ETV Bharat / state

పట్టాభి, మరో 13 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్​

author img

By

Published : Feb 21, 2023, 3:53 PM IST

Updated : Feb 21, 2023, 10:41 PM IST

TDP LEADER PATTABHI IN GANNAVARAM COURT : టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. పట్టాభి మరో 13 మంది నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. పట్టాభిని వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

pattabhi remand
pattabhi remand

TDP LEADER PATTABHI IN GANNAVARAM COURT : తెలుగుదేశం పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు గన్నవరం కోర్టులో హాజరుపరచగా... పట్టాభి మరో 13 మంది నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్​ విధించింది. పట్టాభిని వైద్య పరీక్షలకు పంపాలని న్యాయమూర్తి ఆదేశించగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గన్నవరం సీఐ కనకరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం నేత పట్టాభిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తెదేపా కార్యకర్తలను రెచ్చగొట్టడం ద్వారా తనకు పట్టాభి సహా ఇంకొందరు టీడీపీ నేతలు ప్రాణహాని కలిగించే ప్రయత్నం చేశారని సీఐ కనకారావు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏ-1 గా పట్టాభి, ఏ-2గా చిన్నా సహా మొత్తం 13 మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టులో పోలీసులు రిమాండ్ రిపోర్ట్ సబ్​మిట్​ చేశారు.

నిన్న పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైడ్రామా అనంతరం ఈరోజు గన్నవరం పీఎస్​కు తీసుకొచ్చారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించి.. స్థానిక అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు లోపలికి వెళ్లేముందు పట్టాభి తన వాచిపోయిన చేతులను అందరికీ చూపించారు. అదేవిధంగా కోర్టులోనూ తన న్యాయవాదులు, న్యాయమూర్తికి తనపై తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్​లో థర్డ్​ డిగ్రీ ప్రయోగించారని తెలిపారు. ముసుగులేసుకున్న ముగ్గురు వ్యక్తులు వచ్చి వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి అరగంట సేపు కొట్టారని వివరించారు. అరికాళ్లు, అరిచేతులపై కొట్టారని తెలిపారు. తనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లేసరికి స్టాఫ్‌ ఎవ్వరూ లేరని... లైట్లు కూడా లేవని పట్టాభి వెల్లడించారు. కొద్దిసేపటి తరువాత మూడు గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి టవల్ చుట్టి వేరే గదిలోకి ఈడ్చుకువెళ్లారని చెప్పారు. కోర్టులో కూడా న్యాయమూర్తికి ఈ విషయాలను పట్టాభి వివరించారు.

పట్టాభి, మరో 13 మంది టీడీపీ నేతలకు 14 రోజుల రిమాండ్​

నా భర్తను పోలీసులు చిత్రహింసలు పెట్టారు: పోలీసుల వైఖరిపై పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. తన భర్తను చూపించాలంటూ ఇంటి పైకి ఎక్కి నిరసన చేపట్టారు. పట్టాభి దగ్గరికి వెళ్లనీయకపోతే పైనుంచి దూకుతానంటూ హెచ్చరించారు. తన భర్తను పోలీసులు బాగా హింసించారని పట్టాభి భార్య చందన ఆరోపించారు. తోట్లవల్లూరు పీఎస్‍లో పట్టాభిని ముసుగేసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని మొదట్నుంచీ చెబుతున్నట్లు తెలిపారు. పట్టాభి ఇంత ఆందోళనతో ఎప్పుడూ కనిపించలేదన్నారు.

"నా భర్తను పోలీసులు బాగా హింసించారు. తోట్లవల్లూరు పీఎస్‍లో పట్టాభిని ముసుగేసి కొట్టారు. నా భర్తకు ప్రాణహాని ఉందని మొదట్నుంచీ చెబుతున్నా. నా భర్తకు ఏమైనా జరిగితే దానికి డీజీపీ, ప్రభుత్వానిదే బాధ్యత"-చందన, పట్టాభి భార్య

గన్నవరంలో 144 సెక్షన్​: గన్నవరం ఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసుల అనుమతుల్లేవని స్పష్టం చేశారు.విధులు నిర్వహిస్తున్న గన్నవరం సీఐ కనకారావు తలకు గాయమైందని.. పట్టాభి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి దృశ్యాలు పరిశీలిస్తున్నామన్న ఎస్పీ.. సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గన్నవరం పీఎస్‌ పరిధిలో 144 సెక్షన్‌, 30 యాక్టు అమలులో ఉందని.. ముందస్తు అనుమతి లేకుండా సభలు, నిరసనలు చేయవద్దని సూచించారు.

గన్నవరం ఘటనలో బాధితులపై అట్రాసిటీ కేసులు: గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం విధ్వంసకాండ ఘటనలో బాధితులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు మేరకు 60మందికి పైగా తెలుగుదేశం నేతలు, ఇతరుల పేరిట కేసులు నమోదు చేశారు. గన్నవరం తెలుగుదేశం నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30మందికి పైగా పార్టీ శ్రేణులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభి సహా మరో 16 టీడీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. బోడె ప్రసాద్​తో పాటు మరో 11మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

తన నివాసంలోనే పట్టాభి భార్య నిరసన: టీడీపీ నేత పట్టాభి ఎక్కడ ఉన్నారో ఆచూకీ తెలపాలంటూ డీజీపీ ఇంటి ముందు నిరాహారదీక్షకు బైక్‌పై బయల్దేరిన ఆయన భార్య చందనను పోలీసులు అడ్డుకున్నారు. పట్టాభిని మధ్యాహ్నం గన్నవరం కోర్టుకు తీసుకొస్తామని భార్య చందనకు పోలీసులు వివరించారు. తన భర్తతో వీడియో కాల్ మాట్లాడించాలని చందన కోరగా.. అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో తన నివాసంలోనే చందన ఆందోళనను కొనసాగించారు. చందనను వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామ ఫోన్‌లో పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 21, 2023, 10:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.