ETV Bharat / state

అప్పుడు సత్కరించారు.. ఇప్పుడు తీసేస్తున్నారు.. పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన

author img

By

Published : Dec 22, 2022, 8:44 PM IST

Amaravati sanitary workers: కరోనా వేళ ప్రాణాలకు తెగించి పనులు చేసిన తమకు 2నెలలుగా జీతాలు చెల్లించకపోవడమే కాకుండా విధుల నుంచి తొలగించారంటూ సీఆర్డీఏ పరిధిలోని పారిశుద్ధ్య కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించారు. రెండు, మూడు రోజుల్లో జీతాలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పాటు..ఉద్యోగాల కొనసాగింపుపై ఉన్నతాధికారులను సంప్రదిస్తామని నచ్చజెప్పారు.

పారిశుద్ధ్య కార్మికుల ధర్నా
Amaravati sanitary workers

సీఆర్‌డీఏ కార్యాలయాన్ని ముట్టడించిన పారిశుద్ధ్య కార్మికులు

Amaravati Sanitary Workers Agitation: రాజధాని అమరావతి గ్రామాల పరిధిలో పారిశుద్ధ్య కార్మికులు వేతనాల కోసం రోడ్డెక్కారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. వీరికి వాపపక్ష నేతలు మద్దతు పలికారు. ఒకదశలో కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పారిశుద్ధ్య పనులు చేశామని.. అప్పుడు సత్కారం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పనిలో నుంచి తీసివేస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో కనీసం వ్యవసాయ పనులు కానీ.. అమరావతి నిర్మాణ పనులు కానీ లేవని ఇప్పుడు తామంతా ఏం చేయాలని వారు ప్రశ్నించారు.

రాజధాని 29 గ్రామాలలో 2017వ సంవత్సరం నుండి పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని సీఆర్డీఏ అధికారులు భావించారు. ఇందుకోసం 29 గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను అధికారులు ఏజేన్సీలకు అప్పగించారు. ప్రభుత్వం నుంచి పనులు దక్కించుకున్న సుమిత ఏజెన్సీ 29 గ్రామాలలో పారిశుద్ధ్య విధులు నిర్వహణ చేపట్టినది. ఈ ఏజెన్సీ టెండర్ కాలం ఈ డిసెంబరు నెలతో ముగుస్తోంది. 2023 జనవరి నుంచి రాజధాని గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణను నిలిపివేస్తున్నామని, కార్మికులకు పని లేదని, ఇతర పనులు చూసుకోమని సీఆర్డీఏ అధికారులు కార్మికులకు చెబుతున్నారు. దీంతో కార్మికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అనేక సంవత్సరాలుగా తాము పారిశుద్ధ్య నిర్వహణ పనలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని.. ఇప్పుడు తమను తొలగిస్తే తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని పారిశుద్ధ్య మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'మాకు 3నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. తమను ఎందుకు విధులు నుంచి తొలగిస్తున్నారని అధికారులను అడుగుతుంటే.. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని వారు చెపుతున్నారు. 'రావాలి జగన్.. కావాలి జగన్' అని తాము ఓటు వేసి గెలిపించినందుకు తమకు సరైన గుణపాఠం చెపుతున్నారు. ప్రభుత్వానికి తాము మాత్రమే భారమయ్యామా. మంత్రులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ప్రభుత్వ డబ్బును వృథా చెయొచ్చు కానీ తమకు జీతాలు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవని చెప్పడం దారుణం. ఉద్యోగం తొలగిస్తామని ఒకవైపు చెప్పి.. మరొకవైపు మూడు నెలల నుంచి జీతాలు చెల్లించడం లేదు. జీతాలు రాకపోవడంతో తమ కుటుంబం ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నాం.'- పారిశుద్ధ్య కార్మికులు

సూమారు 400 కుటుంబాలు: అమరావతి రాజధాని 29 గ్రామాల్లో పని చేసే పారిశుద్ధ్య కార్మికులంతా దళిత, గిరిజన, బలహీనవర్గాలకు చెందినవారు. సూమారు 400 కుటుంబాలు ఈ పనిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం విధులు నుంచి తొలగించినా.. చేద్దామంటే అమరావతిలో పొలం పని లేకుండాపోయింది. దీంతో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉంది. అధికారులను, ప్రజా ప్రతినిధులన కలిసినా సరైన స్పందన లేదని కార్మికులు వాపోతున్నారు. కార్మికుల కుటుంబాలు రోడ్డున పడకుండా యాధావిధిగా పారిశుద్ధ్య పనులు కొనసాగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. ప్రభుత్వం తమకు పని భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాజధానిలో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్​లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు పీఎఫ్ కింద జీతంలో నగదు కోత జరుగుతుంది కానీ.. ఆ పీఎఫ్‌ వివరాలు ఇప్పటివరకు తెలియదని కార్మికులు వాపోతున్నారు.

సీఆర్డీఏ అధికారుల హామీ: సీఆర్డీఏ బకాయిపడిన తమ మూడు నెలల వేతనాలు చెల్లించి, తమకు పని భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత పారిశుద్ధ్య కార్మికులు విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులతో సీఆర్డీఏ సామాజిక అభివృద్ధి విభాగం సంచాలకులు ఎస్. శర్మదా చర్చలు జరిపారు. కార్మికుల అక్టోబర్, నవంబర్ వేతనాలు నాలుగు రోజుల్లో చెల్లిస్తామని హమీ ఇచ్చారు. పీపీఎల్ కేటగిరీలో ఉంటేనే కార్మికులకు పెన్షన్ వర్తిస్తుందని, కార్మికుల పెన్షన్ చెల్లింపు అంశం పైస్థాయిలో నిర్ణయం తీసుకోవాలన్నారు. మున్సిపల్ లేదా పంచాయితీల పరిధిలో జనాభా ఆధారంగా పారిశుద్ధ్య కార్మికులను తీసుకోవడం జరుగుందిని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికులకు ఔట్ సోర్సింగ్ విధానంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేమన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రతపై ప్రభుత్వంతో మాట్లాడతామని తెలిపారు. రాజధానిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న ఏజెన్సీకి ఈనెల 31 వరకు మాత్రమే కాలపరిమితి ఉందని, కార్మికులు లెవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లతామన్నారు.

'ముఖ్యమంత్రి జన్మదినోత్సవ వేడుకలకు వందలాది కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చు చేస్తున్నారు. కానీ, అమరావతి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వటానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవా..? ముఖ్యమంత్రి జగన్ పెత్తందారులను వదిలి, పేదలు, బలహీన వర్గాలపై యుద్ధం చేస్తున్నారు. జనవరి 1 నంచి యాధావిధిగా కార్మికులను పనిలోకి తీసుకోవాలి. కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదు.' -బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.