ETV Bharat / state

పంట చేతికందే సమయంలో తుపాను - అన్నదాతల్లో కలవరం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 8:35 PM IST

Updated : Dec 4, 2023, 9:12 PM IST

crop_damage_due_to_michaung_cyclone
crop_damage_due_to_michaung_cyclone

Farmers are Worried about crop Damage Due to Michaung Cyclone: నిన్న మొన్నటి వరకు తీవ్ర వర్షాభావంతో ఇబ్బందిపడిన రైతులను నేడు మిగ్‌జాం తుపాను కలవరపెడుతుతోంది. అష్టకష్టాలు పడి, అప్పులు చేసి లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో ఎడతెరిపి లేని వర్షాలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కల్లాల్లోని ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు కర్షకులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం నిబంధనలు సడలించి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.

పంట చేతికందే సమయంలో తుపాను - అన్నదాతల్లో కలవరం

Farmers are Worried about Crop Damage Due to Michaung Cyclone: మిగ్‌జాం తుపాను వల్ల ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వేల ఎకరాల్లోని పంటలు దెబ్బతిన్నాయి. అష్టకష్టాలు పడి లక్షల పెట్టుబడితో సాగు చేసిన పంటలు చేతికందే సమయంలో వర్షాల కారణంగా నేలకొరిగాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

Krishna District: కృష్ణా జిల్లా దివిసీమలో లక్ష ఎకరాల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ తరుణంలో వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం సబ్సిడీపై టార్పాలిన్‌ పట్టలు పంపిణీ చేసిందని వైసీపీ ప్రభుత్వం కనీసం ఒక్క పరదా కూడా ఇవ్వలేదని రైతులు వాపోతున్నారు. మెట్ట ప్రాంతంలో సుమారు 60 వేల ఎకరాల్లో సాగుచేస్తున్న అరటి, బొప్పాయి, టమాట, మిర్చి ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు దిగుబడిపై వర్షాల ప్రభావం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న వేళ తుపాను నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పరుగులు పెడుతున్నారు.

ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావం - విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

NTR District: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆరబెట్టిన ధాన్యాన్ని తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్‌ పట్టాల కోసం రైతులు హైరానా పడుతున్నారు. నియోజకవర్గంలో సుమారు 10 వేల ఎకరాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Dr BR Ambedkar Konaseema District: కోనసీమ జిల్లాలో కుండపోత వర్షాలకు పొలాలు నేలవాలుతున్నాయి. జిల్లాలో సుమారు లక్షా 52 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. దీంట్లో లక్ష ఎకరాల వరకు కోతలు పూర్తయ్యాయి. సుమారు 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కల్లాల్లో ఉంది. ధాన్యం రాశులు తడిసిపోకుండా రైతులు బరకాలు కప్పి రక్షణ చర్యలు చేపట్టారు. కుండపోత వర్షానికి ధాన్యం నాణ్యత దెబ్బతింటుందని రైతులు మదనపడుతున్నారు. ముమ్మడివరం నియోజకవర్గంలో వరిపైరు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టినా ఫలితం దక్కడం లేదని ఏటా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో తుపాను బీభత్సం - బిక్కుబిక్కుమంటున్న అన్నదాతలు

Vizianagaram District: విజయనగరం జిల్లాలో 2.31లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేపట్టగా 1.53 లక్షల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. ఇందులో 2,817 ఎకరాల్లోనే పంట మాత్రమే నూర్పిడి పూర్తయింది. మిగిలిన పంట వర్షాలకు మొలకెత్తే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మన్యం జిల్లాలో 1.06 లక్షల ఎకరాల్లో ఖరీప్‌లో వరి సాగు చేశారు. ఇందులో ఇప్పటి వరకు 35శాతం పంట కోత పూర్తయింది. నూర్పిళ్లు జరిగిన పంట చాలా ప్రాంతాల్లో కల్లాల్లోనే ఉండిపోయింది. తుపాను హెచ్చరికలతో పంటను భద్రపరిచే అవకాశం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు సుమారు 3 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు మన్యం జిల్లా అధికారులు వివరించారు.

Alluri Sitarama Raju District: అల్లూరి జిల్లాలో వరికుప్పను నూర్పిడి చేసేందుకు యంత్రాల నిర్వాహకులు అధిక మొత్తంలో డిమాండ్‌ చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కోతలు పూర్తయిన వరి పైరును కుప్పలు పెట్టి కాపాడుకునేందుకు రైతులు అపసోపాలు పడ్డారు.

చిత్తూరు జిల్లాలో తుపాన్ ప్రభావం - తిరుమలలో పర్యాటక ప్రాంతాలకు అనుమతి నిరాకరణ

Tirupati District: తిరుపతి జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు ఏర్పేడు మండలం గోపాలపురంలో బొప్పాయి తోట నేలకొరిగింగి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వరి నాట్లు నీట మునిగి ఇసుక మేటలు ఏర్పడ్డాయి.

Nellore District: నెల్లూరు జిల్లాలో రెండురోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాలైన ముత్తుకూరు, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, కొడవలూరు, విడవలూరు మండలాల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Prakasam District: ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు, నాగులుప్పలపాడు తదితర మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఉప్పు మడులు నీటితో నిండిపోయాయి. పొగాకు, శనగ పంటలు దెబ్బతిన్నాయని రైతులు విచారం వ్యక్తం చేశారు.

Last Updated :Dec 4, 2023, 9:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.