ETV Bharat / state

రాష్ట్రంలో పోలీస్ రాజ్యం.. జీవో నంబర్ 1 రద్దుకు ఉద్యమ కార్యాచరణ

author img

By

Published : Feb 4, 2023, 7:30 PM IST

జీవో నంబర్ 1 రద్దుకు ఉద్యమ కార్యాచరణ
జీవో నంబర్ 1 రద్దుకు ఉద్యమ కార్యాచరణ

About GO No.1 : విపక్షాల గొంతునొక్కే జీవో నంబర్ 1 రద్దుపై వైసీపీయేతర పక్షాలు పోరాటం సాగిస్తున్నాయి. ప్రభుత్వం జీవో విడుదల సమయంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిర్వహించే బహిరంగ సభలకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పిందని విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు గుర్తు చేశారు. రాష్ట్రంలో విపక్ష సభ్యులను అణగతొక్కి, వ్యవస్థలను జగన్ చేతుల్లో పెట్టుకోవాలనే ఈ జీవో నంబర్ 1ని తెరపైకి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

About G.O.number 1 : పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తున్న జీవో 1ను రద్దు చేయాలని కోరుతూ విపక్షాలు ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. ఇందుకోసం ఈనెల 19న విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నాయి. అవసరమైతే చలో అసెంబ్లీకి కూడా పిలుపు ఇస్తామని జీవో నం1 రద్దు పోరాట ఐక్య వేదిక నేతలు తెలిపారు.

ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం : ప్రజాస్వామ్య హక్కులను, ప్రజలు శాంతియుతంగా చేపట్టే నిరసనలను కాలరాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం1 రద్దు చేయాలని విపక్షాలు, ప్రజా సంఘాల నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు విజయవాడలో జీవో నం1 రద్దు పోరాట ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజల వ్యతిరేకతను ఏమాత్రం గౌరవించకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తోందని వివిధ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్వవహరిస్తున్న తీరును ప్రతి పౌరుడు తీవ్రంగా ఖండిచాలని వారు కోరారు. జీవో 1ని ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం చేయాలని వారు పిలుపునిచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు : ఈనెల 19వ తేదీన మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రవ్యాపిత సదస్సు నిర్వహిస్తున్నామని జీవో నం1 రద్దు పోరాట ఐక్య వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జీవో నంబర్ 1 విడుదల అప్రజాస్వామికని తెదేపా, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. రాజ్యంగ వ్యవస్థలను తన గుప్పెట పెట్టుకుని రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్ చూస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితేనే ప్రజల మనుగడ సాధ్యపడుతుందన్న సంగతి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ రాష్ట్రమంతా పాదయాత్ర చేశారని, ఇప్పుడు ఇతర పార్టీల నేతలు పాదయాత్రలు, శాంతియుత నిరసనలు తెలుపుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 1 పై విస్తృత ప్రజా వేదికను ఏర్పాటు చేసి ఉద్యమానికి అందరూ సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందన్నారు. జీవో 1 రద్దుపై ఏ ఉద్యమ కార్యాచరణ తీసుకున్న తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని పేర్కొన్నారు.

కేసులు పెట్టి వేధిస్తున్నారు.. : ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై నిరసన తెలియచేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. విపక్ష పార్టీలపై ఆ బాధ్యత మరింత ఉంటుంది, కానీ వైకాపా ప్రభుత్వం ప్రజా సమస్యలపై గళం విప్పుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని వేధింపులకు దిగుతోంది. ప్రజల తరఫున పోరాటం చేస్తే ముందుస్తు అరెస్టులు చేయిస్తోంది. కేసులు పెట్టి వేధిస్తోందని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఏపీని రాచరికంగా భావిస్తున్నారని, ప్రభుత్వానికి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడినా తట్టుకోలేకపోతున్నారని విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు.

అనేక ఆంక్షలు : జీవో 1లో ఏముంది అనేది ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం తప్పుదారి పట్టిస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై తప్పు ఎక్కడైనా సభలు, సమావేశాలు నిర్వహించుకోచ్చని ప్రభుత్వం చెబుతూనే ప్రజలపై అనేక ఆంక్షలు విధిస్తోందని చెబుతున్నారు. జీవో 1 పేరుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతుందని వాపోతున్నారు. స్వంత స్థలంలో నిరసన కార్యక్రమం చేసుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం నిన్న గన్నవరంలో ఉపాధ్యాయులు శాంతియుత నిరసనలు తెలుపుతుంటే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. జీవో 1 అనేది విపక్షాలకు, ప్రజా సంఘాలకు మాత్రమే వర్తిస్తుందని, అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా సభలు నిర్వహించుకోవచ్చని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకువెళ్లకుండా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటువంటి జీవోను తీసుకువచ్చిందని, ఇంతకంటే దారుణం మరోకటి ఉందన్నారు.

జీవో నంబర్ 1 రద్దుకు ఉద్యమ కార్యాచరణ

జీవోను రద్దు చేయాలని టీడీపీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తోంది. భారతదేశ చరిత్రలో స్వాతంత్య్రానంతరం జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు తీవ్ర విఘాతం కలుగుతోంది. జీవో నంబర్ 1 అందుకు పరాకాష్టగా నిలుస్తోంది. సభలు, సమావేశాలు నిర్వహించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. అధికార పార్టీ సభ్యులకు అనుమతులు కల్పిస్తూ ప్రతిపక్ష పార్టీలు, నాయకుల పట్ల వివక్ష చూపుతున్నారు. జీవో నంబర్1 రద్దు కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిస్తున్నాం. - నెట్టెం రఘురాం, తెదేపా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు

అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తూ, ప్రతి పక్షాల గొంతు నొక్కేందుకు, ప్రభుత్వ పనితీరును ప్రశ్నించే వారిని అణిచి వేసేందుకు తెచ్చిన ఈ జీవోపై పోరాటం కొనసాగుతోంది. ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ఉరూ, వాడా తిరిగి పాదయాత్రలు చేయలేదా.. అధికారంలోకి వచ్చాక.. అదే ప్రజా సమస్యలపై వినే పరిస్థితిలో లేడు. అన్ని పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు అందరూ కదిలిరావాలి... చలో అసెంబ్లీని విజయవంతం చేయాలి. - సుంకర పద్మశ్రీ, ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్

అధికారంలో ఉన్నపుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో మరోలా వైఖరి ఉండడం సరికాదు. నిర్బంధాలపై ఉద్యమ కార్యాచరణ కొనసాగిస్తాం. శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలిపిన ఉపాధ్యాయులను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం. ప్రభుత్వం ఇప్పటికైనా జీవో నంబర్ 1ని రద్దు చేయాలి. - వై. వెంకటేశ్వరావు, సిపిఎం రాష్ట్ర నాయకులు

నాలుగేళ్ల జగన్ పాలనలో నాగరికత లేదు. నిర్ణయాలు దారుణంగా ఉన్నాయి. బ్రిటీష్ పాలనలో కూడా లేని ఆరాచక పాలన సాగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పాలన చూడలేదు. అన్ని వర్గాలను సమీకరించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం. - నరహరిశెట్టి నరసింహరావు, కాంగ్రెస్ నాయకులు

జీవో 1 ను విడుదల చేసిన ప్రభుత్వం.. ఆ జీవోలో ఉన్న విషయంపై ప్రజలను, రాజకీయ పార్టీలను గందరగోళ పరచడంలో విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. అన్ని పార్టీలకు ఈ జీవో వర్తిస్తుందని చెబుతూనే కేవలం ప్రతిపక్ష పార్టీలకు మాత్రమే ఈ జీవోను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు పిలుపు ఇస్తే పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారని మండిపడుతున్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తుంటే రోడ్డుపై సమావేశం పెట్టారని ఆయనపై కేసు పెట్టారని, సీఎం జగన్ కూడా పాదయాత్ర చేసి తన పాదయాత్రలో మైక్ వాడలేదా..? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, పాదయాత్రలు చేయకుండా ఈ జీవోను తీసుకువచ్చారని వివరించారు. వైకాపా నేతలు ఏది చెపితే పోలీసులు అది పాటిస్తున్నారని, పోలీసులు ఇలాగే ఉంటే ప్రజల్లో చులకనభావం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఏ కార్యక్రమం చేయాలన్నా న్యాయస్థానం అనుమతి తీసుకోవాల్సి వస్తుందని అవేదన వ్యక్తం చేశారు. న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి సరిపోయిందని, లేకుంటే రాష్ట్రంలో గొంతుకూడా ఎత్తే పరిస్థితి లేకుండా ఉండేదన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందన్నారు. ప్రభుత్వంలో చలనం రావాలంటే కచ్చితంగా చలో అసెంబ్లీ పెట్టాలన్నారు.

రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని జీవో 1 రద్దు పోరాట కమిటీ రాష్ట్ర కన్వీనర్లు సుంకర రాజేంద్రప్రసాద్, ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. ప్రైవేట్ స్థలాల్లో సమావేశాలు పెట్టుకుంటే పోలీసులను అనుమతి అడగాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో నిర్బంధాలు జరుగుతుంటే కొంతమంది నేతలు పేపర్ ప్రకటనలకే పరిమితమయ్యారని తెలిపారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే జీవో 1 ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేయగలమన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా పౌర హక్కుల ఉల్లంఘన జరిగితే మానవ హక్కుల సంఘానికి తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. ఈనెల 19వ తేదీన విజయవాడలో జీవో నంబర్ 1పై రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని, చర్చించిన అనంతరు ఛలో అసెంబ్లీ తేదీని కూడా ప్రకటిస్తామన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.