ్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి.

తెలంగాణ తల్లి విగ్రహం పనులు తుదిదశకు చేరుకున్నాయి. నెలాఖరు లోపు స్మారకాన్ని సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. సచివాలయంసమీపంలో రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్​ అంబేడ్కర్‌ భారీ విగ్రహం ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 125 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటివరకు 50 అడుగుల మేర పనులు పూర్తయ్యాయి.

విగ్రహం కింది నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫ్లోరింగ్ సహా ఇతరపనులు సాగుతున్నాయి. మ్యూజియానికి చెందిన పనులతో పాటు ల్యాండ్ స్కేపింగ్ పనులు పూర్తిచేయాల్సి ఉంది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు విగ్రహాన్ని ఆవిష్కరించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మార్చిలోపేఅన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.