భాష పరిరక్షణకు తమిళులను స్ఫూర్తిగా తీసుకోవాలి: జస్టిస్ ఎన్​వీ.రమణ

author img

By

Published : Dec 24, 2022, 8:06 AM IST

Updated : Dec 24, 2022, 1:51 PM IST

World Telugu Congresses
ప్రపంచ తెలుగు మహాసభలు ()

World Telugu Writers Conference: భాష, సంస్కృతి, ఆహార వ్యవహారాల పరిరక్షణ విషయంలో.. తమిళుల నుంచి తెలుగువారు నేర్చుకోవాల్సింది, స్ఫూర్తి పొందాల్సింది ఎంతో ఉందని.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ.రమణ అన్నారు. తెలుగు భాషకు పట్టిన ఆంగ్ల జ్వరాన్ని.. పద్యమనే ఆయుధంతో విడిపించాలని మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు సూచించారు. పాలపుంత భాషగా, ఇతరులు నిత్యం కొత్త భాషగా మెచ్చే తెలుగు.. మనవారికి పనికిరాని భాషగా మారుతోందంటూ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో ఆవేదన వ్యక్తంచేశారు.

World Telugu Writers Conference: విజయవాడ వేదికగా జరుగుతున్న ప్రపంచ తెలుగు రచయితల ఐదో మహాసభల్లో.. దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్‌, ఫ్రాన్స్‌, సింగపూర్‌, బోట్స్‌వానా సహా పలు దేశాల నుంచి సాహితీ ప్రముఖులు, భాషాభిమానులు తరలివచ్చారు. నాలుగేళ్లకోసారి నిర్వహించే ఈ మహాసభలు.. సిద్దార్థ కళాశాల ప్రాంగణంలో తెలుగు భాష, సంస్కృతులు ఉట్టిపడేలా తీర్చిదిద్దిన మూడు వేదికలపై జరుగుతున్నాయి. "స్వభాషను రక్షించుకుందాం-స్వాభిమానం పెంచుకుందాం" అనే నినాదంతో.. ఈ మహాసభల ద్వారా తెలుగు భాషాభిమానులు, సాహితీ ప్రముఖులంతా ఒకే వేదికపైకి వచ్చారు.

తొలిరోజు మహాసభలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. సాయంత్రం తెలుగు వెలుగుల సభ పేరిట నిర్వహించిన కార్యక్రమానికి.. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​వీ.రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు అన్నవరపు రామస్వామి, దండమూడి సుమతి, సినీ గేయ రచయిత భువనచంద్ర, 72 మేళకర్త రాగాల పరిశోధకుడు స్వరవీణాపాణి, సిద్దార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు ఆత్మీయ అతిథులుగా హాజరయ్యారు. "గమ్యం-గమనం" పేరిట బెంగళూరుకు చెందిన పువ్వాడ శివరామవిఠల్‌, వేణుగోపాల్‌ సమర్పించిన గ్రంథాన్ని, పెద్ది సాంబశివరావు కూర్చిన "ఆంగ్లం-తెలుగు" నిఘంటువును ఆవిష్కరించారు.

భాష పరిరక్షణకు తమిళులను స్ఫూర్తిగా తీసుకోవాలి: జస్టిస్ ఎన్​వీ.రమణ

సాంకేతికత ద్వారా భాషను ఏ విధంగా పరిపుష్టి చేసుకోవాలనే దానిపై.. రచయితలు, మేధావులు, నిపుణులు ఆలోచించాలని జస్టిస్‌ ఎన్​వీ.రమణ కోరారు. మహాత్మాగాంధీ, భోగరాజు పట్టాభిసీతారామయ్య, పి.వి.నరసింహారావు మాటలను ప్రస్తావిస్తూ.. తెలుగు భాష ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. రక్షించుకోవాల్సిన స్థితిలోకి తెలుగు భాష వెళ్లడం బాధాకరమని.. మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు. కష్టాల్లో ఉన్న తెలుగు భాషకు చికిత్స అవసరమనే విషయాన్ని కోటికొక్కరైనా గుర్తించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలుగు భాష పునరుద్ధరణకు పద్యపఠనమే మార్గమని సూచించారు

చిన్ననాటి నుంచే తెలుగుపై మక్కువతో భాష నేర్చుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్న పోలండ్‌ దేశానికి చెందిన బిగ్స్‌ బుజ్జి.. మహాసభల్లో పాల్గొన్నాడు. క్లిష్టతరమైన పాటలు పాడి ఆకట్టుకున్నాడు. మహాసభల ప్రాంగణంలో 37 కిలోల బరువున్న భారీ పెన్ను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కలం గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ నమోదైంది. ఇత్తడి కలంపై నృత్య భంగిమలు, వాయిద్య పరికరాలను ఆచార్య మాకునూరి శ్రీనివాస్‌ అద్భుతంగా తీర్చిదిద్దారు.

మనుస్మృతి పేరిట మనుధర్మశాస్త్రం, ప్రాచీన భారత రాజ్యాంగం, నాలుగు వేదాల వివరణలతో కూడిన అతిపెద్ద గ్రంథాలను.. వేదిక బయట ప్రదర్శించారు. వీటిని చూసేందుకు భాషాభిమానులు, సాహితీవేతేతలు, యువత ఆసక్తి చూపారు. ఐదో ప్రపంచ తెలుగు మహాసభల్లో రెండో రోజైన ఇవాళ.. నన్నయ్య వేదికపై ఐదు కార్యక్రమాలు, ఎన్టీఆర్ వేదికపై ఆరు కార్యక్రమాలు, పి.వి.నరసింహారావు వేదికపై మూడు కార్యక్రమాలు జరగనున్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Dec 24, 2022, 1:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.