ETV Bharat / state

'చీకటి జీవో వెనక్కి తీసుకునే వరకు పోరాడుతాం'

author img

By

Published : Jan 8, 2023, 2:45 PM IST

Updated : Jan 8, 2023, 4:06 PM IST

pawankalyan
పవన్‌

14:32 January 08

ఏపీలో వ్యవస్థలన్నీ నాశనమైపోయాయి

మీడియాతో చంద్రబాబు, పవన్​కల్యాణ్​

Chandrababu Naidu And Pawan Kalyan: తెదేపా అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ భేటీ అయ్యారు. తెదేపా అధినేత నివాసంలో ఈ సమావేశం జరిగింది. సుమారు రెండున్నర గంటల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. అనంతరం చంద్రబాబు, పవన్‌ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. జగన్‌ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపడ్డారు. ఇటీవల తీసుకువచ్చిన జీవో నంబర్‌ 1ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఆ ధైర్యం వైకాపా నేతలకు ఉందా? : వైకాపా ప్రభుత్వ విధానాలపై ఎలా పోరాడాలనే దానిపైనే ప్రధానంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో చర్చించినట్లు తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యం ఉండి రాజకీయ పార్టీలు సజావుగా కార్యకలాపాలు సాగించగలిగితే ఆ తర్వాత ఎన్నికలు, పొత్తులపై మాట్లాడొచ్చని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశమయ్యాయని.. ప్రజా జీవితం అంధకారంలోకి వెళ్లిందని చంద్రబాబు ఆరోపించారు. జీవో నంబర్‌ 1 తీసుకొచ్చాక కుప్పంలో జరిగిన అరాచకాలపై సంఘీభావం తెలియజేసేందుకు పవన్‌ రావడంపై ఆయన ధన్యవాదాలు తెలిపారు.

‘‘ప్రజాస్వామ్యంలో జరగకూడనివి జరుగుతున్నాయి. విశాఖలో ఆంక్షలు పేరుతో పవన్‌ కల్యాణ్‌ను హింసించారు. ఇప్పటంలో అక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు వెళ్లినా అలాగే చేశారు. తెదేపా ఆఫీసుపై దాడి జరిగినా పోలీసులు స్పందించలేదు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నిర్దిష్టమైన ప్రణాళికలు ఉంటాయి. వైకాపాకు మాత్రం నేరాలు, అవినీతి, వ్యవస్థలు నాశనం చేయడం అలవాటు. బ్రిటిష్‌కాలం నాటి జీవో తీసుకొచ్చారు. దానికి చట్టబద్ధత ఉందో లేదో కూడా తెలియదు. నా నియోజకవర్గానికి వెళితే అడ్డుకున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని. సొంత నియోజకవర్గానికి రానీయకుండా చేసేందుకు 2-3 వేల మంది పోలీసులను పెట్టి వెనక్కి పంపేందుకు యత్నించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవో నంబర్‌ 1 కరెక్ట్‌ కాదు. కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీసు వైఫల్యం కారణం కాదని చెప్పే ధైర్యం వైకాపా నేతలకు ఉందా? శాంతి భద్రతలను కాపాడాల్సింది ఎవరు?వైకాపా ప్రభుత్వ అరాచకాలపై అవసరమైతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు వస్తే కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏపీలో ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఎంత భయపెట్టినా మా మనో నిబ్బరాన్ని దెబ్బతీయలేరు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అంతకుముందు మాట్లాడిన పవన్‌.. ఇటీవల కుప్పంలో జరిగిన ఘటనల నేపథ్యంలో చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకు వచ్చానన్నారు. ఈ సందర్భంగా ఏపీలో వైకాపా అరాచకాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పింఛన్లు, శాంతిభద్రతలు తదితర అంశాలపై చర్చించామని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లకుండా ప్రతిపక్ష నేతలను నియంత్రించేందుకే జీవో నంబర్‌ 1 పేరుతో చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు.

‘‘ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల దగ్గరకు వెళ్లకూడదనే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ దుందుడుకు చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు అనుసరించాల్సిన అంశాలపై చర్చించాం. భవిష్యత్తులో జీవో నంబర్‌ 1ను వెనక్కి తీసుకునేందుకు ఏం చేయాలనేదానిపై మాట్లాడుకున్నాం. శాంతి భద్రతల పర్యవేక్షణ పోలీసుల బాధ్యత. మా మీటింగ్‌లకు మా లాఠీలు మేమే పట్టుకోవాలా?అలాంటప్పుడు ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ దేనికి? కందుకూరు, గుంటూరు ఘటనలకు పోలీసు వైఫల్యమే కారణం. ఇరిగేషన్‌ మంత్రికి పోలవరం ప్రాజెక్టుకు గురించి తెలియదు. వైకాపా నేతలు చేసే విమర్శలన్నింటికీ ఈనెల 12న జరిగే సభలో సమాధానమిస్తా.’’ అని పవన్‌ అన్నారు.

BRS​ పార్టీపై పవన్: ఏపీలో బీఆర్ఎస్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్న పవన్.. ఏ పార్టీలోనైనా చేరికలు సహజమని తెలిపారు. వైసీపీ మంత్రులపై విరుచుకుపడిన పవన్ కల్యాణ్.. మంత్రులు అంబటి, అమర్‌నాథ్‌ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆ రాష్ట్రంలో సరిగ్గా అమలు కావట్లేదని విమర్శించిన ఆయన.. సంక్షేమ పథకాలు అమలైతే గుంటూరులో రేషన్‌ కిట్‌ కోసం ఎందుకొస్తారని మండిపడ్డారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరితే గుంటూరుకు అంతమంది వచ్చేవారా అని పవన్ ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 8, 2023, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.