PINGALI VENKAYYA: ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

PINGALI VENKAYYA: ఘనంగా పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు
Pingali Venkayya: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి (Pingali Venkayya Birth anniversary) వేడుకలు.. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాల(National Flags)తో భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించి.. దేశభక్తిని చాటారు. పింగళి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని.. ముందుకు సాగాలని సూచించారు. పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Azadi ka Amrut Mahotsav: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త(Designer of the National Flag), స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య(Pingali Venkayya) 146వ జయంతి సందర్భంగా.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవిత చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం తిలకించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రేగుళ్ళ మల్లికార్జునరావు స్వయంగా చిత్రించిన పింగళి వెంకయ్య చిత్రపటాన్ని సీఎం ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.
బందరు రోడ్డులోని బాపు పురావస్తు ప్రదర్శనశాలలో జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య, స్వాతంత్య్ర సమరయోధులు బళ్లారి రాఘవ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. దేశభక్తి పరిఢవిల్లేలా విద్యార్ధుల నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరానికి పింగళి వెంకయ్య సమావేశ మందిరంగా నామకరణం చేశారు. కలెక్టర్ ఢిల్లీరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు మందిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. పింగళి వెంకయ్య స్వగ్రామమైన కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రులో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో కలెక్టర్ రంజిత్ బాషా, ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్, జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, అధికారులు... పింగళి చిత్రపటానికి నివాళి అర్పించారు. భట్లపెనుమర్రులో నిర్వహించిన వేడుకల్లో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని....పింగళి వెంకయ్య, మహాత్మా గాంధీ విగ్రహాలకు నివాళులు అర్పించారు. సభా ప్రాంగణం వద్ద చెత్తను లక్ష్మీనారాయణ స్వయంగా ఏరివేశారు. దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా జాతీయ జెండాకు రూపకల్పన చేసిన మహానుభావుడు పింగళి వెంకయ్య అని కొనియాడిన లక్ష్మీనారాయణ.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
కర్నూలు మాంటిస్సోరీ పాఠశాల విద్యార్థులు వందేమాతరం పేరుతో మాతృభూమికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. 3వేల5వందల మంది విద్యార్థులు...దేశ చిత్రపటం రూపంలో నిల్చొని దేశ భక్తిని చాటారు. విద్యార్థులు చేసిన దేశభక్తి నృత్యాలు ఆకట్టుకున్నాయి. 75 మంది 75 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చేర్చారు.
బాపట్ల జిల్లా చీరాల పింగళి వెంకయ్యకు అంజలి ఘటించి....అనంతరం ర్యాలీ నిర్వహించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో పింగళి వెంకయ్య 146 వ జయంతి వేడుకలు, బళ్లారి రాఘవాచార్యులు 142 వ జయంతి ఉత్సవాలను ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఘనంగా నిర్వహించారు. కడపలో మున్సిపల్ అధికారులు ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో జాతీయ పతాకాలు చేతపట్టుకుని ప్రదర్శన చేశారు.
విశాఖలో ఆర్కే బీచ్లోని కాళీ మాత ఆలయం నుంచి ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. మేయర్ హరి వెంకట కుమారి, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మిషా, సీపీ శ్రీకాంత్.. పింగళి వెంకయ్య, బళ్ళారి రాఘవ చిత్ర పటాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోవిద్యార్థులు, ఉపాధ్యాయులు భారీ ర్యాలీ చేశారు. విజయనగరంలో నిర్వహించిన సమైక్యతా ర్యాలీలో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని.....పింగళికి నివాళులర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో జాతీయ సమైక్యతా సద్భావనా ర్యాలీ నిర్వహించారు. ఏలూరులో ఎన్సీసీ విద్యార్థులు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
ఇవీ చూడండి
