తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో సింగపూర్లో నాలుగో అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఆన్లైన్లో భాగవత పారాయణం, భాగవత పద్య పఠనం, శ్రీ సూక్త పఠనం పోటీలు నిర్వహించారు. ఈ వేడుకలకు 200 మంది పిల్లలు వివిధ సాంస్కృతిక పోటీలలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో ఎంపికైన 25 మంది వివిధ ప్రాంతాల నుంచి తమ కళలను ప్రదర్శించారు. మన దేశంతోపాటు సింగపూర్, ఇతర దేశాల వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమృతానంద సరస్వతి విశిష్ట అతిథిగా పాల్గొని భాగవత ప్రాశస్త్యాన్ని వివరించారు. భాగవత ప్రచారానికి కృషి చేస్తోన్న డాక్టర్ మురళీ మోహన్ని నిర్వాహకులు.. భాగవతరత్న పురస్కారంతో సత్కరించారు. పెద్ది సాంబశివరావు 'తెలుగుభాగవతం.ఆర్గ్' నుంచి సమకూర్చిన "పోతనామాత్య భాగవత పరిచయం - అష్టమ స్కంధం" డిజిటల్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అంతర్జాలంలోని తెలుగు వారందరికీ ఉచితంగా అందజేస్తున్నామని నిర్వాహకులు ప్రకటించారు.
ఇదీ చూడండి. 'స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో ముందుకు సాగుతాం'