ETV Bharat / state

విద్యుత్‌ వినియోగదారులకు విడతలవారీగా షాక్..

author img

By

Published : Nov 22, 2022, 7:00 AM IST

electricity charges
విద్యుత్‌ వినియోగదారులకు సర్కారు షాక్‌

state government is increasing electricity charges: విద్యుత్‌ ఛార్జీలు పెంచలేదంటూనే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు రహస్యంగా షాకిస్తోంది. అధికారికంగా ఒక్కసారే ఛార్జీలు పెంచినట్లు గొప్పలు చెబుతున్నా.. వేర్వేరు పేర్లతో పైకి కనిపించకుండా దండుకుంటోంది. గత ఏడాదిన్నర కాలంలోనే వివిధ రూపాల్లో మూడుసార్లు ఛార్జీల మోత మోగించింది. అనేక రూపాల్లో ప్రజలపై ఏడాదికి 2 వేల 600 కోట్ల రూపాయల అదనపు భారం మోపుతోంది. పేద, మధ్యతరగతి ప్రజలపైనే ఛార్జీల మోత అధికంగా ఉంటోంది.

విద్యుత్‌ వినియోగదారులకు సర్కారు షాక్‌

AP government is increasing electricity charges: అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ విద్యుత్‌ ఛార్జీలు పెంచుతూ పోతున్న రాష్ట్ర ప్రభుత్వం.. గత ఏడాదిన్నరలోనే మూడుసార్లు వడ్డించింది. అధికారికంగా పెంచింది ఒక్కసారే అయినా... వేర్వేరు పేర్లతో భారాలు మోపింది. 36 నెలలకు గానూ విద్యుత్‌ ఛార్జీల పెంపు ద్వారా ఏటా 14 వందల కోట్లు, కనీస డిమాండ్‌ ఛార్జీల పేరుతో ఏటా 200 కోట్లు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో 2 వేల 910.74 కోట్ల రూపాయలు బాదేసింది. ఈ లెక్కన ఏడాదికి సగటున 2 వేల 600 కోట్ల చొప్పున ప్రజలపై భారం పడింది.

పాత టారిఫ్‌తో పోలిస్తే ప్రతి నెల వచ్చే విద్యుత్‌ బిల్లులు కొందరికి 40 నుంచి 50 శాతం మేర పెరిగాయి. సున్నా నుంచి 75 యూనిట్ల మధ్య వినియోగించే దిగువ మధ్యతరగతి వర్గాలపై 60 శాతానికి మించి ఛార్జీల భారం పెరిగింది. 2022 ఏప్రిల్‌ నుంచే విద్యుత్‌ ఛార్జీల పెంపు అమల్లోకి వచ్చినా... కొన్ని నెలలుగా అందుతున్న బిల్లులు చూసి వినియోగదారుల గుండెలు గుభేల్‌మంటున్నాయి. గృహ వినియోగదారుల టారిఫ్‌ను హేతుబద్ధీకరిస్తూ ఉమ్మడి టెలిస్కోపిక్‌ వ్యవస్థ ప్రవేశపెట్టామని, దీనివల్ల అందరికీ తక్కువ శ్లాబ్‌లో ఉండే రాయితీ ధరల ప్రయోజనం అందుతుందని... గత మార్చిలో కొత్త టారిఫ్‌ను ప్రకటించే సమయంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చెప్పింది. విద్యుత్ బిల్లులు వినియోగదారుల చేతికొచ్చాక కానీ ఆ మాటల్లోని పరమార్థం తెలిసిరాలేదు.

విజయవాడకు చెందిన ఒక వినియోగదారుడు.. అక్టోబర్‌లో వినియోగించిన 185 యూనిట్ల విద్యుత్‌కు కొత్త టారిఫ్‌ ప్రకారం విద్యుత్‌ ఛార్జీల రూపేణా 777 రూపాయలు, విద్యుత్‌ సుంకం 11 రూపాయల 10 పైసలు, కస్టమర్‌ ఛార్జీల కింద 50, కనీస డిమాండ్‌ ఛార్జీలుగా 20, ట్రూఅప్ ఛార్జీల కింద 45... మొత్తం కలిపి 903 రూపాయల బిల్లు వచ్చింది. ఇదే విద్యుత్‌ వినియోగానికి పాత టారిఫ్‌ ప్రకారమైతే... 627 రూపాయలు చెల్లిస్తే సరిపోయేది. ఛార్జీల పెంపు, ట్రూఅప్‌తో నెలకు 289 రూపాయల అదనపు భారం పడింది. పాత టారిఫ్‌తో పోలిస్తే 46.09 శాతం ఛార్జీలు పెరిగాయి.

నెలకు 202 యూనిట్ల విద్యుత్ వినియోగించే మధ్యతరగతి వినియోగదారుడిపై.. ఛార్జీల పెంపుతో నెలకు 342.56 రూపాయల అదనపు భారం పడింది. ఒకవేళ ఏడాదంతా ఇదే విధంగా విద్యుత్ వినియోగిస్తే... 4 వేల 110.72 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే... 305 యూనిట్లు వినియోగించే ఎగువ మధ్యతరగతి వినియోగదారుడిపై... నెలకు 257.4 రూపాయల వంతున ఏడాదికి 3 వేల 88.80 రూపాయల భారం పడుతుంది. పాత టారిఫ్‌తో పోలిస్తే వారిపై 15.48 శాతం భారం పెరిగింది.

ఇక నెలకు 405 యూనిట్లు వినియోగించే వారిపై ఛార్జీల వడ్డనతో నెలకు వచ్చే విద్యుత్‌ బిల్లు 362.65 రూపాయలు పెరిగింది. ఏడాదికి 4 వేల 351.80 రూపాయల భారం పడుతుంది. పాత టారిఫ్‌తో పోలిస్తే 14.70 శాతం అదనపు భారం అన్నమాట. అంటే... సామాన్య, మధ్యతరగతి వర్గాలపైనే ప్రభుత్వం ఎక్కువ భారం వేస్తోంది. రాష్ట్రంలోని మూడు డిస్కంల పరిధిలో సున్నా నుంచి 75 యూనిట్ల మధ్య విద్యుత్‌ వినియోగించే కనెక్షన్ల సంఖ్య 83.06 లక్షలు కాగా.... సున్నా నుంచి 225 యూనిట్ల లోపు వినియోగించేవారి సంఖ్య 58.16 లక్షలు. అలాగే 500 యూనిట్లు, అంతకుమించి విద్యుత్‌ వినియోగించే కనెక్షన్ల సంఖ్య 8.11 లక్షలు ఉన్నాయి.

ఈ ఏడాది మార్చి వరకు అమలైన పాత టారిఫ్‌లో... కేటగిరీ-ఏ కింద సున్నా నుంచి 50తోపాటు 51 నుంచి 75 యూనిట్ల శ్లాబ్‌లు ఉన్నాయి. ఏప్రిల్‌ నుంచి అమలు చేసిన కొత్త టారిఫ్‌లో వాటిని సున్నా నుంచి 30, 31 నుంచి 75 శ్లాబ్‌లుగా ప్రభుత్వం మార్చింది. దీనివల్ల 30 యూనిట్ల వినియోగం దాటాక 31 నుంచి 75 యూనిట్ల శ్లాబ్‌లోని పెరిగిన యూనిట్‌ ధర వర్తిస్తుంది. అంటే... తక్కువ ధరకు అందే 20 యూనిట్లను పేదలు కోల్పోవాల్సి వచ్చింది. 50 యూనిట్ల విద్యుత్‌ వినియోగానికి కొత్త టారిఫ్‌ ప్రకారం 165 రూపాయల బిల్లు వస్తుండగా.... పాత టారిఫ్‌ ప్రకారం 120 రూపాయలు మాత్రమే వచ్చేది. టారిఫ్‌, శ్లాబ్‌ల మార్పుతో 44.50 రూపాయల అదనపు భారం పడింది. పాత టారిఫ్‌తో పోలిస్తే 61.38 శాతం భారం పెరిగింది.

కనీస విద్యుత్‌ డిమాండ్‌ ఛార్జీల పేరుతో వినియోగదారులపై ప్రభుత్వం కనిపించని భారం వేసింది. 2021 ఏప్రిల్‌ నుంచి కిలోవాట్‌కు 10 రూపాయల వంతున బిల్లులో కలిపి వసూలు చేసే నిబంధన అమల్లోకి తెచ్చింది. దీనివల్ల సింగిల్‌ ఫేజ్‌ కనెక్షన్ వినియోగదారులకు నెలకు కనీసం 10 నుంచి గరిష్ఠంగా 30 రూపాయలు బిల్లులో కలిపి వస్తోంది. త్రీఫేజ్‌ కనెక్షన్‌కు కనీసం 50 చెల్లిస్తున్నారు. ఈ మొత్తం కాంట్రాక్‌ లోడ్‌ కోసం వినియోగదారులు చేసుకున్న దరఖాస్తు ఆధారంగా మారుతుంది. త్రీఫేజ్‌ తీసుకున్న ఒక వినియోగదారుడు 6 కిలోవాట్ల కాంట్రాక్ట్‌ లోడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే... నెలకు 60 రూపాయలు కనీస డిమాండ్‌ ఛార్జీగా చెల్లించాలి.

ఈ రకంగా ఏటా వినియోగదారులపై ప్రభుత్వం 200 కోట్ల భారం వేసింది. 2021 మార్చి వరకు సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్ వినియోగదరాల నుంచి నెలకు 65, త్రీఫేజ్‌ వినియోగదారుల నుంచి 150 రూపాయల వంతున డిస్కంలు వసూలు చేశాయి. ఇంతకంటే తక్కువ వినియోగం ఉన్న నెలలో మాత్రమే కనీస విద్యుత్ ఛార్జీల భారం వినియోగదారులు భరించాల్సి వచ్చేది. కొత్త నిబంధన ప్రకారం వినియోగంతో సంబంధం లేకుండా... ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులో కలిపి డిస్కంలు దండుకుంటున్నాయి.

అయిదేళ్ల కిందట ఓ హోటల్‌కు వెళ్లి టిఫిన్‌ చేసిన వ్యక్తికి... ప్రస్తుతం ధరలు పెరిగాయంటూ అప్పటి బిల్లులో వ్యత్యాసాన్ని ఇప్పుడు వసూలు చేస్తామంటే ఎలా ఉంటుందో... విద్యుత్‌ బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయం కూడా అలాగే ఉంది. 2014 నుంచి 2019 మధ్య ఐదేళ్లలో వినియోగదారులకు సరఫరా చేసిన విద్యుత్‌కు వసూలు చేసిన ఛార్జీలు... కొనుగోలు, ఇతర ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని ఇంధన సర్దుబాటు లేదా ట్రూఅప్‌ ఛార్జీల కింద 2 వేల 910.74 కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. ఈ మొత్తాన్ని దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో యూనిట్‌కు 23 పైసలు, కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 22 పైసల వంతున... 36 నెలల పాటు వసూలు చేస్తున్నాయి. యూనిట్‌కు 7 పైసల వంతున తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ 18 నెలల పాటు విద్యుత్‌ బిల్లులో కలిపి గత ఆగస్టు నుంచి గుంజుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.