ETV Bharat / state

Pawan Kalyan comments: 'పులివెందుల సంస్కృతి అన్నిచోట్లకూ.. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం'

author img

By

Published : Jun 25, 2023, 1:51 PM IST

Updated : Jun 25, 2023, 2:18 PM IST

pawan kalyan comments: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర 12వ రోజు కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా నియోజకవర్గ నేతలు, ముఖ్య కార్యకర్తలతో సమావేశమైన పవన్.. గోదావరి జిల్లాల నుంచే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు రావాలని అన్నారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్న పవన్‌.. కులం ఆధారంగా రాజకీయాలు చేయలేం అని స్పష్టం చేశారు.

pawan kalyan
pawan kalyan

pawan kalyan comments: గోదావరి జిల్లాల నుంచే రాష్ట్ర రాజకీయాల్లో మార్పు మొదలు కావాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. మన ఓట్లు తీసేసి దొంగ ఓట్లు వేస్తారు జాగ్రత్త అని పవన్‌ తెలిపారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర 12వ రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కొనసాగుతోంది. మలికిపురం మండలం దిండిలో బస చేసిన పవన్ కల్యాణ్.. ఆదివారం రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు మలికిపురం కాలేజీ సెంటర్లో బహిరంగ సభలో పవన్ ప్రసంగించనున్నారు. నిన్న జరగాల్సిన ఈ సభ వాతావరణం అనుకూలించని కారణంగా ఇవాళ్టికి వాయిదా పడింది. బహిరంగ సభ అనంతరం పవన్.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం బయల్దేరనున్నారు. పవన్ బహిరంగ సభ నేపథ్యంలో రాజోలు నియోజకవర్గంలో సందడి నెలకొంది.

రాజోలు నియోజకవర్గంలో జనసేన నేతలతో పవన్ సమావేశం

కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన పవన్.. వారికి దిశా నిర్దేశం చేశారు. రాజోలులో వెలిగించిన చిన్నదీపం రేపు రాజంపేటలోనూ వెలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా రాజకీయ అవినీతి నిర్మూలనపై మాట్లాడిన పవన్.. రూ.2 వందలు లంచం తీసుకున్న ఉద్యోగికి శిక్ష పడుతుంది కానీ, వేల కోట్లు దోపిడీచేసే నేతలు అధికారంలో ఉంటూ పరిపాలన చేస్తున్నారని అన్నారు. నేరగాళ్లు రాజకీయాలు చేస్తే రాష్ట్రం నాశనం అవుతుందన్న పవన్‌.. కులం ఆధారంగా రాజకీయాలు చేయలేం అని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల నుంచే మార్పు మొదలు కావాలని సూచించారు. పులివెందుల సంస్కృతి అన్నిచోట్లకూ తెచ్చారని ప్రభుత్వంపై పవన్ కల్యాణ్‌ మండిపడ్డారు. రాజకీయ పదవుల్లో మూడోవంతు మహిళలు ఉండాలని తెలిపారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే పోరాడతా.. ఎదురు తిరుగుతా అని చెప్పారు. మన ఓటుతో గెలిచి జవాబుదారీతనం లేకపోతే కుదరదని అన్నారు. మన ఓట్లు తీసేస్తారు.. దొంగ ఓట్లు వేస్తారు.. జాగ్రత్త.. కులాల సర్దుబాటు కోసమే కుల ప్రస్తావన తప్ప రెచ్చగొట్టేందుకు కాదని ఈ సందర్భంగా పవన్‌ స్పష్టం చేశారు.

కోనసీమ జిల్లా దిండిలో శనివారం పార్టీ ముఖ్య నాయకులతో పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పాలన నుంచి గోదావరి జిల్లాలకు విముక్తి కల్పించడమే జనసేన ముఖ్య లక్ష్యమని పవన్ ప్రకటించారు. తనకు వైఎస్సార్సీపీ అంటే కోపం లేదన్న పవన్.. అరాచక పాలనకు మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. గోదావరి జిల్లాల అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. నియోజకవర్గంలో రోడ్లన్ని ధ్వంసమయ్యాయని చెప్తూ... రాజోలు నుంచి వస్తుంటే పడవ ప్రయాణంలా అనిపించిందని పేర్కొన్నారు. అందుకే వైఎస్సార్సీపీ పాలన నుంచి విముక్తి కల్పించడమే మొదటి లక్ష్యమని, ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెడతాం అని పవన్ తెలిపారు. రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరొందిన ఈ నేలను కాపాడుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని నాయకులు, కార్యకర్తలకు పవన్ సూచించారు. జన సైనికుల ప్రయత్నాలతో ప్రజల్లో మార్పు ప్రారంభమైందని, ఇది తెలిసే అధికార పార్టీ తనపై దాడులను ప్రోత్సహిస్తోందని పవన్ అన్నారు.

Last Updated :Jun 25, 2023, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.