ETV Bharat / state

కోలాహలంగా తుంగభద్ర నది పుష్కరాలు

author img

By

Published : Nov 21, 2020, 5:00 AM IST

The Tungabhadra pushkars are going solid
కోలాహలంగా తుంగభద్ర నది పుష్కరాలు

తుంగభద్ర పుష్కరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ నదీమతల్లికి చీర, సారె సమర్పించగా... మంత్రాలయంలో పీఠాధిపతి పుష్కర స్నానాలను ఆరంభించారు. చాలాచాట్ల కొవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా భక్తులను నదీ స్నానాలు చేశారు.

కోలాహలంగా తుంగభద్ర నది పుష్కరాలు

కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు మొదలయ్యాయి. నీటి ద్వారా కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం నదీ స్నానాలు నిషేధించింది. చిన్నారులు, వృద్ధులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. జల్లు స్నానాలకు ఏర్పాట్లు జరిగినా... సర్కారు నిరాకరించింది. పూజలు, పిండప్రదానాలకు మాత్రమే అనుమతిచ్చింది.

పుష్కరాల్లో పాల్గొనేవారు ఈ-టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని... ఒక్కరోజు ముందుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెబ్​సైట్​ను ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించిన వెంటనే పుష్కరాలు ప్రారంభమయ్యాయి.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో మధ్వాచారం ప్రకారం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు... ఉదయాన్నే తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలను తుంగభద్రలో కలిపి... పుష్కరాలు ప్రారంభించారు. పీఠాధిపతి సహా పలువురు భక్తులు నదీస్నానాలు చేశారు. మధ్యాహ్నం కర్నూలులోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్‌లో సీఎం జగన్... నదీమతల్లికి చీరాసారె సమర్పించి పుష్కరుడిని ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు అనంతరం హోమంలో పాల్గొన్నారు.

కొవిడ్ నిబంధనలను విరుద్ధంగా చాలా చోట్ల భక్తులు స్నానాలు చేశారు. మరికొందరు జల్లు స్నానాలు ఆచరించారు. ఈ-టికెట్ ద్వారా స్లాబ్ బుకింగ్ ఏమీ లేకుండానే... పిండప్రదానాలు, పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. మౌలిక సౌకర్యాలపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. సంకల్ బాగ్ పుష్కర ఘాట్ వద్ద సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేదపండితులు నదీమతల్లికి గంగాహారతి ఇచ్చారు.

కొత్తపల్లి సమీపంలో ఉన్న సప్త నదుల సంగమేశ్వరంలోనూ పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలకపల్లి రఘురామ శర్మ తుంగభద్ర నదికి పూజలు నిర్వహించారు. సంగమేశ్వరం వద్ద 500 మంది భక్తులు స్నానమాచరించారని, 15 కుటుంబాలు పిండ ప్రదానం చేసినట్లు ప్రత్యేక అధికారి చంద్రమోహన్ తెలిపారు.

ఇదీ చదవండీ... సంకల్​బాగ్ ఘాట్​లో పుష్కరాలు ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.