ETV Bharat / state

యథేచ్చగా పక్క రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక.. పట్టించుకోని అధికారులు

author img

By

Published : Mar 1, 2023, 10:51 PM IST

Updated : Mar 2, 2023, 7:05 AM IST

illegal sand
illegal sand

Illegal sand smuggling: ఇసుక రాష్ట్రంలో బంగారం కంటే ప్రియమైంది. మన రాష్ట్ర నదులలో ఇసుక ఉన్నా.. ఇల్లు కట్టుకుందామంటే మనకు దొరకడం కష్టమైంది. కానీ పక్క రాష్ట్రాలకు లారీలకు లారీలు తరలిపోతున్నాయి. ఎంతమంది అడ్డుకున్నా... ఎవరికీ ఫిర్యాదు చేసినా ప్రయోజనం శూన్యం. మరోవైపు కృష్ణానదిలో యథేచ్చగా ఇసుక తవ్వడంతో భూగర్బ జలాలు అడుగంటి సమీప బోర్లు పని చేయడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

Illegal sand smuggling: ఏపీలో ఇసుక ప్రియం.. అపురూపం.. భవన నిర్మాణ కార్యక్రమాలకు ఆయువుపట్టు.. ఇసుక స్వరాష్ట్రం ఏపీలో లభ్యం కాదు.. కృష్ణానది నుంచీ యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుండటంతో.. మన రాష్ట్ర నదులలో లభించే ఇసుక మాత్రం పొరుగు రాష్ట్రాలకు విస్తృతంగా ఎగుమతి కావడంతో భవన నిర్మాణ కార్మికుల పొట్టగొడుతున్నట్లవుతోంది. పశ్చిమకృష్ణాలో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి పొరుగు రాష్ట్రమైన తెలంగాణాకు మున్నేరు, కృష్ణా నది నుంచి భారీ ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా సంబంధిత శాఖల అధికార్లు ఆక్రమార్కులకు సహకరించడంలో మతలబు ఏమిటో అర్థంకాక ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఒకపక్క కృష్ణానదిలో యథేచ్ఛగా ఇసుక తవ్వి వందల లారీల్లో పక్క రాష్ట్రానికి తరలిస్తుంటే భూగర్భ జలాలు అడుగంటి సమీప బోర్లు పని చేయడం లేదని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు.

ఏపీలో ఇసుక బంగారం..: భవన నిర్మాణానికి ప్రధాన ముడి సరుకు ఇసుక.. ఏపీలో నాలుగేళ్లుగా ఇసుక లభించక ప్రయివేటు, ప్రభుత్వ నిర్మాణాలు చాలా పరిమితంగానే జరగటంతో భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి మృగ్యమయింది. ఇసుక అక్రమ రవాణాను నిరోధించాల్సిన రాష్ట్ర పోలీసు, రెవెన్యూ, ఎస్‌ఇబీ, రవాణా శాఖ అధికారులు తీరు విగ్రహపుష్టి నైవేద్యంనష్టిలా తయారైంది. పశ్చిమకృష్ణాలో నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల నుంచి మున్నేరు, కృష్ణా నది నుంచి భారీగా ఇసుక అక్రమరవాణా జరుగుతోంది.

తెలంగాణాకు తరలింపు..: కృష్ణానది నుంచీ తవ్విన ఇసుకను ప్రతిరోజు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు 250 నుంచి 300 లారీల్లో నింపి అక్రమంగా తరలిస్తున్నారు. రాజమార్గాల్లోనే రాష్ట్ర సరిహద్దులు దాటుతున్న ఇసుక లారీల గురించి పోలీసు, రెవెన్యూ, ఎస్‌ఇబీ, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవట్లేదు. సామాన్యుడికి మాత్రం ఇసుక దొరకటం కష్టంగా ఉండగా.. అక్రమార్కులు మాత్రం లారీలకు లారీలు తరలించేస్తున్నారు. అక్రమంగా వెళ్తున్న లారీలను ఎవరైనా పట్టుకుని పోలీసులకు అప్పగించినా గంటల వ్యవధిలోనే విడిపించి పంపించేస్తున్నారు.

యంత్రాలతో ఇసుక తవ్వకం..: ఇసుక గుత్తేదారు సంస్థ సబ్‌లీజుదారులు ఇష్టానుసారం నది గర్భంలో యంత్రాలతో ఇసుక తవ్వి తరలిస్తున్నారు. నందిగామ మండలంలో మాగల్లు, కంచల, చందర్లపాడు మండలంలోని కాసరబాద, కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు, వత్సవాయి మండలంలో కన్నెవీడు, మల్కాపురం, జగ్గయ్యపేట మండలంలో రావిరాల, అనుమంచిపల్లి గ్రామాల పరిధిలో ఇసుక తవ్వకాలు అడ్డూఅదుపు లేకుండా యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఆయా క్వారీల వద్ద అధికారుల పర్యవేక్షణ కరువైంది. దీంతో ఇసుక అక్రమ తవ్వకం, రవాణాదారులు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు.

అప్పగించడం ప్రజల వంతు విడిచిపెట్టడం పోలీసుల తంతు..: ఇటీవల నందిగామ మండలం జొన్నలగడ్డ, వత్సవాయి మండలం లింగాల వద్ద ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్థులు, తెదేపా నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అధికార పార్టీ ముఖ్యప్రజాప్రతినిధుల ఆదేశాలు మేరకు తెల్లారేసరికి వాటికి అనుమతులు ఉన్నాయని పోలీసులు పంపించేశారు. కనీసం పరిమితికి మించి ఇసుక లారీల్లో ఉన్నప్పటికి చర్యలు తీసుకోలేదు. కృష్ణానది, మునేరుల్లో ఇసుక తవ్వకాలతోనదులు స్వరూపం కోల్పోతున్నాయి. చివరి రక్షిత మంచినీటి బోర్లు ఉన్న ప్రాంతాల్లోను తవ్వకాలు చేస్తున్నారు. దీనివల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయి. దీనిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇతర రాష్టాలకు వెళ్లటానికి వీల్లేదు..: ఏపీలో ఇసుక ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లటానికి వీల్లేదు. దీనికి విరుద్ధంగా రాత్రి వేళల్లో టిప్పర్లు, లారీల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో వాహనంలో 26 టన్నులు మాత్రమే ఉండాలి. కానీ 55 టన్నుల వరకు ఇసుక రవాణా చేస్తున్నారు. ఇలా ప్రతి రోజు హైదరాబాద్‌కు 200, ఖమ్మంకు వంద లారీలు వరకు వెళ్తున్నాయని అనధికార లెక్కలు సూచిస్తున్నాయి. ఎవ్వరైన పట్టుకుంటే అప్పటికప్పుడు ఏపీలో తెలంగాణాకు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాల పేరుతో వేబిల్లులు తీసుకొచ్చి చూపిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వ పెద్దల అనుచరులు రంగప్రవేశం చేస్తుండటంతో అధికారులు కనీస చర్యలు తీసుకోవట్లేదు.

హైదరాబాద్‌లో మంచి డిమాండ్‌..: కృష్ణానదిలో ఇసుకకు హైదరాబాద్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో ఇక్కడి నుంచి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీనిలో కొందరు ముఖ్యనేతల ప్రమేయం ఉండటంతో అధికారులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.

కనికరం లేని పోలీసులు..: అధిక లోడుతో వెళ్తున్న లారీలను కనీసం రవాణా శాఖ అధికారులు పట్టుకుని కేసులు నమోదు చేయట్లేదు. ఆటోలో అధిక సంఖ్యలో ప్రయాణీకులు ఉంటే పోలీసులు నిరోధిస్తారు. కనీసం హెచ్చరించి వదలకుండా కేసు పెట్టి రూ.పదివేలు జరిమానా వసూలు చేస్తారన్న విమర్శలున్నాయి. ఆటోలపై కేసులు రాసే సంబంధిత అధికారులకు ఇసుక లారీలు కన్పించట్లేదా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీ యాజమానులకు అల్లుడి మర్యాద..అదే ఆటో డ్రైవర్లపై కనికరం లేకుండా ముక్కుపిండి వేలల్లో వసూలు చేస్తున్న పోలీసులు ప్రవర్తన దారుణంగా ఉందన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణా జరగకుండా అధికారులు కట్టుదిట్ట చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు, ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చదవండి :

Last Updated :Mar 2, 2023, 7:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.