కోడి పందేల జోరు.. ప్రజాప్రతినిధుల హుషారు.. కానరాని ఖాకీలు

author img

By

Published : Jan 17, 2023, 7:01 AM IST

COCKFIGHTS IN AP

COCKFIGHTS IN AP : రాష్ట్రంలో మూడ్రోజుల పాటు కోడి పందేలు జోరుగా సాగాయి. ప్రజాప్రతినిధులే దగ్గరుండి మరీ పందేలు వేశారు. బరుల వద్ద కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇక గుండాట, పేకాటలోనూ డబ్బు వరదలా పారింది. కొన్నిచోట్ల బరుల వద్ద ఘర్షణలూ జరిగాయి. అయినా.. పోలీసులు మాత్రం ఎక్కడా కనిపించలేదు.

కోడి పందేల జోరు.. కోళ్లు హోరాహోరు.. ప్రజాప్రతినిధులు హుషారు

COCK FIGHTS : సంక్రాంతి వేళ రాష్ట్రంలో పెద్దఎత్తున కోడి పందేలు నిర్వహించారు. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాలో అధికార పార్టీ నేతల ఆధ్వర్యంలో కోడిపందేలు, పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు జిల్లాల్లో కలిపి.. మూడు రోజుల్లో కోళ్ల మీదే రూ.150 కోట్లకు పైగా పందేలు సాగాయని అంచనా. జూదంపై ఇంతకు రెట్టింపు పందేలు కాసినట్లు సమాచారం.

కృష్ణా జిల్లా పరిధిలోని గన్నవరం, అంపాపురం, పెనమలూరు, ఈడుపుగల్లు, గుడివాడలో కోడి పందేలు వేసేందుకు వీఐపీలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఎన్టీఆర్‌ జిల్లాలో తిరువూరు, నందిగామ, జగయ్యపేట, పెనుగంచిప్రోలులో జోరుగా పందేలు సాగాయి. కొందరు తెలంగాణ ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చారు. పెనుగంచిప్రోలు బరి వద్ద కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌.. పందేలు కాస్తూ హడావుడి చేశారు.

కోడి పందేల బరుల పక్కనే కోతముక్క, కోసు, మూడు ముక్కలాట, చిన్నబజారు, పెద్దబజారు, గుండాట, చిత్తాట, నెంబర్లాటతో పాటు... ఎక్కడికక్కడ గుడారాల్లో కాసినోలు కూడా ఏర్పాటుచేశారు. ఈ ఏడాది కోడి పందేలను మించిన జూదం జరిగింది. ఈడుపుగల్లు వద్ద ఇలాంటి ఆటలకు సంబంధించిన 50కి పైగా టేబుళ్లు దర్శనమిచ్చాయి. తిరువూరులో ఒక్కో టేబుల్‌ మీద 5 నుంచి 10లక్షల ఆట సాగింది. ఈడుపుగల్లు, అంపాపురంలోనే 10 కోట్ల జూదం జరిగిందని అంచనా.

బరుల వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్‌లు పూర్తిగా వాహనాలతో నిండిపోయాయి. అంపాపురం, ఈడుపుగల్లులో బరుల వద్ద పార్కింగ్‌ ఆదాయమే 30 లక్షలు వచ్చిందని అంచనా. బరుల వద్ద మద్యం ఏరులై పారింది. అక్కడే కౌంటర్లను తెరిచి మరీ విచ్చలవిడిగా విక్రయాలు చేశారు. ఒకవైపు ఆడుతూ, మరోవైపు తాగుతూ... మందుబాబులు, పేకాట రాయుళ్లు హల్‌చల్‌ చేశారు. ఇంత జరుగుతున్నా ఎక్కడా కనీసం ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.

కోడి పందేల బరుల వద్ద భారీగానే ఘర్షణలు జరిగాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ గొట్టాంమిల్లు వద్ద పేకాట బరిలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ.... రాడ్లు, కత్తులతో దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ కొట్లాటలో అనిల్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. పామర్రు మండలం అడ్డాడ కోడి పందేల బరిలో కల్వపూడి, అడ్డాడ గ్రామస్థుల మధ్య గొడవ జరిగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.

గన్నవరం మండలం ముస్తాబాద మండలంలో కోడి పందేల బరి వద్ద ఇరువర్గాలు.. కర్రలు, విచక్షణా రహితంగా దాడి చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో కోడికి కత్తి కట్టే సమయంలో ఖమ్మం జిల్లా అడసర్లపాడుకు చెందిన భాస్కరరావుకు గాయమైంది. తిరువూరు ఆర్డీవో కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన కోడి పందేల బరి వద్ద రెండు వర్గాలవారు కొట్టుకున్నారు. విజయవాడ శివారుల్లోని పాములకాల్వ వద్ద బరిలో వైకాపాకు చెందిన రెండు గ్రూపులవారు దాడి చేసుకున్నారు.

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం నీలపల్లి వద్ద కోడిపందాల బరులు తిరుణాళ్లను తలపించాయి. బరుల వద్ద ప్రవేశానికి ప్రత్యేక రుసుము పెట్టారు. అతిథులకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటుచేశారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రత్యేక గ్యాలరీలో కూర్చుని పందేలు వీక్షించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో వైకాపా నాయకులు కోడి పందేలు నిర్వహించారు. శిబిరాల వద్ద మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. లక్షల రూపాయల నగదు చేతులు మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.