ETV Bharat / state

కరోనా కట్టడి వైఫల్యంపై తెదేపా నేతల ఆగ్రహం

author img

By

Published : May 8, 2021, 7:59 PM IST

'వ్యాక్సిన్ సరఫరా చేయండి- ప్రాణాలు కాపాడండి' అనే నినాదంతో తెదేపా నేతలు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు దిగారు. ఇళ్ల వద్దే ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళనలు కొనసాగించారు. ముఖ్యమంత్రి నిర్లక్ష్యం కారణంగానే.. కరోనా ఉద్ధృతి అధికంగా ఉన్న దేశంలోని 30 జిల్లాల్లో 7 మన రాష్ట్రంలోనే ఉన్నాయని వారు ధ్వజమెత్తారు. సలహాలు ఇచ్చే ప్రతిపక్షనేతలపై తప్పుడు కేసులు, కక్ష సాధింపు చర్యలు మాని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు తక్షణమే వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

tdp leaders on corona measures in the state
కరోనా కట్టడి వైఫల్యంపై తెదేపా నేతల ఆగ్రహం..


తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపుమేరకు రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరతపై పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఎవరికి వారు తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లోనూ ఆందోళనలు కొనసాగించారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి లాక్​డౌన్​ విధిస్తేనే ప్రజల ప్రాణాలు నిలుస్తాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఇబ్బంది పడే ప్రజల పట్ల ప్రేమలేని ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నారని మండిపడ్డారు. ప్రజల పక్షాన తమ పోరాటమని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో టెస్టుల సామర్థ్యమూ పెంచాలని డిమాండ్ చేశారు. నాయకత్వ లోపం, అనర్హులకు పదవులు కట్టపెట్టడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి: మద్యం అమ్మకాలకు క్యూ.. వ్యాక్సిన్ల కేంద్రాల వద్ద తోపులాటా?: లోకేశ్

కేంద్రంపై నెపం నెట్టి తప్పించుకోవటం తగదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనంద్ బాబు దుయ్యబట్టారు. చంద్రబాబు మంచి సలహాలు ఇస్తుంటే ఆయనపై కేసులు పెట్టి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని ఆక్షేపించారు. వ్యాక్సిన్ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. కరోనా కట్టడికి సూచనలిస్తున్న చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ధ్వజమెత్తారు. బెయిల్ రద్దవుతుందనే భయంతోనే జగన్ రెడ్డి కేంద్రానికి పాదాభివందనాలు చేస్తున్నారని బండారు విమర్శించారు.

ఇదీ చదవండి: కరోనా రోగుల్లో 9లక్షల మందికి ఆక్సిజన్​తో చికిత్స

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పబ్జీ ఆటలు పక్కనపెట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. కరోనా తీవ్రత దృష్ట్యా ఇకనైనా మీనమేషాలు మాని అధ్వాన పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని హితవు పలికారు. జనహితుడిగా ఉండాల్సిన ముఖ్యమంత్రి జనహతుడిగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ చెంగల్రాయడు మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ కింద కొవిడ్‌కు చికిత్స ఏ ఆసుపత్రిలో అందిస్తున్నారో ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజకీయనేతలే మందులు, రెమ్​డెసివర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని తెలిసి కూడా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించారు.

ప్రజలు బతికుంటేనే పథకాలని ప్రభుత్వం గుర్తించి తక్షణమే టీకాలు కొనుగోలు చేయాలని తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాం చినబాబు విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి ప్యాలెస్ వదిలి బయట తిరగని సీఎంకు.. ప్రజల ప్రాణాలు విలువైనవి కాదా అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 20,065 కేసులు, 96 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.