ETV Bharat / state

NO DSC notification: డీఎస్సీ హామీకి గ్రహణం వీడేదెప్పుడు..!

author img

By

Published : Oct 26, 2022, 8:10 AM IST

NO DSC notification: మెగా డీఎస్సీ.! ఈ మాట ఎక్కడో, ఎప్పుడో విన్నట్టుంది కదూ..! ఇది విన్నమాట కాదు.! జగన్ మోహన్‌ రెడ్డి పాదయాత్ర పొడవునా అన్న మాట! నిరుద్యోగుల గోడు విన్నాను మీకు నేనున్నానంటూ భరోసాఇచ్చారు. అధికారంలోకి వస్తూనే మెగా డీఎస్సీ వేస్తానంటూ డైలాగ్‌లు పేల్చారు. కానీ అదంతా దగా అని తేలిపోయింది. మూడున్నరేళ్లలో డీఎస్సీ మాటేలేదు. నోటిఫికేషన్‌ ఊసేలేదు. ఒక్కటంటే ఒక్క ఉపాధ్యాయ పోస్టూ భర్తీచేయలేదు. జగన్‌కైతే సీఎం ఉద్యోగం వచ్చిందిగానీ ఆయన మాటలు నమ్మిన నిరుద్యోగులు మాత్రం ఇంకా కోచింగ్‌ సెంటర్లలోనే కుస్తీ పడుతున్నారు. ఇంతకీ డీఎస్సీ హామీకి గ్రహణం వీడేదెప్పుడు

DSC
డీఎస్సీ హామీకి గ్రహణం వీడేదెప్పుడు

డీఎస్సీ హామీకి గ్రహణం వీడేదెప్పుడు..!

NO DSC notification: విన్నారుగా జగన్‌ మాట.! మాట తప్పను మడమ తిప్పనని చెప్పుకునే.. రోజుల్లో దంచిన స్పీచ్‌ ఇది. ఆయన కలైతే నెరేవేరింది. నిరుద్యోగుల స్వప్నం మాత్రం పగటికలగా మిగిలిపోతోంది. ఇది విజయవాడలోని.. ఒక శిక్షణా కేంద్రం.! వీరంతా మెగా డీఎస్సీ మాయలో పడిన వాళ్లే. జగన్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ పుస్తకాలు తిరగేస్తూనే ఉన్నారు. నోటిఫికేషనేమైనా వచ్చిందా అని రోజూపొద్దున్నే ఆతృతగా వార్తాపత్రికలు తిరగేస్తున్నారు. పేజీలు నలుగుతున్నాయి, పేపర్లు చిరుగుతున్నాయేతప్ప.. వాళ్ల నిరీక్షణ ఫలించడంలేదు. ఆశ చచ్చినప్పుడల్లా ఇక మెగా డీఎస్సీ ప్రకటనే తరువాయి అంటూ పుకార్లు షికారు చేయడం, ఈసారి నిజమేనేమో అని పొరబడడం, మళ్లీ కోచింగ్‌ సెంటర్లకు వెళ్లడం, వేలకు వేలు ఫీజులు సమర్పించుకోవం మూడున్నరేళ్లుగా ఇదే తంతు.! ఫీజులు,.. భోజనాలు, వసతి ఖర్చులు కలిపితే తడిసి మోపెడవుతోంది. ప్రైవేటు ఉద్యోగాలు కూడా వదిలేసి శిక్షణ తీసుకుంటున్నవారి పరిస్థితి మరీ దైన్యం.!

బడిపంతులుగా బతకాలనేది చాలామంది నిరుద్యోగుల ఆకాంక్ష. కొందరికైతే అదే జీవితాశయం. అలా బీఈడీ, టీటీసీ సహా వృత్తి విద్యా కోర్సులు చేశారు. కొందరు కుటుంబాల్ని వదలి పట్నాలకు వచ్చిశిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో కన్నబిడ్డల్ని తల్లిదండ్రుల వద్ద వదిలిపెట్టి మరీసిద్ధమవుతున్నగృహిణులున్నారు. టీచర్‌ కొలువులో చేరాకే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టిన యువకులున్నారు. అలాంటి వాళ్లందరికీ మరో మూడున్నరేళ్లు వయసుపైబడిందేగానీ నోటిఫికేషన్‌ నిరీక్షణ ఫలించడం లేదు.

మెగా డీఎస్సీ హామీని నమ్ముకుని మూడున్నరేళ్లలో.. లక్షలు పోసి కోర్సుల్లో చేరిన వాళ్లున్నారు. ఏటికేడు ఆశావహూలూ పెరిగిపోతున్నారు. వేరే ఉద్యోగానికి ట్రై చేద్దామంటే ఇతర నోటిఫికేషన్ల ఊసూలేదు.! ఏళ్లకు ఏళ్లు శిక్షణ ఖర్చులు భరించలేక.. కొందరు చిన్నాచితక ప్రైవేటు ఉద్యోగాలు చూసుకున్నారు. కొందరైతే జగన్‌ మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతో కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఇది శిక్షణో.. శిక్షో అర్థంకావడంలేదని ఆక్రోశిస్తున్నారు ఉద్యోగార్థులు.

వైకాపా ప్రభుత్వం ఇటీవలే హడావుడిగా టెట్‌ నిర్వహించింది. వెంటనే డీఎస్సీ ప్రకటన వస్తుందనుకుని నిరుద్యోగులు.. తిరిగి కోచింగ్ కేంద్రాల బాట పట్టారు. 4నెలలుగా డీఎస్సీ కోచింగ్ కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి. టెట్‌కు ముందు డీఎస్సీపై హడావుడి చేసిన ప్రభుత్వం.. ఆ తర్వాత గప్‌చుప్‌ అయింది. నిరీక్షించి నీరసించిన నిరుద్యోగులు బిక్షాటన ద్వారా ప్రభుత్వానికి నిరసన గళం వినిపిస్తున్నారు.

2018నాటికి రాష్ట్రంలో రమారమి 23 వేల టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఎన్నికల ప్రచారంలో జగన్‌ స్వయంగా చెప్పారు. ఈ నాలుగేళ్లలో.. అనేక మంది పదవీ విరమణ చేశారు. ఆ లెక్కన చూస్తే ఖాళీలు పెరిగాయేగానీ తగ్గలేదు. నిరుద్యోగుల సంఖ్యా పెరుగుతూ పోతోంది. మరి ఉపాధ్యాయ పోస్టులు పెంచుకుంటూ పోవాల్సిన జగన్‌.. నోటిఫికేషన్‌ ఇచ్చే స్థితిలో ఉండీ ఎందుకు నోరు మెదపడంలేదన్నది.. దగాపడిన నిరుద్యోగుల ప్రశ్న?

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.