ETV Bharat / state

అయ్యో పాపం.. అప్పుడే పుట్టిన పసికందు చెత్తకుప్పలో.. నంద్యాలలో దారుణం

author img

By

Published : Apr 12, 2023, 5:07 PM IST

New Born Baby Found In Dustbin: తల్లి తన తప్పును కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసిందా లేక.. ఆడపిల్ల కావడమే శాపమైందో తెలియదు కానీ.. అప్పుడే పుట్టిన ఆ పసికందుకు చెత్త కుప్ప ఆవాసమైంది. తల్లి ఒడిలో వెచ్చగా సేద దీరాల్సిన ఆ చిట్టి తల్లి.. ఈగలు, దోమల మధ్య నలిగిపోయింది. గుక్క పట్టి ఏడుస్తుంటే అటుగా వెళ్తున్న వారు గుర్తించి ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు ప్రాణం దక్కింది. నంద్యాల జిల్లాలో బుధవారం ఉదయం ఈ అమానవీయ ఘటన వెలుగుచూసింది.

Etv Bharat
Etv Bharat

New Born Baby Found In Dustbin : తొమ్మిది నెలలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లికి.. కడుపు తీపి గుర్తుకు రాలేదేమో..! ముద్దు లొలికే ఆ పాపాయిని వదిలి వెళ్లేందుకు. ఆ చిట్టి ప్రాణాన్ని భూమ్మీదకు తీసుకు వచ్చేందుకు పడ్డ పురిటి నొప్పులు మరిచి పోయిందేమో..! పేగు బంధాన్ని వదిలి పెట్టేసింది ఆ తల్లి. కష్టమే వచ్చిందో, భారమని భావించిందో..! ఆడపిల్ల అని వదిలించుకున్నారో తెలియదు కానీ... అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో వదిలి వెళ్లారు. నంద్యాల జిల్లాలో జరిగిన ఈ అమానవీయ ఘటనకు సంబంధించి వివరాలివీ..

ఆడ శిశువు వదిలేసిన తల్లిదండ్రులు : నంద్యాల జిల్లా బేతంచెర్లలో దారుణం చోటు చేసుకుంది. బేతంచెర్ల ప్రభుత్వ ఆస్పత్రి గేటు వద్ద చెత్త కుప్పలో బుధవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును వదిలి వెళ్లారు. అటుగా వెళుతున్న వారు శిశువును గమనించి హాస్పిటల్ సిబ్బందికి సమాచారం అందించారు. చిన్న పిల్లల వైద్యుడు రవి కుమార్​కు సమాచారం తెలియజేశారు. వైద్యాధికారులు ఆ శిశువును తీసుకుని వైద్య పరీక్షలు చేసి.. ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఆస్పత్రికి చేరుకుని శిశువును చేతుల్లోకి తీసుకున్నారు. బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగిస్తామని బనగానపల్లి సీడీపీఓ ఉమా మహేశ్వరమ్మ తెలిపారు.

అదృశ్యమైన మహిళ వాలంటీర్ : కడప నగరంలో మహిళా వాలంటీర్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వ్యక్తిగత కారణాలతో కనిపించకుండా పోయిందా..? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ నగర్ కు చెందిన వసంత సింధూజ (32)కు కొన్నేళ్ల కిందట పుల్లయ్య అనే వ్యక్తితో వివాహం అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పుల్లయ్య టాక్సీ డ్రైవర్​గా విధులు నిర్వహిస్తున్నాడు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థ ఏర్పడడంతో ఆమె స్థానిక రామకృష్ణ నగర్​లో వాలంటీర్​గా చేరారు.

మంగళవారం ఉదయం ఆమె భర్త నిద్ర లేచి చూడగా వసంత సింధూజ కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. బంధువుల ఇంట్లో వెతికినా.. అక్కడ కూడా ఆచూకీ దొరకకపోవడంతో ఆమె భర్త రిమ్స్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల కాలంలో కడపలో అదృశ్య కేసులు కలకలం రేపుతున్నాయి. ఈ మేరకు పోలీసులు వసంత సింధూజ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. త్వరలో వసంత సింధూజ ఆచూకీ గుర్తించి అప్పగిస్తామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.