రాష్ట్రంలోని ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు: సీఎం జగన్

author img

By

Published : Jan 25, 2023, 8:00 PM IST

cm jagan

CM Jagan Review on Animal Husbandary : రాష్ట్రంలో ఉన్న ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వీటిని జారీ చేయాలని సూచించారు. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలన్నారు. పాల నాణ్యత పెరగాలని సీఎం ఆదేశించారు.

CM Jagan Review on Animal Husbandary : పశు సంవర్ధక, పాడిపరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ సమీక్షించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖలో మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి సచివాలయానికి ఒక విలేజ్ క్లినిక్స్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న సీఎం.. పశు సంవర్ధక శాఖలోనూ ఈ తరహాలోనే పటిష్టమైన అంచెల విధానాన్ని తీసుకురావాలని ఆదేశించారు. ఏకరూపత తీసుకురావడం ద్వారా మంచిసేవలు అందుబాటులో తీసుకురావొచ్చన్నారు. ఈ విధానాన్ని నిర్దేశించుకున్న తర్వాత నాడు – నేడు కార్యక్రమం ద్వారా మౌలిక సదుపాయాలను వృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. దీనికి సంబంధించి ఒక హేతు బద్ధత ఉండాలన్నారు. దీనికోసం ఒక మార్గదర్శక ప్రణాళికను తయారుచేయాలని సీఎం ఆదేశించారు. పశువులకు వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ మేరకు వ్యాక్సిన్లు వేయాలన్నారు.

సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించుకోవాలి : ప్రజారోగ్యానికి సంబంధించి గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్ సహా ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలతో వ్యవస్థ సృష్టించామని, ఆర్బీకేల్లోనూ పశుసంవర్ధక విభాగాన్ని బలోపేతం చేయాలని సూచించారు. యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటు సమర్థతను పెంచాలనీ, గ్రామస్థాయిలో ఒకరిద్దరు వలంటీర్లను ఈ సేవల్లో నిమగ్నం చేయాలన్న సీఎం.. దీనికోసం ఎస్‌ఓపీ తయారుచేయాలని చెప్పారు. . ప్రతి మండల స్థాయిలో ఉన్న ఈ వ్యవస్ధ నుంచి ఆర్బీకేల్లో ఉన్న యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంటుకు పూర్తిస్థాయి మద్దతు, సహకారం ఉండాలన్నారు. పశుపోషణ చేస్తున్న వారి వద్ద కాల్‌సెంటర్‌, యానిమల్‌ హస్బెండరీ అసిస్టెంట్ నెంబర్లు అందుబాటులో ఉండాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ప్రతి పశువుకూ హెల్త్‌ కార్డు ఇచ్చే దిశగా ఆలోచన చేయాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల పశువులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణ సులభతరం అవుతుందన్నారు.

రసాయనాలకు తావులేని పశుపోషణ: జగనన్న పాలవెల్లువలో భాగంగా ఏర్పాటు చేసిన మిల్క్‌ సొసైటీల వద్ద అమూల్‌ భాగస్వామ్యంతో పాడిరైతులకు శిక్షణ ఇప్పించాలని సీఎం ఆదేశించారు. పాలల్లో రసాయన మూలకాలు ఉన్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయని, అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని, పాల నాణ్యత పెరగాలని సీఎం సూచించారు. రసాయనాలకు తావులేని పశుపోషణ విధానాలపై అవగాహన పెంచాలన్నారు. పశుసంవర్థక శాఖలో అన్ని రకాల సేవలకోసం ఒకే నంబరు వినియోగించాలన్నారు. పశువుల అంబులెన్సులు నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, దీనికోసం ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. పశుపోషణ సహా ఇతర జీవనోపాధి మార్గాలకోసం అవసరమైన రుణాలు మంజూరు చేయించడంలోనూ అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. పశువులకు పంపిణీ చేసిన మందులను నిల్వచేయడానికి ప్రతి ఆర్బీకేలో ఫ్రిజ్‌ సహా అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పశు సంవర్థక శాఖలో 4,765 ఏహెచ్‌ఏ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి : జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని సమీక్షించిన సీఎం.. వచ్చే రెండు నెలల్లో మరో 1422 గ్రామాల్లోకి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం విస్తరించాలని ఆదేశించారు. చిత్తూరు డైయిరీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు మూడు వారాల్లో శంకుస్థాపనకు అన్నీ సిద్ధం చేయాలన్నారు. . మొదటి విడతలో చేపట్టిన నాలుగు ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ పనులపైనా సీఎం సమీక్షించారు. పనులు వేగంగా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. జువ్వలదిన్నెలో ఇప్పటికే 92.5శాతం పనులు పూర్తయ్యాయన్న అధికారులు.. ఫిబ్రవరి 15 నాటికి జువ్వలదిన్నె పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. ప్రతి త్రైమాసికానికి ఒకటి చొప్పున డిసెంబర్‌ నాటికి మొదటి ఫేజ్‌ ఫిషింగ్‌ హార్బర్లు అందుబాటులోకి వస్తాయన్నారు.

ధరల నియంత్రణ చట్టాలను సమర్ధంగా అమలు చేయాలి : రెండో ఫేజ్‌లో నిర్మించనున్న వాడరేవు, బుడగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం, బియ్యపు తిప్ప ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణానికి అటవీ, పర్యావరణ సహా అన్నిరకాలుగా అనుమతులు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణం వల్ల జీడీపీ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతి పెరుగుతుందని.. దీనివల్ల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ప్రతి ఫిషింగ్‌ హార్బర్ నుంచి ఏడాదికి వెయ్యి కోట్ల రూపాయలకుపైగా ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు. తద్వారా ఉపాధికోసం మన మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. ఆక్వా రైతులకు మేలు జరగాలని, దీనికోసం ఫీడ్, సీడ్ రేట్లపై నియంత్రణకోసం తీసుకు వచ్చిన చట్టాలు సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్బీకే స్థాయిలో ఆక్వా కొనుగోళ్లు జరిగేలా చూడాలని నిర్దేశించారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చూడాలన్నారు. ఆక్వా రంగంలోనూ మధ్యవర్తుల ప్రమేయాన్ని తీసివేయాలని ఆదేశించారు. ఆక్వాలో కొత్త ప్రాసెసింగ్‌ సెంటర్లపైనా దృష్టిపెట్టాలన్న సీఎం... సహకార రంగం మాదిరిగా ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుపై తగిన ఆలోచన చేయాలన్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.