ETV Bharat / state

కృష్ణానది బోర్డు విశాఖలో ఏర్పాటు చేయవద్దంటూ నిరసనలు

author img

By

Published : Jan 14, 2021, 12:39 PM IST

KRISHNA RIVER BOARD ISSUE IN AP
కృష్ణానది బోర్డును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని డిమాండ్

కృష్ణా నదితో ఎలాంటి సంబంధంలేని విశాఖలో బోర్డు ఏర్పాటును ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరుగుతున్నందున...కర్నూలు జిల్లాలో బోర్డు పెట్టాలంటూ కోరుతున్నారు. నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు కర్నూలులోనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం త్వరితగతిన స్పందించకుంటే.... ఉద్యమానికి సిద్ధమవుతామని....ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు హెచ్చరిస్తున్నారు.

కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజురోజూకు పెరుగుతోంది. కృష్ణా నదికి ఎలాంటి సంబంధం లేని విశాఖలో ఏర్పాటును ప్రజాసంఘాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ జరుగుతున్నందున కర్నూలులో బోర్డును పెట్టాలని కోరుతున్నారు.

కృష్ణానది బోర్డు వివాదం

కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయం(కేఆర్ఎంబీ) ప్రస్తుతం హైదరాబాద్​లో ఉంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేఆర్ఎంబీని ఆంధ్రప్రదేశ్​లో ఏర్పాటు చేయాలి. గత ఆరేళ్లుగా ఈ కార్యాలయం గురించి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గతేడాది అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్​లో... రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల రాయలసీమ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేస్తారని భావించారు. తాజాగా... కేఆర్ఎంబీ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.

స్పందించకుంటే ఉద్యమబాట పడతాం

కృష్ణానదిపై ఉన్న ప్రధాన జలాశయాల్లో ఒక్కటైన శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది. ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, గాలేరు- నగరి, హంద్రీనీవా, తెలుగుగంగ ప్రాజెక్టులు సహా దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టులకు, నాగార్జునసాగర్​కు శ్రీశైలమే కేంద్రం. ఎడమగట్టు, కుడిగట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలు విద్యుత్​ను ఉత్పత్తి చేసుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం ఎక్కువ నీటిని వినియోగించుకుంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. నీటి వినియోగం విషయంలో తరచుగా రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఎక్కువ నీటిని వాడుకోవటం వల్ల... ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాలకు నీటి కొరత ఏర్పడిన సందర్భాలు లేకపోలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలను సామరస్యంగా పరిష్కరించేందుకు కర్నూలులోనే కృష్ణా బోర్డును ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేఆర్ఎంబీ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయకపోతే... ఉద్యమానికి సిద్ధం అవుతామని ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి.

ఇదీ చదవండి:

బతుకు బండికి పడింది పంక్చర్​.. అమ్మాయి పట్టింది రెంచ్​..


ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.