ETV Bharat / state

Attack on RI: అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై దాడి

author img

By

Published : Apr 22, 2022, 4:59 AM IST

Updated : Apr 23, 2022, 3:50 AM IST

కృష్ణా జిల్లాలో ఆర్​ఐపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. జిల్లాలో అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకే ఆర్​ఐపై దాడి చేశారు. మట్టి తవ్వడం చట్టవిరుద్ధమని చెబుతున్నా వినకుండా.. అడ్డుకున్న తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆర్​ఐ.అరవింద్ వాపోయారు.

attack
attack

అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై దాడి
YSRCP followers attack: కృష్ణా జిల్లాలో అధికార వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఏకంగా మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌పైనే దాడికి తెగబడ్డారు. కొన్ని రోజుల నుంచి రాత్రివేళ అక్రమంగా మట్టి తవ్వుతున్నారనే సమాచారంతో.. రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆర్​ఐ అరవింద్‌ గుడివాడ మండలం మోటూరు ప్రాంతానికి వెళ్లారు. అప్పటికే అక్కడ జేసీబీలతో మట్టి తవ్వుతున్నారు.

దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆర్​ఐ... తవ్వడానికి వీల్లేదంటూ జేసీబీకి అడ్డుగా నిలబడ్డారు. రెచ్చిపోయిన వైకాపా వర్గీయులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. అదే క్రమంలో మీదికి వెళుతూ ఆయన్ను బెదిరించారు. అయినా వెనక్కి తగ్గకపోవడంతో ఆర్​ఐపై తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పోలీసులు అక్కడికి చేరుకోకపోవడంతో.. మట్టి తవ్వకాలు ఆపేశారు. మట్టి తవ్వడం చట్టవిరుద్ధమని చెబుతున్నా వినకుండా అడ్డుకున్న తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆర్​ఐ అరవింద్ వాపోయారు.

'మోటూరులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని..నాకు గుడివాడ తహశీల్దార్‌ నుంచి ఫోన్‌ వచ్చింది.. వీఆర్‌ఏ, వీఆర్‌వోలను వెంటబెట్టుకుని మోటూరుకు వెళ్లా.. జేసీబీ, మూడు ట్రాక్టర్లతో మట్టి తవ్వకాలు చేస్తున్నారు.. మట్టి తవ్వకాలను అపాలని హెచ్చరించా.. మట్టి తవ్వకాలు ఆపకుండా నాతో వాగ్వాదం చేశారు.. జేసీబీతో నాపై దాడి చేశారు.. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశా.. పోలీసులు వచ్చి 3 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్‌ చేశారు.' -అరవింద్‌, ఆర్​ఐ

స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అండతోనే గుడివాడ‌లో మట్టిమాఫియా చెలరేగిపోతుందని.. తెలుగుదేశం నేతలు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ తరలింపును అడ్డుకున్న అధికారిపై వైకాపా నేతలు దాడి చేయడాన్ని నేతలు ఖండించారు. దాడికి తెగబడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని.. తవ్వకాలను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. ఆర్‌ఐపై దాడి చేసిన వారి అరెస్టుకు రెవెన్యూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

మోటూరులో మ‌ట్టి త‌వ్వకాల‌ను అడ్డుకున్న R.I. అర‌వింద్‌పై దాడి ముమ్మాటికీ.. కొడాలి నాని పనేనని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యద‌ర్శి లోకేశ్​ ఆరోపించారు. మంత్రి ప‌ద‌వి పోయిన‌ క్యాసినో స్టార్.. విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నామని.. ఇలా త‌న మాఫియా గ్యాంగుల‌ను అడ్డుకునే రెవెన్యూ అధికారుల‌పై దాడులు చేయ‌డ‌మా అని నిలదీశారు. సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టిమాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయని ఆరోపించారు. రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు య‌త్నించిన గ‌డ్డం గ్యాంగ్ మ‌ట్టిమాఫియా అరాచ‌కాలు పోలీసుల‌కు ప‌ట్టవా అని నిలదీశారు.

R.I.పై దాడిచేసిన మ‌ట్టిమాఫియా.. దాని వెనుకున్న గ‌డ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. నేడు రెవెన్యూ అధికారుల‌పైకి వ‌చ్చిన జేసీబీ.. పోలీసుల‌పైకీ రాద‌న్న గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు. ప్రజ‌ల్ని ఎలాగూ ర‌క్షించ‌లేని.. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు వారి ప్రాణాల్నైనా వైకాపా రాక్షసుల నుంచి కాపాడుకోవాలన్నారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల‌కు ర‌క్షణ క‌ల్పించాల‌ని కోరారు.

అక్రమ మట్టి తవ్వకాలు.. అడ్డుకున్న ఆర్​ఐపై దాడి

హత్యాయత్నం కేసు నమోదు చేశాం

ఆర్‌ఐ జాస్తి అరవింద్‌ను జేసీబీతో నెట్టి వేసి హత్యకు యత్నించిన 10 మందిపై ఐపీసీ సెక్షన్‌ 353, 307 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. గంగిశెట్టి రాధాకృష్ణ, గంటా లక్ష్మణరావు, మొవ్వా నాగేశ్వరరావు, ఎస్‌.రంగబాబు, ఎస్‌.మహేష్‌, ఆవులమంద ఏడు కొండలు, ఎస్‌.సత్యనారాయణ, జితేంద్రలను అరెస్టు చేశాం. ఒక బాల నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నాం. గంటా సురేష్‌ను అరెస్టు చేయాల్సి ఉంది. ఒక జేసీబీ, 3 ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నాం. అధికారుల విధులకు ఆటంకం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. - కేఎన్‌వీ జయకుమార్‌, గుడివాడ గ్రామీణ సీఐ

ఇదీ చదవండి: Attack On Woman: పల్నాడు జిల్లాలో దళిత మహిళపై దాడి.. ఎందుకంటే..!

Last Updated :Apr 23, 2022, 3:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.