ETV Bharat / state

'రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 15, 2023, 7:50 PM IST

CPM Prajarakshana Bheri in Vijayawada : రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో సీపీఎం నిర్వహించిన ప్రజారక్షణ భేరీ సభలో ఆయన పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు సాధ్యం కాదని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు మళ్లీ జగన్ రావాలా అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రశ్నించారు.

CPM_Prajarakshana_Bheri_in_Vijayawada
CPM_Prajarakshana_Bheri_in_Vijayawada

"మోదీ, అమిత్ షా సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు సాధ్యం కాదు-రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు మళ్లీ జగన్ రావాలా?"

CPM Prajarakshana Bheri in Vijayawada : రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని, ఏపీకి కేంద్ర పాలకులు ద్రోహం చేశారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) ఆరోపించారు. ఏపీ విభజన చట్టం తెచ్చినప్పుడు ఏపీకి అన్యాయం జరుగుతుందని ముందే చెప్పామని.. విభజన అనంతరం బీజేపీ పాలకులు సైతం రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆయన ధ్వజమెత్తారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎంబీపీ స్టేడియంలో నిర్వహించిన సీపీఎం ప్రజారక్షణ భేరీ బహిరంగ సభలో (CPM Prajarakshana Bheri in Vijayawada) సీతారాం ఏచూరి పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.

CPM Leaders Fire on YSRCP and bjp Government : ప్రజారక్షణ భేరీ సదస్సుకు ముఖ్యఅతిధిగా హాజరైన సీతారాం ఏచూరి మాట్లాడుతూ.. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. 24 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోదీ ప్రారంభించారని.. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల మధ్యలో కేంద్రం రైతుల ఖాతాల్లో మొత్తాలను జమ చేస్తుందని.. దీనిని ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదన్నారు. రాజ్యాంగాన్ని అన్నివైపులా ధ్వంసం చేస్తున్నారని.. మైనార్టీలపై దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆఖరికి మీడియా సంస్థలను వదలడం లేదని.. ఈ కేసులమీ రుజువు కావని.. కేవలం వేధించడమే పాలకుల ఎజెండాగా సీతారాం అభివర్ణించారు. తొమ్మిదేళ్లలో 16 లక్షల కోట్ల రూపాయల మేర బడాబాబుల అప్పులను రద్దు చేశారని.. పోర్టులు, ఎయిర్ పోర్టులు ఆదాని, అంబానీలకు అప్పగిస్తున్నారని సీతారాం ఏచూరి దుయ్యబట్టారు.

రాష్ట్ర అభివృద్ధిలో జగన్​ ప్రభుత్వం పూర్తిగా విఫలం - ప్రజా సమస్యలే ఎజెండాగా 15న 'ప్రజారక్షణ భేరి' : సీపీఎం

ఈడీ, సీబీఐకి వైసీపీ, టీడీపీ భయపడుతున్నాయి : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు మోదీ మోజులో ఉన్నాయని.. ఈడీ, సీబీఐకి వైసీపీ, టీడీపీ భయపడుతున్నాయని అన్నారు. ప్రజల వైపు ఉన్నారా? మోదీ వైపు ఉన్నారా? అనే విషయమై రాష్ట్రంలో పార్టీలు తేల్చుకోవాలని చెప్పారు. చంద్రబాబు అరెస్టు వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని సీతారాం చెప్పారు.

మోదీ, అమిత్ షా సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు సాధ్యం కాదు : అనంతరం సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డితో పాటు కేంద్రంలోని మోదీకి వ్యతిరేకంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం ఏపీనేనని.. వైసీపీ, టీడీపీ ఎంపీలు సంపూర్ణంగా పార్లమెంటులో బీజేపీకి మద్దతునిస్తున్నారని గుర్తు చేశారు. ప్రధాన పార్టీలకు వెన్నుపూస లేదని, మోదీని వ్యతిరేకించడానికి ధైర్యం చాలడం లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి జగన్ కు ధైర్యం లేదని.. మోదీ, అమిత్ షా సహకారం లేకుండా చంద్రబాబు అరెస్టు సాధ్యం కాదని రాఘవులు అభిప్రాయపడ్డారు.

'వేల కోట్ల కుంభకోణంలో అమిత్‌ షా, జగన్ కుమ్మక్కు - పురందేశ్వరి ఫిర్యాదు చేసినా ఏపీలో లిక్కర్ దందాపై చర్యలేవీ'

సామాజిక సాధికార యాత్రలు కాదు.. సామాజిక సంహార యాత్రలు : మోదీయే అమరావతి రాకుండా అడ్డుకుంటున్నారని ఆక్షేపించారు. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంటే జగన్ పల్లెత్తి మాటనడం లేదని ఆరోపించారు. వైసీపీ చేస్తున్నవి సామాజిక సాధికార యాత్రలు కాదని.. సామాజిక సంహార యాత్రలని ఎద్దేవా చేశారు. ఇంగ్లీష్ చదువులంటూ జగన్ ఊదరగొడుతున్నారని, ప్రపంచ బ్యాంకు నుంచి 2వేల కోట్ల అప్పు తీసుకోవడమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. నూటికి 90 మందికి ఇంగ్లీష్ చదువులు అవసరం లేదని రాఘవులు అభిప్రాయపడ్డారు.

కరవుతో అల్లాడుతున్న ప్రజలను ఆదుకోవాలి : సీపీఎం కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో పదవుల కోసం కొట్లాట తప్ప.. ప్రజా సమస్యలపై దృష్టి లేదని ఆరోపించారు. ఏపీ నీడ్స్ జగన్.. ఎందుకని? ఏమి సాధించారని శ్రీనివాసరావు ప్రశ్నించారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సొంత అజెండాతో రాష్ట్రంలోని పార్టీలు వ్యవహరిస్తున్నాయని.. ప్రజల సమస్యలే సీపీఎం అజెండాగా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ప్రజారక్షణభేరీ యాత్రల సందర్భంగా ప్రజల సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు చూపుతూ సీపీఎం విడుదల చేసిన ప్రత్యామ్నాయ ప్రణాళికను సభలో నేతలు ఆవిష్కరించారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు : విజయవాడ అజిత్ సింగ్ నగర్​లోని మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో నిర్వహించిన సీపీఎం ప్రజారక్షణ భేరీ సదస్సు నిర్వహంచారు. రాష్ట్ర వ్యాప్తంగా కదలివచ్చిన ఎర్రసైనికులతో ప్రాంగణం అరుణవర్ణాన్ని సంతరించుకుంది. అంతకుముందు బీఆర్టీఎస్ రోడ్డు నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన.. గవర్నమెంట్ ప్రెస్, బుడమేరు వంతెన మీదుగా సింగ్ నగర్ ఫ్లైఓవర్​కు చేరుకుంది. వేలాదిమంది కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. దారి పొడవునా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సీఎం సొంత జిల్లాలో నీటి కొరత - కరవు ప్రాంతంగా ప్రకటించకపోవడంపై సీపీఐ ఎద్దేవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.