ETV Bharat / state

ముగిసిన రాష్ట్రపతి ఐదు రోజుల దక్షిణాది విడిది

author img

By

Published : Dec 30, 2022, 7:07 PM IST

President Draupadi Murmu Tour : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల పర్యటన దక్షిణాదిలో ముగిసింది. పర్యటనలో చివరి రోజున తెలంగాణలోని యాదాద్రిని సందర్శించారు. అనంతరం హైదరాబాద్​కు చేరుకుని.. అక్కడి నుంచి దిల్లీకి పయనమయ్యారు.

President Draupadi Murmu
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Draupadi Murmu Telangana Tour : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల దక్షిణాది పర్యటన ముగిసింది. పర్యటనలో చివరి రోజు యాదాద్రిలో పర్యటించిన దేశ ప్రథమ పౌరురాలు.. లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాఠోడ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతో పాటు.. ఆలయ బాధ్యులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు.

యాదాద్రి ఆలయ అర్చకులు మంగళ వాద్యాలు, పూర్ణకుంభంతో ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు. గర్భాలయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని రాష్ట్రపతి దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అర్చకులు... చతుర్వేద ఆశీర్వచనాలు అందించారు. యాదాద్రి ఆలయ క్షేత్రాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. అద్భుతమైన శిల్పకళను చూసి అచ్చెరువొందారు.

ఆలయ సందర్శన అనంతరం తిరిగివచ్చిన ద్రౌపది ముర్ము.. రాష్ట్రపతి నిలయంలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సభాపతి పోచారం, ఇతర మంత్రులు హాజరయ్యారు. ఎంపీలు రేవంత్ రెడ్డి, బండి సంజయ్​తో పాటు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, ప్రజా గాయకుడు గద్దర్ సైతం విందుకు హాజరయ్యారు. అనంతరం ద్రౌపదీ ముర్ము హైదరాబాద్‌ హకీంపేట ఎయిర్‌ బేస్‌ నుంచి దిల్లీకి పయనమయ్యారు. రాష్ట్రపతికి గవర్నర్‌ తమిళిసై, మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి వీడ్కోలు పలికారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.