ETV Bharat / state

భావి ప్రపంచంతో పిల్లలు పోటీపడి నెగ్గేలా అడుగులు: సీఎం జగన్​

author img

By

Published : Mar 21, 2023, 3:45 PM IST

Gorumudda scheme : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగి జావ పంపిణీ.. గోరుముద్ద పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రాగిజావ పంపిణీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. వారంలో మూడు రోజుల పాటు రాగి జావ అందించనున్నట్లు సీఎం తెలిపారు.

Etv Bharat
Etv Bharat

Gorumudda scheme : పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని దీనికోసం గోరుముద్ద పథకంలో రాగిజావ అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిల్లలకు సదుపాయాలు కల్పించడం సహా మేథో వికాసం పెంచడం, ప్రోత్సహించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రపంచంలో పోటీ పడేలా పిల్లలను తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు రాగిజావ సరఫరా ద్వారా పిల్లలకు పోషకాహార లోపం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పోషకాహారం.. రాగిజావ పంపిణీ... ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాగి జావ పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. గోరుముద్ద పథకంలో భాగంగా మరో పోషకాహారంగా రాగిజావ సరఫరా చేస్తోంది. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో రాగిజావ పంపిణీని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు ఇందులో పాల్గొన్నారు. వారంలో మూడు రోజుల పాటు రాగి జావ అందించనున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 44,392 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లోని 37,63,698 మంది విద్యార్థులకు రాగిజావ అందజేయనున్నట్లు తెలిపారు. రాగిజావ పంపిణీ కోసం ఏటా రూ.86 కోట్ల అదనపు వ్యయం ఖర్చవుతుందన్న సీఎం.. వీటిలో సత్యసాయి ట్రస్టు రూ.42 కోట్లు, ప్రభుత్వం రూ.44 కోట్లు భరిస్తుందని తెలిపారు. పథకంలో భాగస్వామ్యులవుతున్నందుకు సత్యసాయి ట్రస్టును సీఎం అభినందించారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టి... అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి బడి మానేసిన పిల్లల సంఖ్యను తగ్గించడంపై దృష్టి పెట్టామన్న సీఎం.. పిల్లలకు సదుపాయాలు తగ్గించడం, పిల్లల మేధో వికాసం పెంచడం, ప్రోత్సహించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వెల్లడించారు. సంపూర్ణపోషణ, విద్యాకానుక, నాడు-నేడు, సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియం తీసుకువచ్చామన్నారు. ప్రభుత్వ బడుల్లో డిజిటల్ బోధనను అందుబాటులోకి తెస్తున్నామని, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ పంపిణీ చేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. పిల్లలను ప్రోత్సహించేందుకు అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు అమలు చేస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. భావి ప్రపంచంతో పిల్లలు పోటీ పడి నెగ్గేలా ప్రతి అడుగు వేస్తున్నామన్నారు. మెరుగ్గా గోరుముద్ద తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నట్లు సీఎం తెలిపారు.

ఏటా రూ.1824 కోట్లు ఖర్చు... వారంలో మూడు రోజుల పాటు పిల్లలకు రాగిజావ ఇస్తున్నామన్న సీఎం.. దీనిద్వారా పిల్లల్లో కాల్షియం, ఐరన్ పెరిగేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత ప్రభుత్వంలో మధ్యాహ్న భోజనం పథకం సరిగా అమలయ్యేది కాదన్న సీఎం.. నాణ్యత లేకుండా అధ్వానంగా ఉన్న పరిస్థితుల నుంచి పూర్తిగా మార్చినట్లు తెలిపారు. గతంలో పోషకాహారం అందించేందుకు ఏడాదికి రూ. 450 కోట్లు మాత్రమే ఇస్తుండగా ఇప్పుడు రూ.1824 కోట్లను గోరుముద్ద కార్యక్రమంలో ఖర్చు పెడుతున్నామన్నారు. పిల్లలు ఏం తింటున్నారో తెలుసుకుని, మెనూ మార్చి అమలు చేస్తున్నామని, వారంలో 15 రకాల ఆహార పదార్థాలు గోరుముద్దలో పిల్లలకు అందిస్తున్నామన్నారు.

విద్యార్థులతో సీఎం ముఖాముఖి... రాగిజావ పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో విద్యార్థులతో సీఎం వర్చువల్​గా ముఖాముఖి నిర్వహించారు. విజయనగరం జిల్లా రామ భద్రాపురం హైస్కూల్​కు చెందిన 9వ తరగతి విద్యార్థిని హైమావతి సీఎంతో మాట్లాడారు. తాము 3 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుకుంటూ పాఠశాలకు వస్తున్నామని, గతంలో ఇచ్చిన సైకిళ్లు పాతబడిపోయాయని, సైకిళ్లు ఇవ్వాలని కోరారు. 9వ తరగతి విద్యార్థినులకూ ట్యాబ్లు ఇవ్వాలని కోరారు. విద్యార్థినులకు సైకిళ్లు సహా 9వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీపై ఆలోచిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఏప్రిల్ 3 నుంచి 18వరకు పదో తరగతి పరీక్షలు, ఏప్రిల్ 20 నుంచి మిగిలిన తరగతుల పిల్లలకు పరీక్షలు జరగనున్నాయన్న సీఎం... పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.