ETV Bharat / state

విశాఖ పరిసరాల్లో తగ్గిన రిజిస్ట్రేషన్లు.. ఆచితూచి వ్యవహరిస్తున్న కొనుగోలుదారులు

author img

By

Published : Apr 4, 2023, 7:03 AM IST

Vishaka : విశాఖను పరిపాలనా రాజధానిగా మారుస్తామని ప్రభుత్వం పదేపదే చెప్పినా.. ఆ జిల్లాతో పాటు పరిసర జిల్లాల పరిధిలోనూ ఆస్తుల క్రయ, విక్రయాల్లో పురోగతి కనిపించడం లేదు. చివరికి పరిపాలనా కేంద్రంగా పరిగణిస్తున్న భీమిలి-విజయనగరం ప్రాంతంలోనూ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ఆదాయంలో పెరుగుదల లేదు. రాజధాని అమరావతి పరిసర ప్రాంతమైన ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో స్థిరాస్తి క్రయ, విక్రయాలు మెరుగ్గా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం అమరావతిలో పనులు నిలిపివేయడంతో తగ్గిపోయిన స్థిరాస్తి వ్యాపారం.. క్రమంగా అక్కడ పుంజుకుంటోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాదే సమయం ఉన్న వేళ.. ఈ పరిణామాలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.

Assets Sales
విశాఖలో ఆస్తుల క్రయ విక్రయాలు

విశాఖ పరిసరాల్లో తగ్గిన రిజిస్ట్రేషన్ల జోరు

Assets Sales in Vishaka : గత సంవత్సరం కంటే 2022-23సంవత్సరంలో రాష్ట్రం మొత్తంలో రిజిస్ట్రేషన్ల ఆదాయంలో 9.85 శాతం వృద్ధి నమోదైంది. ప్రభుత్వానికి 2021-22లో రిజిస్ట్రేషన్ల ద్వారా 7వేల 347 కోట్లు ఆదాయం రాగా.. 2022-23లో 8 వేల71 కోట్ల రూపాయలు వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా ఆదాయపరంగా -4.69శాతం వెనకబడింది. విశాఖ జిల్లాలో మాత్రం 2.84శాతం వృద్ధి నమోదైంది. విజయనగరం జిల్లాలో 2021-22లో కన్నా 2022-23లో -6.16శాతం తగ్గింది. గుంటూరులో 17.48శాతం, పల్నాడులో 24.95శాతం, బాపట్లలో 18.44శాతం, ఎన్టీఆర్‌లో 25.86శాతం చొప్పున ఆదాయం పెరిగింది. పేదల గృహవసతి కోసం మొత్తం విస్తీర్ణంలో 5 శాతం స్థలాన్ని.. కొత్త లేఅవుట్లను అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి అప్పగించాలన్న నిబంధనను జనవరిలో ప్రభుత్వం ఉపసంహరించుకున్నా.. ఆదాయంలో పురోగతి అంతంత మాత్రంగానే ఉంది. అలాగే 2021-22 మార్చి నెలలో వెయ్యి66 కోట్ల ఆదాయం రాగా.. 2022-23 మార్చిలో 950 కోట్లు మాత్రమే వచ్చింది.

ప్రభుత్వానికి ఆదాయం పెరిగేలా చూడాలని జిల్లా స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర స్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల 5 వేల177 దస్తావేజులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఓటీఎస్‌ కింద జరిగిన రిజిస్ట్రేషన్లూ ఉన్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా తర్వాత నరసరావుపేట, నెల్లూరు జిల్లాల్లో 24.95శాతం, 24.70శాతం చొప్పున అత్యధికంగా ఆదాయం వచ్చినట్లు రికార్డుల్లో నమోదైంది.

విశాఖ పరిసర ప్రాంతాల్లో కొంత వేచి చూసే ధోరణి కనిపిస్తోంది. అందువల్ల రిజిస్ట్రేషన్ల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. భీమిలి సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయ పరిధిలో గత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి 56.94 కోట్ల ఆదాయం వస్తే ఈ ఏడాది అదే సమయానికి 50.55కోట్లు మాత్రమే వచ్చింది. భీమిలి తర్వాత పెందుర్తికి స్థిరాస్తి వ్యాపారంలో ప్రాధాన్యం ఉంటుంది. గత ఏడాది ఫిబ్రవరి మాసాంతానికి పెందుర్తిలో రిజిస్ట్రేషన్ల ద్వారా 73.08 కోట్లు రాగా.. ఈ ఏడాది 63.22 కోట్లు మాత్రమే వచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో 9 కోట్ల ఆదాయం వస్తే ఈ ఫిబ్రవరిలో 5 కోట్లు మాత్రమే వచ్చాయి. పారిశ్రామిక ప్రాంతానికి సమీపంలోని పెదగంట్యాడ కార్యాలయం పరిధిలో కిందటి ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 61 కోట్లు వస్తే ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 58 కోట్లు మాత్రమే లభించింది. కొత్త లేఅవుట్లు రాకపోవడంతో విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో క్రయవిక్రయాలు మందగించడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. గతంలో ఏడాదికి వంద లేఅవుట్లు వరకు కొత్తవి వచ్చేవి. ఇప్పుడు పదికి లోపే లేఅవుట్ల మాత్రమే వేయడంతో పెద్దగా విక్రయాలు జరగలేదు. జనరల్‌ పవర్‌ ఆఫ్‌ ఆటార్నీకి గతంలో 4శాతం స్టాంపు డ్యూటీ మినహాయింపు ఉండేది. ప్రభుత్వం దీనిని రద్దు చేయడంతో జీపీఏ ద్వారా వెంచర్లు వేయడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లపై దీని ప్రభావమూ ఉందని వ్యాపారులంటున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.