ETV Bharat / state

అన్నదాతల సంబరం.. మన సంక్రాంతి పర్వం..

author img

By

Published : Jan 14, 2023, 6:01 AM IST

Sankranti Festival Story : పండు వెన్నెలను పోలిన వెండి ముగ్గులు.. మధ్యలో గొబ్బెమ్మలు..పసిడి కాంతుల్ని మించిన సొగసులు.. పడుచు పిల్లల ఆటపాటలు..పచ్చని పంటసిరులు.. హరిదాసులు, గంగిరెద్దులు.. ఏం కోలాహలం..ఎంత సందడి.. తెలుగువారికి పెద్ద పండగంటే సంక్రాంతే!

Sankranti Festival Story
సంక్రాంతి పర్వం

Sankranti Festival Story : సూర్యభగవానుడి దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభించే దినమే మకర సంక్రాంతి. ఈ మూడు రోజుల ముచ్చటైన పండుగలో తొలిరోజు భోగి. ఇది దక్షిణాయనానికి తుది రోజు. పితృ దేవతారాధన దక్షిణాయనంలో ప్రధానం కనుక పాత వస్తువులను భోగిమంటల్లో దహనం చేసి దేవతారాధనకు అనుకూలమైన ఉత్తరాయణాన్ని ఆహ్వానిస్తాం. బదరీ వృక్షాన్ని (రేగుచెట్టు) విష్ణుమూర్తి ప్రతి రూపంగా భావించడం, పిల్లలకు భోగిపళ్లు పోయడం ఆచారం. తలమీద రేగుపళ్లను పోయడం వల్ల పరమాత్ముని ఆశీస్సులు ప్రత్యక్షంగా అందుతాయంటారు.

మహా పుణ్యకాలం.. సూర్యుడు ధనూరాశిని వీడి మకరరాశిలో ప్రవేశించే శుభతరుణం మకర సంక్రాంతి. ఆ రోజున కొత్తబియ్యంతో పిండివంటలు వండి ప్రసాదంగా నివేదిస్తారు. దేవతలకు దక్షిణాయనం రాత్రి సమయం కాగా, ఉత్తరాయణం పగటి పూట. వారు సుప్తావస్థను వీడి చైతన్య స్థితిలో భక్తులను అనుగ్రహించే కాలమిది. అందుకే భీష్మ పితామహుడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై వేచి ఉన్నాడు. సంక్రాంతి నాడు కుంకుమ, ధాన్యం, బెల్లం, వస్త్రాలను దానం చేస్తే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది అËంటారు పెద్దలు. ధాన్యం ఇంటికి చేరే రోజులు కాబట్టి రైతులందరూ సంతోష సంబరాలతో పండుగ చేసు కుంటారు. హరిదాసులు, పగటి వేషగాళ్లు, గంగిరెద్దుల వాళ్లు- ఇలా అనేక వృత్తులవారు నేలతల్లిని నమ్ముకున్న రైతులను ఆశ్రయిస్తారు. ఎవరినీ వట్టి చేతులతో పంపకుండా శక్తికొద్దీ దానం చేసి ఆనందాలు పంచే దృశ్యాలు కనువిందు చేస్తాయి.

పశువుల పట్ల కృతజ్ఞత.. మన మనుగడకు పశువులు ఎంత ముఖ్యమో గుర్తుచేసుకుంటూ కనుమ నాడు వాటిని అందంగా అలంకరించి భక్తితో పూజించడం ఆనవాయితీ. పశువుల పట్ల కృతజ్ఞత చూపుతూ వాటి శ్రమకు గుర్తింపు ఇవ్వాలన్నది మనవాళ్ల సదుద్దేశం. వాటి ఆరోగ్య రక్షణకు ఓషధులను సేకరించి మేతలో కలిపి తినిపించడం సత్సంప్రదాయం. పసుపు కుంకుమలతో అలంకరించిన పశువులను ఊరేగించడం నేటికీ చూడొచ్చు. ఒకప్పుడు ప్రతి గ్రామంలో గెలుపెద్దుల మాన్యం అంటూ కొంత భూమి ఉండేది. గ్రామ పెద్దలు కనుమ నాడు ఎడ్ల పందాలు నిర్వహించేవారు. గెలిచిన పశువులు గెలుపెద్దుల మాన్యంలో లభించే పచ్చగడ్డిని మళ్లీ వచ్చే సంక్రాంతి వరకు ఉచితంగా ఆరగించేందుకు అనుమతి ఉండేది. ఇలా కనుమ కనులపండుగై అలరిస్తుంది.

పండుగల పేరుతో తరతరాల సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నాం. దేనికదే ప్రత్యేకమైనా సంక్రాంతి ఆధ్యాత్మిక చింతనకు పెద్దపీట వేసే అపురూప పర్వదినం. వాకిట్లో తీర్చిదిద్దే ముగ్గుల దగ్గర్నుంచీ హరిదాసుల కీర్తనల వరకూ అర్థవంతమైన ఆచారాలూ ఆంతర్యాలతో మధురానుభూతులు కలిగించే ఆనంద పర్వం.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.