ETV Bharat / state

ఏపీ బడ్జెట్‌ తయారీ, నిర్వహణలో కాకి లెక్కల గుట్టువిప్పిన కాగ్

author img

By

Published : Mar 26, 2023, 12:32 PM IST

CAG revealed by AP budget details: రాష్ట్ర బడ్జెట్‌ తయారీ, నిర్వహణ తీరు సరిగ్గా లేదని కాగ్‌ స్పష్టం చేసింది. కొన్నిచోట్ల కేటాయింపుల కంటే అధికంగా వ్యయం చేశారని, మరికొన్నిచోట్ల కేటాయింపులు ఖర్చుపెట్టక పోయేసరికి నిధులు మిగిలిపోయాయని ఆక్షేపించింది. వివిధ పథకాలకు కేంద్రం నిధులిచ్చినా వాడుకోలేదని గుర్తించింది. 164 రోజులు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయానికి వెళ్లడం పేలవమైన నగదు నిర్వహణ సామర్థ్యాన్ని సూచిస్తోందని కాగ్‌ ఆక్షేపించింది.

CAG
కాగ్‌

రాష్ట్ర బడ్జెట్‌ తయారీ, నిర్వహణ పై కాగ్ తెలిపిన వివరాలు

CAG revealed by AP budget details: రాష్ట్ర బడ్జెట్‌ తయారీ, నిర్వహణ తీరు తెన్నులను కాగ్‌ తప్పుబట్టింది. సరైన ముందస్తు అంచనాలు లేకపోవడం, కొన్నింటిలో నిధులు మిగిలిపోతే, మరికొన్నింటిలో నిధులు చాలకపోవడం, చివర్లో నిధులను సరెండర్‌ చేయడం, బడ్జెట్‌లో కేటాయింపుల్లేకుండా ఖర్చు చేయడం.. ఇలా అనేక లోపాలను బయటపెట్టింది. పటిష్ఠ బడ్జెట్‌ నిర్వహణకు రాబడులు, ఖర్చుల ముందస్తు ప్రణాళిక, కచ్చితమైన అంచనాలు అవసరమని... అయితే కొన్నిచోట్ల కేటాయింపుల కంటే అధికంగా ఖర్చు పెట్టారని.. మరికొన్నిచోట్ల కేటాయింపులను ఖర్చుపెట్టక పోయేసరికి నిధులు మిగిలిపోయాయని తేల్చింది. ఇది ఖర్చుల పర్యవేక్షణ, నియంత్రణ లోపాలను సూచిస్తోందని పేర్కొంది.

కేటాయింపులు, ఖర్చులకు మధ్య వ్యత్యాసాలకు కారణాలను సంబంధిత నియంత్రణాధికారులు వివరించలేదన్న కాగ్‌...ఇది ప్రభుత్వంలోని జవాబుదారీతనానికి సంబంధించిన యంత్రాంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, ప్రజాధనం వినియోగంపై విధానపరమైన నియంత్రణను బలహీన పరుస్తుందని ఆక్షేపించింది. బడ్జెట్‌ లోపాలపై రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షేపించిన కాగ్‌...పలు అంశాలను ప్రస్తావించింది. 2021-22లో ప్రభుత్వం ఎటువంటి బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా 2వేల 812కోట్ల 79 లక్షలు ఖర్చు చేసినట్లు స్పష్టం చేసింది. అంతకు ముందు 2020-21లోనూ ఇదేవిధంగా ఎటువంటి బడ్జెట్‌ కేటాయింపులు లేకుండా 741 కోట్ల 66 లక్షలు వెచ్చించిన విషయాన్ని ప్రస్తావించింది. దీనిపై ప్రభుత్వ సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్‌ పేర్కొంది. ఆడిట్‌ పరిశీలనను పరిగణనలోకి తీసుకుంటూ, భవిష్యత్‌లో ఇటువంటివి పునరావృతం కానివ్వబోమని ప్రభుత్వం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది.

వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ అనేది రాబడులు, వ్యయాల మధ్య తాత్కాలిక అసమతూకాన్ని ఆపే సదుపాయమని... రాబడుల్లో అంతరాన్ని తీర్చేందుకు రాష్ట్రానికి సహాయపడుతుందని కాగ్‌ పేర్కొంది. అయితే 2021-22లో ప్రభుత్వం 139 రోజులపాటు డబ్ల్యూఎంఏను ఆశ్రయించిందని... 164 రోజులపాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయాన్ని వినియోగించిందని...ఇది పేలవమైన నగదు నిర్వహణ సామర్థ్యాన్ని.. రాబడులు, వ్యయాల అవాస్తవ అంచనాలను సూచిస్తోందని కాగ్‌ ఆక్షేపించింది. 2021-22లో 2 లక్షల 34 వేల 657 కోట్ల 40 లక్షల వాస్తవ కేటాయింపులకు అదనంగా ప్రభుత్వం లక్షా 37వేల 788 కోట్ల 47 లక్షలు అనుబంధ కేటాయింపులు చేసింది. ఈ కేటాయింపుల్లో లక్షా6వేల 205 కోట్ల 59 లక్షలు మొత్తం వేస్‌ అండ్‌ మీన్స్‌ అడ్వాన్స్‌ల చెల్లింపుల కోసం కేటాయించినట్లు పేర్కొంది. వాస్తవికంగా లేని ప్రతిపాదనల ఆధారంగా బడ్జెట్‌ కేటాయింపులు ఉండటం..పేలవమైన వ్యయ పర్యవేక్షణ వ్యవస్థ, పథకాలు అమలు పరచడంలో బలహీనమైన నియంత్రణల వల్ల... అభివృద్ధి కారక అంశాలకు అవసరమైన దానికంటే తక్కువ కేటాయింపులు జరుగుతున్నట్లు కాగ్‌ పేర్కొంది. కొన్ని శాఖల్లో అధికంగా మిగుళ్లు ఏర్పడటంతో, నిధులు అవసరమున్న ఇతర శాఖలు వాటిని పొందలేకపోతున్నాయని ఆక్షేపించింది.

కేంద్ర ప్రాయోజిత పథకాలకు వచ్చిన నిధులను సరిగ్గా వినియోగించలేదని కాగ్‌ స్పష్టం చేసింది. జాతీయ తృతీయ ఆరోగ్య సంరక్షణ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వానికి 250 కోట్లిచ్చారు. వీటిలో ఏమీ ఖర్చుచేయలేదు. ఈ పథకానికి వచ్చిన 250 కోట్లను సింగిల్‌ నోడల్‌ ఖాతాకు బదిలీ చేయలేదని కాగ్‌ ఆడిటింగ్‌లో గుర్తించింది.15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు రాష్ట్రంలో ఆరోగ్య రంగం మెరుగుకు సంబంధించి కేంద్రం నుంచి 488 కోట్ల 15 లక్షలు ప్రభుత్వానికి 2021 నవంబరులో వచ్చాయి. వీటిని 2022 ఫిబ్రవరిలో వైద్య, ఆరోగ్యశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నిధుల బదిలీలో జాప్యం కారణంగా 2021-22లో ఉద్దేశించిన ప్రయోజనానికి నిధులు ఖర్చు చేయలేక పోయారు. రాష్ట్రప్రభుత్వం ఈ నిధులను సంవత్సరాంతంలో రాష్ట్ర సంచిత నిధికి లాప్స్‌ చేసినట్లు కాగ్‌ గుర్తించింది. ఇలా సెక్టార్‌ నిర్దిష్ట గ్రాంట్లు మురిగిపోయేలా చేయడం వల్ల... ఆరోగ్య సేవలు అందించడంపై ప్రతికూల ప్రభావం ఉండొచ్చని... పథకాల లక్ష్యాలను సాధించలేక పోవచ్చని కాగ్‌ పేర్కొంది. బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో.. పూర్తికాకుండా, మిగుళ్లు ఉంటాయని ముందుగానే గమనించి, వాటి అవసరం లేదని తెలిస్తే... వెంటనే ఆర్థికశాఖకు సరెండర్‌ చేయాలి. కానీ 3వేల 776 కోట్ల 69 లక్షలను ఆర్థిక సంవత్సరం చివరి రోజైన 2022 మార్చి 31న సరెండర్‌ చేశారు. ఇది బడ్జెట్‌ మాన్యువల్‌ ఉల్లంఘన అవుతుందని... బడ్జెట్‌ అంచనాలను తప్పుగా వేయడాన్ని సూచిస్తున్నట్లు కాగ్ తెలిపింది.

వైద్య ఆరోగ్యశాఖలో వివిధ పథకాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులను తక్కువగా వినియోగించడం వల్ల ఆయా పథకాలపై ప్రభావం పడినట్లు కాగ్ పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ వైద్యశాలలకు అవసరమైన అత్యవసర మందులు, వైద్య సేవ, విద్యను బలోపేతం చేసేందుకు 73కోట్ల 62 లక్షలను బడ్జెట్‌ కేటాయిస్తే ..ఒక్క రూపాయీ ఖర్చు చేయలేదు. అసలు ఈ ప్రాజెక్ట్‌ నిర్వహణ యూనిట్‌ను ఏర్పాటు చేయలేదని పేర్కొంది. జాతీయ ఆరోగ్య మిషన్‌ కొవిడ్‌ -19 కట్టడి, నియంత్రణ, నివారణకు కేంద్రం 27కోట్ల 50 లక్షలు కేటాయిస్తే...ఈ నిధుల్ని వెచ్చించలేదు. ఇందుకు కారణాలేమిటో అధికారులు చెప్పలేదని కాగ్‌ తెలిపింది. ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద 556 కోట్ల 22 లక్షలను కేటాయించగా...ఇందులో 473 కోట్ల 59 లక్షలు ఖర్చుకాగా...82 కోట్ల 63 లక్షలు మిగిలిపోయాయి. దీనికి కారణాల్ని అధికారులు తెలపలేదని కాగ్‌ స్పష్టం చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.