ETV Bharat / state

CBN GUDIVADA TOUR: కోడి కత్తి దాడి, బాబాయి హత్య జగన్నాటకమే.. గుడివాడలో చంద్రబాబు నిప్పులు

author img

By

Published : Apr 14, 2023, 8:19 AM IST

Updated : Apr 14, 2023, 8:58 AM IST

TDP chief
TDP chief

TDP chief Chandrababu Naidu Gudivada visited news: 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొని.. సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు. కోడి కత్తి దాడి, బాబాయి హత్యను ఎన్నికల్లో లబ్ధికోసం వాడుకున్న జగన్.. రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని వ్యాఖ్యానించారు.

TDP chief Chandrababu Naidu Gudivada visited news: కోడి కత్తి కేసు 'పీకే ఆడించిన డ్రామా' అని తాను ఎప్పుడో చెప్పానని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కూడా అదే విషయాన్ని తేల్చి చెప్పిందన్నారు. కోడి కత్తి దాడి, బాబాయి హత్యను ఎన్నికల్లో లబ్ధికోసం జగన్ వాడుకున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి తప్పులన్నీ చేసిన జగన్‌.. వాటి నుంచి రక్షణ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం.. మందబలం, ఆర్థిక బలం లేదని నంగనాచి కబుర్లు చెబుతున్నారంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన సభలో.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం వాళ్లే కోడికత్తి దాడి చేయించారంటూ నాటకాలాడి.. ఎన్నికల్లో లబ్ధి పొందారని ధ్వజమెత్తారు. నిందితుడు శ్రీనివాసరావుకు తెలుగుదేశంతో ఎలాంటి సంబంధం లేదని ఎన్‌ఐఏ కూడా స్పష్టం చేసిందంటే.. జగన్‌ ఎన్ని అబద్ధాలు చెప్పారో అర్థమవుతుందన్నారు. బాబాయిను ఎవరు హత్య చేశారో తెలిసినా కావాలనే తనపై బురదజల్లారని.. ఇప్పుడు కోర్టుల్లో వేర్వేరు పిటిషన్లు వేస్తూ రోజుకో రకంగా వివేకాను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన జగన్‌.. తనకు భుజ బలం, అర్థ బలం లేదంటూ బీద అరుపులు అరుస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. అవినీతి సొమ్ములతో పత్రిక, ఛానల్‌ పెట్టిన జగన్.. మీడియా మద్దతు లేదంటూ చిలుక పలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి అబద్ధాల జగన్‌కు మరోసారి ఓట్లేస్తే.. ఇక రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరని చంద్రబాబు హెచ్చరించారు. దోచుకోవడం జగన్‌ మోడలైతే.. ప్రతి పేదవాడికి అండగా నిలబడాలన్నదే తన విధానమని చంద్రబాబు చెప్పారు. రాజకీయ భిక్షపెట్టిన పార్టీపైనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విషం కక్కుతున్నారని.. ఇలాంటి వాళ్లకు ఎలా బుద్ధిచెప్పాలో తెలుసని చంద్రబాబు హెచ్చరించారు.

అంతకుముందు నిమ్మకూరు నుంచి గుడివాడకు చంద్రబాబు ర్యాలీగా వచ్చారు. భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలు.. దారి పొడవునా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. సమయం మించిపోయినా వేచిచూసి మరీ ఆయనకు మద్దతు తెలిపారు. గుడివాడ పట్టణమైతే పసుపుమయం అయింది. ఇక్కడ పలుసార్లు వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు దిగారు. దీనివల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

నేడు గుడివాడలో నిర్వహించే అంబేడ్కర్‌ జయంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. ఈ సందర్భంగా పాస్టర్లతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం హనుమాన్‌ జంక్షన్‌ మీదుగా నూజివీడుకు వెళ్లి.. రోడ్‌షో నిర్వహిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభకు హాజరవుతారు.

కోడి కత్తి కేసు 'పీకే ఆడించిన డ్రామా'..చంద్రబాబు

ఇవీ చదవండి

Last Updated :Apr 14, 2023, 8:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.