ETV Bharat / state

సీఎం జగన్ విశాఖ పర్యటన.. పోలీసుల అత్యుత్సాహం.. బెజవాడవాసులకు ట్రాఫిక్​ కష్టాలు

author img

By

Published : Mar 29, 2023, 10:29 AM IST

Chief Minister Jagan Visakhapatnam tour updates: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్టణ పర్యటన విజయవాడ నగరవాసులను అష్టకష్టాలపాలుజేసింది. విమానాశ్రయానికి సీఎం జగన్ గంటన్నర ఆలస్యంగా బయలుదేరడంతో భారీగా ట్రాఫికి స్తంభించింది. దీంతో గంటల తరబడి వాహనదారులు, స్కూల్ విద్యార్థులు, అత్యవసర పనుల నిమిత్తం బయటికి వెళ్లిన స్థానికులు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి చిత్రహింసలకు గురయ్యారు. సమాచార లోపంతో పలుమార్లు వాహనాలను నిలిపివేసిన పోలీసులు.. ఒకేసారి వదిలేయడంతో నగరమంతా వాహనాల హారన్లతో మార్‌మ్రోగింది.

jagan traffic
jagan traffic

Chief Minister Jagan Visakhapatnam tour updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన విజయవాడ నగరవాసులను నానా ఇబ్బందులకు గురిచేసింది. నిన్న (మంగళవారం) సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి ఆయన గంటన్నర ఆలస్యంగా బయలుదేరడంతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. ముఖ్యమంత్రి కాన్వాయ్‌ వెళ్లే దారిలో పోలీసులు అత్యుత్సాహం చూపారు. సాధారణ వాహనాలను ముందుగానే దారిమళ్లించిన పోలీసులు.. స్కూల్ విద్యార్థులు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లేవారూ ఇంకెంత సమయం పడుతుందని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమిలేక ప్రజలు గంటల తరబడి తీవ్ర ఇక్కట్లుపడ్డారు.

సమాచార లోపం-స్తంభించిన ట్రాఫిక్: వివరాల్లోకి వెళ్తే.. విశాఖపట్నంలో మూడు రోజులపాటు జరిగే G-20 సదస్సులో పాల్గొనేందుకు సీఎం జగన్ తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. దీనికోసం పోలీసులు మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచే ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. బెంజిసర్కిల్‌తో పాటు చెన్నై- కోల్‌కతా జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేశారు. నిర్ణిత సమయానికి సీఎం ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో ఒకేసారి వదిలేశారు. మళ్లీ కాసేపటికి సీఎం జగన్ వస్తున్నారన్న సమాచారంతో మళ్లీ వాహనాలను నిలిపివేశారు. అయినా, ఆయన రాకపోవడంతో మరోసారి వదిలేశారు. సమాచార లోపంతో పలుమార్లు వాహనాలు నిలిపివేయడం, మళ్లీ వదిలేయడంతో వాహనాదారులు, స్థానికులు నానా అవస్థలు పడ్డారు. మొత్తం ఒకేసారి అన్నీ వాహనాలను వదిలేయడంతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది.

సామాన్యులను ఇబ్బంది పెట్టకండి: ఈ క్రమంలో సీఎం జగన్ పర్యటన కారణంగా ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ముఖ్యమంత్రి పర్యటనలు గానీ, ప్రభుత్వానికి సంబంధించిన సదస్సులు గానీ ఉంటే సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని ప్రభుత్వాన్ని, పోలీసు అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే అది బెజవాడ. అందులోనూ నిత్యం ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని తలపిస్తుంది. దీనికి తోడు సాయంత్రం అత్యంత రద్దీగా ఉంటుంది. విద్యా సంస్థలు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో సామాన్యంగానే నరకం చవిచూస్తారు. ఇటువంటి సమయంలో సీఎం జగన్ విశాఖ పర్యటన మంగళవారం సాయంత్రం నగరవాసులకు చుక్కలు చూపించింది.

అసలు ఏం జరిగిందంటే: విశాఖపట్నంలో జరిగే జీ20 సదస్సుకు వెళ్లేందుకు సీఎం జగన్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరాల్సి ఉంది. సాయంత్రం 4.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకోవాల్సి ఉంది. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం.. బయలుదేరే అవకాశం ఉందన్న సమాచారంతో నగర పోలీసులు మధ్యాహ్నం 3.30 గంటల నుంచే గుంటూరు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను బెంజి సర్కిల్‌ మీదుగా తాడిగడప వంద అడుగుల రోడ్డులోకి మళ్లించారు. బెంజి సర్కిల్‌ పైవంతెనపై నుంచి అనుమతించకుండా సీఎం కాన్వాయ్‌కు ఇబ్బంది అవుతుందని దారి మళ్లించారు. దీని వల్ల బందరు రోడ్డులోకి రద్దీ సమయంలో భారీ వాహనాలు బారులు తీరడంతో కిలోమీటర్ల కొద్దీ రెండు వైపులా ఆగిపోయాయి. సాయంత్రం 4.30 గంటల సమయంలో తాడేపల్లి పోలీసులు.. చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఎంతకీ సీఎం బయలుదేరకపోవడంతో చాలా సేపటి తర్వాత, తిరిగి వదిలేశారు. ఆ రద్దీ అంతా ఒక్కసారిగా బెంజి సర్కిల్‌పై పడింది. ఆ సమయంలో ఇళ్లకు వెళ్లే వారు నరకం చవిచూశారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.