ETV Bharat / state

ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం.. ఏప్రిల్ 5 వరకు 'వర్క్ టు రూల్'

author img

By

Published : Mar 21, 2023, 5:13 PM IST

వరకు వర్క్ టు రూల్
వరకు వర్క్ టు రూల్

Work to Rule : ఉద్యోగుల ఉద్యమంలో మరో అంకానికి తెరలేచింది. ఈ నెల 9న ప్రారంభమైన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఉద్యోగులంతా ధర్నాలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యాన ఇక వర్క్ టు రూల్ పాటించాలని అమరావతి ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉద్యోగులకు పిలుపునిచ్చారు.

Work to Rule : రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు వర్క్ టూ రూల్ పాటించాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా హెల్త్ యూనివర్సిటీలో ఉద్యోగులతో ఏపీ జేఏసీ అమరావతి నేతలు సమావేశం అయ్యారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్​ 5 వరకు వర్క్ టూ రూల్ పాటించాలని కోరారు. పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు ఇతర ఆర్థిక, అర్థికేతర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు. అధికారికంగా పని గంటలు ముగియగానే దస్త్రాలు విడిచి విధులు ముగించాలని స్పష్టం చేశారు. ఉదయం 10 నుంచి 5.30 గంటల వరకు మాత్రమే విధులు నిర్వహించాలని ఉద్యోగులకు ఆయన సూచించారు. 11 పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వకపోగా ఇవ్వాల్సిన బకాయిలు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్సీ ఏరియర్లు ఉద్యోగ విరమణ తర్వాత తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. కేడర్ వారీగా స్కేల్స్ కూడా నిన్న రాత్రి హడావిడిగా ఇచ్చారని తెలిపారు.

ప్రభుత్వం మోసం చేస్తోంది... పే స్కేల్ విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను, మోసం చేస్తోందని, అన్యాయంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని బొప్పరాజు ప్రశ్నించారు. సంఘాలు, నాయకత్వానికి అతీతంగా ఉద్యోగులు ఈ ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. 2015లో ఇస్తున్న అలవెన్సులు అమలు అవుతున్నాయని తెలిపారు. జీతభత్యాలు కూడా ఒకటో తేదీకి ఇవ్వకుండా ప్రభుత్వం పే స్కేలు మోసాలు కూడా చేస్తోందన్నారు. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ప్రభుత్వం ఉద్యోగులకు ఎలాంటి బకాయిలు లేవని సమాధానం చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు వర్క్ టూ రూల్ పాటించాలన్నారు. మిగతా సంఘాలు కూడా కలిసి రావాలని కోరారు.

ఏప్రిల్ 5న తుది కార్యాచరణ... ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, చట్టబద్ధంగా ఉద్యోగులకు రావాల్సినవి‌‌, ఉద్యోగులు దాచుకున్న డబ్బులు విడుదల చేయాలనే డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉద్యమం కొనసాగుతోంది. మార్చి 9, 10న నల్ల బ్యాడ్జీలతో ప్రారంభమైన నిరసన కార్యక్రమాల్లో భాగంగా 13, 14న కలెక్టరేట్లు, ఆర్‌డీవో కార్యాలయాల వద్ద ఉద్యోగులు ధర్నా చేశారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆందోళనల్లో పాల్గొన్నారు. మార్చి 15, 17, 20న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేశారు. ఇక.. మార్చి 21 నుంచి వర్క్ టు రూల్‌, సెల్‌ఫోన్ డౌన్‌, 24న హెచ్‌వోడీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయనున్నారు. మార్చి 27న కరోనా మృతుల కుటుంబ సభ్యులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. ఏప్రిల్‌ 1న వివిధ అంశాలపై నిరసన, ఏప్రిల్‌ 3న ప్రతి జిల్లాలో చలో స్పందన, కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. ఏప్రిల్‌ 5న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించి తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు.

ఈ రోజు నుంచి 10 గంటల నుంచి 5:30 గంటల వరకే పని చేయాలని, వర్క్ టు రూల్ పాటించాలని ఉద్యోగులకు పిలుపునివ్వడం జరిగింది. ఉద్యోగులంతా ఐక్యంగా, సంఘాలు, నాయకత్వాలకు అతీతంగా సంఘీభావం ప్రకటిస్తేనే ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని గుర్తు చేస్తున్నాను. ఇప్పటికే 11వ పీఆర్సీ కారణంగా గతంలో సంపాదించుకున్న రాయితీలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైంది. వాటిని కాపాడుకునేందుకు గత సంవత్సరం చేసిన ఉద్యమం ఫలితంగా కొంత నిలుపుకోగలిగాం. ఆ చర్చల సందర్భంగా జరిగిన ఒప్పందాలు ప్రధానంగా పీఆర్సీ ఏరియర్స్​ను చెల్లించకపోగా ఇటీవల ఉద్యమం చేపట్టాక వారం రోజుల కిందట మెమో ఇచ్చారు. ఏరియర్స్ రిటైర్డ్ అయిన తర్వాత తీసుకోవాలని చెప్పడం దర్మార్గమైన ప్రక్రియ. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జెఏసి అమరావతి

సీపీఎస్ ఉద్యోగులు సైతం... ప్రభుత్వానికి వినతి పత్రాల ద్వారా నిరసన తెలియజేయాలని ఏపీ సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. ఈనెల 23వ తేదీన ఉద్యోగులంతా తమ శాఖల కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేయాలని నిర్ణయించారు. 23 సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్థిక కార్యదర్శికి వినతి పత్రాన్ని సమర్పించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల సీపీఎస్ ఉద్యోగులకు ఈ ఏడాది జీతంలో 10 శాతాన్ని ప్రభుత్వం మినహాయించింది. మినహాయించిన మొత్తాన్ని ప్రభుత్వ వాటాతో కలిపి ఉద్యోగుల పెన్షన్ ఖాతాకు ఆర్థిక శాఖ జమ చేయలేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో 90 శాతం జీతం ఇచ్చి ఆదాయపు పన్ను మాత్రం మొత్తం జీతానికి వసూలు ఎలా చేస్తారంటున్న సీపీఎస్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రతీ సీపీఎస్ ఉద్యోగికి 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయలు పెండింగ్ పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్లిప్తంగా ఉంటే పాతబకాయిలు పెరిగిపోతాయని ఉద్యోగులు అంటున్నారు. రాబోయే ప్రభుత్వాలు తమను నిర్లక్ష్యం చేస్తే పరిస్ధితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. సీపీఎస్ రద్దు, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం సమాయత్తం కావాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ప్రతీ శాఖలోనూ సీపీఎస్ ఉద్యోగులకు ప్రాన్ ఖాతాకు జమ కావాల్సిన డబ్బులను వెంటనే జమ చేయాలని ఏపీ సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ డిమాండ్ చేశాయి.

ఉన్నతాధికారులు సహకరించాలి... ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఏపీజేఎసీ అమరావతి కర్నూలు జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా నేటి నుంచి వర్క్ టూ రూల్ కార్యక్రమం చేపట్టారు. ఉన్నతాధికారులు సహకరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరావుకు వినతిపత్రం అందజేశారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.