ETV Bharat / state

pension problems in ap: ఇంట్లో రెండు పింఛన్లుంటే.. ఒక్కరికే!

author img

By

Published : Sep 3, 2021, 7:42 AM IST

ఇంట్లో ఇద్దరు పింఛన్​దారులుంటే ఒక్కరికే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అలాగే ఓ కేవైసీ చేయించుకోని వారికి కూడా పింఛన్ ఇవ్వడం ఆపేసింది. ఈ నెల పింఛన్ల పంపిణీలో ‘ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను’ విధానాన్ని అధికారులు అమలు చేశారు.

if-there-are-two-pensioners-in-the-house-dot-only-one-give-the-ap-govt
ఇంట్లో రెండు పింఛన్లుంటే.. ఒక్కరికే!

సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీలో ‘ఒక బియ్యం కార్డుకు ఒకే పింఛను’ విధానాన్ని అధికారులు అమలు చేశారు. ఒక కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే వారిలో ఒకరి పింఛనును నిలిపేశారు. అలాగే ఈకేవైసీ చేయించుకోని వారివీ ఆపేశారు. విజయవాడ నగర, గ్రామీణ సచివాలయాల పరిధిలోని కొందరు లబ్ధిదారులను గురువారం ‘ఈనాడు’ కలిసి వివరాలు సేకరించింది. ఈ మేరకు అజిత్‌సింగ్‌నగర్‌లోని 260, 261.. పాయకాపురంలోని 268, 269వ వార్డు సచివాలయాలను, నున్న మండల పరిధిలోని 1, 2, 3తోపాటు పాతపాడు గ్రామ సచివాలయాల్లో తొలగించిన పింఛనుదారుల వివరాలు పరిశీలిస్తే ఎక్కువగా ఒక బియ్యం కార్డుపై రెండు పింఛన్లు (ఇద్దరు లబ్ధిదారులు) ఉన్నవి, ఈకేవైసీ చేయించుకోనివే ఉన్నాయి.

ఒక బియ్యం కార్డుపై రెండు పింఛన్లుంటే ఎవరిది తొలగించాలని అడుగుతూ లబ్ధిదారులకు నోటీసులిచ్చారు. వీటికి వచ్చిన సమాధానంగా వచ్చిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పింఛన్లను తొలగించారు. ఇవి కాకుండా సచివాలయాల ఉద్యోగుల రేషన్‌ కార్డులను తొలగించిన నేపథ్యంలో ..అందులో ఉన్న లబ్ధిదారులకు పింఛన్లను నిలిపేశారు. మొత్తం మీద ప్రతి సచివాలయంలోనూ 4-10 వరకు పింఛన్లు ఆగిపోయాయి. పింఛన్ల పంపిణీలో పోర్టబులిటీ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేయడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పింఛన్లు తీసుకునే అవకాశం లేదని సిబ్బంది వెనక్కి పంపారు.

  • లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ అందని కారణంగా పాయకాపురంలో ఒకే బియ్యం కార్డులో పేర్లు ఉన్న ఇద్దరికీ పింఛను మంజూరు కాలేదని అక్కడి అధికారులు తెలిపారు.
  • ఒకే బియ్యం కార్డుపై వృద్ధులు, వితంతువులు ఉంటే నున్న గ్రామం రెండవ సచివాలయ పరిధిలో వితంతువులకే పింఛను ఇవ్వాలని లబ్ధిదారులు కోరారు.
  • ఈకేవైసీ నిబంధనతో పింఛన్లు నిలిపేసిన వారిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు.. ఆధార్‌ కేంద్రానికి వెళ్లి ఈకేవైసీ వివరాలు సమర్పించాలని వారికి అధికారులు సూచించారు.

ఇద్దరికీ పింఛను నిలిపేశారు..!

కళాకారుడు టి.వి.చలపతిరావు, చేనేత కార్మికులరాలు సరస్వతి

కృష్ణా జిల్లా ఘంటసాలకు చెందిన టి.వి.చలపతిరావు హార్మోనియం కళాకారుడు. ప్రభుత్వం ఆయనను కళాకారుడిగా గుర్తించి గత 18 ఏళ్లుగా పింఛను ఇస్తోంది. చేనేత కార్మికురాలైన ఆయన భార్య సరస్వతికి చేనేత పింఛను వస్తోంది. ఈ నెలలో ఇద్దరికీ పింఛను అందలేదు. ఒకే ఇంట్లో రెండు వృద్ధాప్య పింఛన్లు ఉంటే నోటీసు ఇచ్చి ఒకరిది నిలిపివేస్తున్నారు. వీరివి వేరువేరు పింఛన్లు.. అయినా ఎలాంటి సమాచారం లేకుండానే తమకు నిలిపేశారని వారు ఆరోపిస్తున్నారు. ఇంటి ఖర్చులు, మందులకు కలిపి రూ.6వేలు ఖర్చవుతోందని దంపతులు వాపోతున్నారు.

పింఛను నిలిచిపోయిందని.. వృద్ధుడి మృతి

ప్రతి నెలా ఒకటో తేదీన తీసుకునే పింఛను.. ఈ నెల నుంచి నిలిచిపోయిందన్న మనస్తాపంతో ఓ వృద్ధుడు మృతి చెందారు. ఈ ఘటన విశాఖ జిల్లా చింతపల్లి మండలం తామరాపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కిల్లో సోమన్న (84) కొన్నేళ్లుగా ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే జీవనం సాగిస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పింఛను పంపిణీకి ఈకేవైసీని తప్పనిసరి చేసింది. సోమన్న ఈకేవైసీ ఇవ్వలేదు. ఈ కేవైసీ చేయించుకోనందువల్ల పింఛను రాదని చెప్పి సచివాలయ సిబ్బంది ఈ నెల డబ్బులివ్వలేదు. దీంతో సోమన్న తీవ్ర మనస్తాపానికి గురై బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలేవీ?... నిధుల కోసం పంచాయతీల ఎదురుచూపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.