ETV Bharat / state

Amaravati capital JAC leaders: ఆర్ 5 జోన్​పై 'దళిత బహుజన గర్జన సభ': రాజధాని జేఏసీ

author img

By

Published : May 10, 2023, 3:02 PM IST

Updated : May 10, 2023, 4:57 PM IST

Amaravati capital JAC leaders : రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూముల విషయంలో రైతులను, పేదలను మోసం చేస్తోందని రాజధాని జేఏసీ నేతలు మండిపడ్డారు. నివాసేతర ప్రాంతంలో ఆర్ 5 జోన్ పేరిట ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం సరికాదన్నారు. సీఎం జగన్ తన హయాంలో వెయ్యి ఎకరాలైనా సేకరించి పేదలకు పంచగలరా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్ 5 జోన్ ప్రతిపాదన వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

రాజధాని జేఏసీ నేతలు
రాజధాని జేఏసీ నేతలు

Amaravati Capital JAC Leaders : రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని రాజధాని జేఏసీ నేతలు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వల్ల సుమారు లక్షల 50 వేల మంది పేదలు కోల్పోతున్నారని తెలిపారు. కృష్ణ, గుంటూరు జిల్లాలోని కాదని మిగతా అన్ని జిల్లాల్లోనూ పేదలు ఉన్నారని వారికి అమరావతిలో స్థలాలు కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. రాబోయే ప్రభుత్వం.. పేదలకు జగన్ ఇచ్చే స్థలాలను రద్దుచేసి ఆర్ 3 జోన్ లో ఇళ్ల పట్టాలను పంపిణీ చేస్తుందని జేఏసీ నేతలు తెలిపారు. ఇడుపులపాయ లోటస్ పాండ్​లో రాయి పాతితే మీకు ఎలా ఉంటుందో... రాజధాని కోసం ఇచ్చిన స్థలాల్లో హద్దురాళ్లు పాతడం తమకూ అలానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భోగాపురంలో విమానాశ్రయ నిర్మాణానికి స్థలాలు ఇచ్చిన రైతులను మొక్కి.. రాజధాని కోసం ఇచ్చినవారిని కాలితో తంతారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆర్ 5 జోన్ ను వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే అన్ని జేఏసీలను కలుపుకొని దళిత బహుజన గర్జన పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని రైతు నేతలు చెప్పారు.

అమరావతి ఐకాస నేతలు

గత ప్రభుత్వం ఆర్ 3 జోన్ పరిధిలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. 5వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. కానీ, ఈ ప్రభుత్వం 2500 ఎకరాలున్న ఆ ప్రాంతాన్ని వదిలేసి ఆర్ 5 జోన్ క్రియేట్ చేసింది. తీరా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినా తిరిగి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటి..? రాజధాని భూములనే రద్దు చేయడం కరెక్టేనా..? పేదల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు. అమరావతి రాష్ట్ర ప్రజలకు అక్షయ పాత్ర అనే విషయాన్ని గుర్తించాలి. జగన్ మోహన్ రెడ్డికి ఓట్ల భిక్ష పాత్ర. జగన్ రెడ్డికి దమ్ముంటే భూములు కొని పేదలకు పంచాలి. నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక్క మాటతో 34వేల ఎకరాలు తీసుకున్నాడు. కానీ, జగన్ రెడ్డి వెయ్యి ఎకరాలైనా సేకరించగలరా..? సేకరించి ఇళ్ల పట్టాలివ్వగలరా..? అత్త సొమ్ము అల్లుడి దానం అన్నట్లుగా ఉంది. - బహుజన ఆత్మగౌరవ సమితి నాయకుడు

అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరుగుతాయి. కానీ, ఈ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్​ను ఇష్టారాజ్యంగా మార్చివేస్తోంది. నివాస యోగ్యమైన భూమిని వదిలి నివాసేతర భూమిని కేటాయించడం నిబంధనలకు విరుద్ధం. ఈ విషయంలో సీఆర్డీఏ అధికారులను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తుంది. ఈ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రైతులం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం. అమరావతి కార్యకలాపాలు ప్రారంభించినపుడే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పేదలకు 5024 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. ప్రతి ఎకరంలో 5శాతం భూమిని పేదల ఇళ్లకు కేటాయించాలని ప్రభుత్వం, రైతులకు మధ్య ఒప్పందం కుదిరింది. కానీ, ఆ ఒప్పందాలను ఉల్లంఘించడం దుర్మార్గం. ఈ ప్రభుత్వం పంచాలనుకుంటున్న స్థలంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగితే లక్ష మందికి పైగా నివాసం కల్పించే వీలుంది. - అమరావతి రైతు జేఏసీ నేత

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం పేదల మధ్య చిచ్చు పెడుతున్నాడు. స్వార్థపూరిత రాజకీయాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి పేదలను తీసుకువస్తామని చెప్పి.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడే 8 సంవత్సరాలుగా నివాసం ఉంటూ వివాహం చేసుకున్న ఎంతో మంది పేదలు నివాసం లేకుండా అద్దె ఇళ్లలో ఉంటున్నారు. వారికి ఇవ్వాల్సిన టిడ్కో గృహాలు మంజూరు చేయాలి. ఇక్కడ ఉపాధి మొదలైతే రాజధాని రైతులే పేదలను తీసుకువస్తారు. ఇవ్వాళ్టికి కూడా మాకు కౌలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది. - షేక్ సాహెబ్ జాన్, మైనార్టీ జేఏసీ నాయకుడు

ఇవీ చదవండి :

Last Updated :May 10, 2023, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.