ETV Bharat / state

జడ్జిలను దూషించిన కేసులో.. మరో ముగ్గురు అరెస్ట్

author img

By

Published : Feb 12, 2022, 3:45 PM IST

Updated : Feb 12, 2022, 7:22 PM IST

social media posts against judges
social media posts against judges

15:41 February 12

ముగ్గురినీ విజయవాడ తరలించిన సీబీఐ అధికారులు

న్యాయమూర్తులను దూషించిన కేసులో.. సీబీఐ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. సీనియర్ న్యాయవాదులు గోపాలకృష్ణ కళానిధి, మెట్ట చంద్రశేఖర్‌లతోపాటు సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను.. ఉదయం అదుపులోకి తీసుకున్న అధికారులు.. హైదరాబాద్ కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. సుమారు ఆరుగంటలపాటు విచారణ అనంతరం అరెస్ట్ చేశారు. వైద్యపరీక్షల తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి రిమాండ్ కు తరలించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ కాగా.. తాజాగా ఈ ముగ్గురిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఇదే కేసులో ఓ పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించినట్లు సమాచారం. దర్యాప్తు జరిపి త్వరలో వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ వివరణ..
social media posts against judges case: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసుపై ఫిబ్రవరి 7న హైకోర్టు విచారణ జరిపింది. ఇప్పటికే నోటీసులు అందుకున్న ట్విటర్.. కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.

అఫిడవిట్‌లో పూర్తి వివరాలు తెలిపామని కోర్టుకు విన్నవించారు. అఫిడవిట్‌లో చెప్పినవి నిజమో కాదో చూడాలని న్యాయస్థానం.. సీబీఐని ఆదేశించింది. మెమో దాఖలు చేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు స్పష్టం చేసింది. కేసు విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

అంతకుముందు జరిగిన విచారణ సందర్భంగా సామాజిక మాధ్యమాల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై అభ్యంతరకర పోస్టులు, వీడియోలను తొలగించే వ్యవహారంలో సామాజిక మాధ్యమ సంస్థలు న్యాయస్థానంతో దోబూచులాడుతున్నాయని ఆక్షేపించింది. అభ్యంతరకర యూఆర్ఎల్ లను(యూనిఫాం రిసోర్స్ లొకేటర్) తొలగించాలని సీబీఐ కోరితే 36 గంటల్లో ఎందుకు తొలగించలేదని ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాద్యమ కంపెనీలపై మండిపడింది.

గతంలో తాము ఇచ్చిన ఆదేశాలకు వక్రభాష్యం చెబుతున్నాయని, సరైన స్పూర్తితో అమలు చేయడం లేదని ఆక్షేపించింది. ఫలానా పోస్టులు తొలగించాలని హైకోర్టు రిజిస్ట్రార్ జన రల్(ఆర్బీ) లేదా కేసులను దర్యాప్తు చేస్తున్న సీబీఐ కోరితే తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. కొన్ని యూఆర్ఎల్స్ ను తొలగించలేదని సీబీఐ, తొలగించామని సామాజిక మాధ్యమ సంస్థలు చెబుతున్న నేపథ్యంలో.. ఇరువురిలో ఎవరైనా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.

కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభిస్తామని న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఎన్ని యూఆర్ఎల్స్ ను తొలగించాలని కోరారో.. ఆ వివరాలను సామాజిక మాధ్యమాలకు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. ఎన్ని తొలగించారు..? మిగిలినవి తొలగింపునకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని ట్విటర్, యూట్యూబ్, ఫేస్​బుక్​లను ఆదేశించింది. మరోవైపు సీబీఐ అధికారులు.. కూడా కేసులో ఉన్న ప్రతి ఒక్కర్నీ విచారించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఇవాళ ముగ్గురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించింది.

ఇదీ చదవండి :
మూడు చోట్ల రాజధానులు పెడితే ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే

Last Updated : Feb 12, 2022, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.