ETV Bharat / state

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు.. పోటెత్తిన భక్తులు

author img

By

Published : Mar 22, 2023, 10:32 PM IST

Kanaka Durga Temple In Vijayawada : ఉగాది పండుగ సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పొటెత్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ వాతావరణం నెలకొంది. బుధవారం సాయంత్రం మల్లిఖార్జున మండపం నుంచి స్వామి, అమ్మవారిలను వెండి రథంపై ఉంచి ఊరేగించనున్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ
ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

Kanaka Durga Temple In Vijayawada : తెలుగు సంవత్సరాది రోజున ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులతో రద్దీ వాతావరణం నెలకొంది. బుధవారం నుంచి వసంత నవ రాత్రులు ప్రారంభం కావడంతో ఉదయం తొమ్మిది గంటల తర్వాత భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ అనంతరం అమ్మవారికి, ఉపాలయాల్లోని దేవతా మూర్తులకు స్నపనాభిషేకం నిర్వహించారు.

మార్చి 31 వరకు వసంత నవ రాత్రులు : అనంతరం అర్చన, నివేదన, హారతి కార్యక్రమములు ఏకాంతంగా జరిపారు. కొండపైన చినరాజగోపురం ఎదురు లక్ష్మీ గణపతి స్వామి మందిరం వద్ద వసంత నవ రాత్రులను పురస్కరించుకుని కళశస్థాపన, పుష్పార్చనలు ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారికి మల్లెలు, మరుమంతో అర్చన చేశారు. ఒక్కోరోజు ఒక్కో రకం పుష్పాలతో అమ్మవారికి పూజలు చేయనున్నారు. బుధవారం నుంచి మార్చి 31 వరకు వసంత నవ రాత్రులు ఘనంగా జరిగుతాయని దుర్గగుడి ఈవో భ్రమరాంబ తెలిపారు. ఈ పూజల్లో పాల్గొనేందుకు భక్తులకు కూడా అవకాశం కల్పించారు. వసంత నవ రాత్రి పూజలను తిలకించడంతో పాటు అమ్మవారిని ఉగాది రోజున దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో ఇంద్రకీలాద్రి కిక్కిరిసింది.

వెండి రథంపై అమ్మవారి ఊరేగింపు : ఐదు వందల రూపాయల అంతరాలయ దర్శనం క్యూలతో పాటు అన్ని వరుసలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రముఖులు కూడా అమ్మవారిని తెలుగు సంవత్సరాది రోజునే దర్శించుకునేందుకు రావడంతో మరింత రద్దీ పెరిగింది. వీఐపీలతో పాటు సామాన్య భక్తులకు కూడా అసౌకర్యం కలుగకుండా ఉండేందుకు ఆలయ ఈవో భ్రమరాంబ, ఈఈ రమాదేవి సహా ఇతర అధికారులు అంతా భక్తుల వరుసలను క్రమబద్ధీకరించే పనిలో నిగమ్నమయ్యారు. భక్తులకు ఉగాది ప్రసాదంతో పాటు మజ్జిగను కూడా అందజేశారు. బుధవారం సాయంత్రం మల్లిఖార్జున మండపం నుంచి స్వామి, అమ్మవారిలను వెండి రథంపై ఉంచి ఊరేగించనున్నారు.

"శోభకృత్‌ నామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. విజయవాడ శ్రీ మల్లేశ్వర దేవస్థానంలో ఈరోజు నుంచి వసంత నవ రాత్రులు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి పుష్పార్చనతో ఈ వంసంత నవరాత్రులు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి రోజుకో రకం పుష్పాలతో మార్చి 31 వరకు వసంత నవ రాత్రులు ఘనంగా జరుగుతాయి. కాబట్టి భక్తులు ఎవరైనా సరే అమ్మవారికి పుష్పార్చనతో కార్యక్రమంలో పాల్లొనాలని కోరుకుంటున్నాను. - " భ్రమరాంబ, దుర్గగుడి ఈఓ

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.