ETV Bharat / state

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐకి ఏపీ హైకోర్టు నోటీసులు - కౌంటర్‌ దాఖలుపై ఉత్తర్వులు

AP High Court on Ayesha Meera Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో ఏపీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. దర్యాప్తును వేగవంతం చేసేలా సీబీఐను ఆదేశించాలని తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించి ఉత్తర్వులు జారీ చేసింది.

AP_High_Court_on_Ayesha_Meera_Murder_Case
AP_High_Court_on_Ayesha_Meera_Murder_Case
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : December 27, 2023 at 12:09 PM IST

Choose ETV Bharat

AP High Court on Ayesha Meera Murder Case: ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించిన దర్యాప్తును వేగవంతం చేసేలా సీబీఐని ఆదేశించాలని ఆమె తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ హైదరాబాద్‌, విశాఖపట్నం సీబీఐ ఎస్పీలకు, కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు జస్టిస్‌ కృష్ణమోహన్‌ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నోటీసు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ సత్యంబాబు దాఖలు చేసిన వ్యాజ్యంతో ప్రస్తుత పిటిషన్​ను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్యకేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు శంషాద్‌బేగం, సయ్యద్‌ ఇక్బాల్‌ బాషా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుమార్తె హత్య కేసును తాజాగా విచారణ జరపాలని, విజయవాడ మహిళా సెషన్స్‌ కోర్టులో ఈ కేసుకు చెందించిన వస్తుసంబంధ సాక్ష్యాధారాలు(మెటీరియల్‌ ఆబ్జెక్ట్స్‌-ఎంవో) ధ్వంసం చేయడం వెనుక ఎవరున్నారో తేల్చాలంటూ సీబీఐని ఆదేశిస్తూ 2018 నవంబర్‌ 29న ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.

Ayesha Meera Case: తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు.. మళ్లీ విచారణ ప్రారంభించిన సీబీఐ

పిటిషనర్ల తరఫు న్యాయవాది పిచ్చుక శ్రీనివాసులు వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తును హైకోర్టు సీబీఐకి అప్పగించి ఐదేళ్లు గడిచినా దర్యాప్తులో పురోగతి లేదని తెలిపారు. సీబీఐ దర్యాప్తు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా పర్యవేక్షణ చేయాలని పిటిషన్​లో పేర్కొన్నారు. కోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. దర్యాప్తుపై ఎప్పటికప్పుడు స్టేటస్ రిపోర్ట్ తెప్పించుకుని కేసు దర్యాప్తు పర్యవేక్షణ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇదే కేసులో సత్యంబాబును హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేశారు. విచారణ నిమిత్తం తాము తాజాగా నోటీసులు ఇస్తే దానిని సవాలు చేస్తూ సత్యంబాబు తరఫున ఇదే న్యాయవాది వ్యాజ్యం దాఖలు చేశారని గుర్తుచేశారు.

సీబీఐ తరఫున న్యాయవాది జూపూడి యజ్ఞదత్‌ వాదనలు వినిపించారు. కౌంటర్‌ దాఖలు చేసేందుకు సమయం కావాలన్నారు. దీంతో తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా పడింది.

" మీరైనా న్యాయం చేయండి.." సీజేఐ ఎన్వీ రమణకు ఆయేషా మీరా తల్లిదండ్రుల లేఖ

అసలేం జరిగిందంటే: విజయవాడ శివారు ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేటు వసతి గృహంలో 2007 డిసెంబర్‌ 27 తెల్లవారుజామున బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్య ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన తొమ్మిదినెలల తర్వాత సత్యంబాబును నిందితుడిగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సత్యంబాబుకు జీవితఖైదు, అత్యాచారం నేరం కింద పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ 2010 సెప్టెంబర్‌లో తీర్పు ఇచ్చింది.

అయితే ఆ తీర్పును సవాల్​ చేస్తూ సత్యంబాబు 2010 అక్టోబర్‌లో హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ 2017 మార్చి 31న తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయేషా తల్లిదండ్రులు దాఖలు చేసిన వ్యాజ్యంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశిస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 నవంబర్​లో ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికే వచ్చినట్లయింది.

'నిందితులను శిక్షించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి'