ETV Bharat / state

కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ - విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 10:45 AM IST

Updated : Nov 5, 2023, 11:10 AM IST

Students_Future_Affected_by_Migration
Students_Future_Affected_by_Migration

Students Future Affected by Migration in Kurnool: కరవు భూతం ధాటికి పల్లెజనం వణికిపోతున్నారు. పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రాల బాట పట్టారు. మూటా ముళ్లు సర్దుకుని.. పిల్లలు, వృద్ధులను వెంట బెట్టుకుని.. సుదూర ప్రాంతాలకు వలస వెళుతున్నారు. దీంతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో వలసల ధాటికి పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా తగ్గిపోతోంది. పాఠశాల గదులు ఖాళీ అవుతున్నాయి. అయినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఊళ్లకు ఊళ్లు ఖాళీ - విద్యార్థుల భవిష్యత్తు అంధకారం

Students Future Affected by Migration in Kurnool : కర్నూలు పశ్చిమ ప్రాంతంలో కరవు (Drought in Rayalaseema) ప్రభావం పిల్లల చదువులపైనా పడుతోంది. దుర్భిక్ష పరిస్థితులతో పల్లెల నుంచి పని కోసం పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్న జనం పిల్లలను కూడా తమ వెంట తీసుకెళ్తున్నారు. అర్ధాంతరంగా బడి మానేయాల్సి వస్తోంది. కర్నూలు జిల్లాలో వలసల ధాటికి పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా తగ్గింది. కొన్నిగ్రామాల్లో తరగతి గదులు ఖాళీ అవుతున్నాయి. ఐనా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

Kurnool District Drought Leads to Migrating Villagers to Cities : గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు జిల్లాను కరవు భూతం వెంటాడుతోంది. వరుణుడు కరుణించలేదు (No Rains). తీవ్ర వర్షాభావంతో పంటలు ఎండిపోయి రైతులు పూర్తిగా నష్టపోయారు. పనులు లేక తెచ్చిన అప్పులు తీర్చేందుకు రైతులు, కూలీలు.. పొరుగు రాష్ట్రాలకు వలస బాట పట్టారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంత పల్లెలన్నీ క్రమంగా ఖాళీ అవుతున్నాయి. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. వీధులన్నీ వెలవెలబోతున్నాయి. అక్కడక్కడా వృద్ధులు, చిన్నారులు మాత్రమే కనిపిస్తున్నారు. మరికొందరు వలస వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

"పల్లె పొమ్మంటే పట్నం రమ్మంటోంది" బతకలేని బక్క ప్రాణులను వీడని వలసల పర్వం

నాకు చదువుకోవాలని ఉంది : "నేను మూడో తరగతి చదువుతున్నాను. మా ఇంట్లో వాళ్లందరం వలస పోతున్నాము. మా తమ్ముడిని చూసుకోవడానికి.. నేను రాను అంటున్నా.. మా నాన్న నన్ను కూడా బలవంతంగా తీసుకుపోతున్నారు. నాకు చదువుకోవాలని ఉందంటే వారం తరువాత పంపిస్తానని చెబుతున్నారు."- విద్యార్థి

Students Attendance has Decreased in Schools Due to Migration : కరవు, వలసల ప్రభావం చిన్నారుల భవిష్యత్తుపై పడుతోంది. పొట్టకూటి కోసం వలస వెళ్తున్న తల్లిదండ్రులు.. పాఠశాలలకు వెళ్లాల్సిన చిన్నారులను తమతో పాటు తీసుకెళ్తున్నారు. దీనివల్ల భావిభారత పౌరుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొందరు విద్యార్థులు వలసల నుంచి వచ్చిన తర్వాత పాఠశాలల్లో చేరినా.. చదువుల్లో వెనకబడిపోతున్నారు. ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో కరవుతో పల్లెలు ఖాళీ అవుతున్నాయి. పాఠశాలల్లో పిల్లల హాజరు శాతం భారీగా తగ్గుతోంది. ఎమ్మిగనూరు మండలం కందనాతి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో గతంలో 90 మందికి పైగా పిల్లలు ఉంటే ..ప్రస్తుతం హాజరు శాతం 40కి చేరింది. త్వరలోనే తల్లిదండ్రులతో కలిసి తామూ వలస వెళ్తామని విద్యార్థులు తెలిపారు.

నాకు ఏడుపొస్తుంది : "నేను ఐదో తరగతి చదువుకుంటున్నాను మా అమ్మ, నాన్న తెలంగాణకు వలస పోయారు. నేను, మా అన్న, అమ్మమ్మ, తాత ఊర్లో ఉన్నాము. వాళ్లకు దూరంగా ఉండటంతో ఏడుపొస్తోంది"- విద్యార్థి

కర్నూలు పశ్చిమ ప్రాంతాల నుంచి.. పిల్లాజెల్లతో వలసబాట!

Government Careless on Migration People : గతేడాది కరవు లేకపోయినా కర్నూలు పశ్చిమ ప్రాంతంలో 26 సీజనల్ హాస్టళ్లు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది తీవ్ర దుర్భిక్ష పరిస్థితులతో సుమారు 3 వేల 500 మంది విద్యార్థులు వలస వెళ్తారని అంచనా. వీరికోసం 70 సీజనల్ హాస్టళ్లు ప్రారంభించాలి. కానీ వలసలు ప్రారంభమైనా.. ఊళ్లకు ఊళ్లే ఖాళీ అవుతున్నా.. బడుల్లో హాజరు శాతం పడిపోతున్నా.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క సీజనల్‌ హాస్టల్‌ను కూడా తెరవలేదంటే సర్కారు నిర్లక్ష్యాన్ని అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికైనా వీలైనంత త్వరగా సీజనల్ హాస్టళ్లను ఏర్పాటు చేస్తే.. కొందరు పిల్లలైనా.. సొంత గ్రామాల్లో ఉంటూ.. చదువుకునే అవకాశం ఉంది. లేదంటే వీరి చదువులపై వలసల ప్రభావం తీవ్రంగా పడే ప్రమాదం లేకపోలేదు.

పనుల కోసం పొరుగు రాష్ట్రాలకు.. ఒక్క పశ్చిమప్రకాశం నుంచే దాదాపు 50 వేల కుటుంబాల వలస

Last Updated :Nov 5, 2023, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.