ETV Bharat / state

రాష్ట్రాన్ని రక్షించుకునేందుకు.. మరో ప్రజాఉద్యమం: చంద్రబాబు

author img

By

Published : May 6, 2022, 3:46 PM IST

Updated : May 7, 2022, 4:31 AM IST

ప్రజలను పీడిస్తున్న సీఎం జగన్‌ వెంటనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ప్రతిపక్షాలే కారణమనడం దారుణమన్నారు. పాలన చేతకాకే జగన్‌ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్న చంద్రబాబు.. వైకాపా సర్కార్‌ను బంగాళాఖాతంలో కలిపాలని ప్రజలకు పిలుపిచ్చారు. వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు.

చంద్రబాబు
చంద్రబాబు

వైకాపా ప్రభుత్వంలో ప్రజలపై మోపుతున్న ధరాభారంపై పోరాటాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు.. కాకినాడ జిల్లా తాళ్లరేవులో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా గ్రామానికి వచ్చిన తెలుగుదేశం అధినేతకు.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిత్యావసరాల ధరల పెంపు, పన్నుల వాతలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వాల లాగానే తాము పన్నులు విధిస్తున్నామని చెబుతున్న వైకాపా తీరుపై మండిపడ్డ చంద్రబాబు.. ప్రజలిచ్చిన విద్యుత్‌ బిల్లులను పోల్చి చూపెడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ తెలుగుదేశం నేతల పనేనన్న సీఎం జగన్‌ వ్యాఖ్యలపైనా విమర్శలు సంధించారు. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్న వైకాపా సర్కార్‌ తీరును చలోక్తులు విసురుతూ ఎద్దేవా చేశారు. కాకానాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి బియ్యం అక్రమాల్లో ఆరితేరారన్న చంద్రబాబు.. ఆయన జగన్‌ బినామీ అని ఆరోపించారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డిని.. చంద్రబాబు పరామర్శించారు.

క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ : రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్‌ కంకణం కట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని.. ప్రజాసమస్యలపై పోరాడుతామని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. కాకినాడలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘క్విట్‌ జగన్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ అని ఆయన పిలుపునిచ్చారు.

సజ్జల స్టేట్‌మెంట్లను హోంమంత్రి చదువుతున్నారు: ‘‘నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు. సజ్జల రాసిన స్టేట్‌మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే.. జగన్‌ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5వేలు పడేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్‌ అంధకారం చేస్తున్నారు. కరెంట్‌ బిల్లులను 40 శాతం పెంచారు. కరెంట్‌ రాదు కానీ.. బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ కొట్టిపారేశారు.

నాకు సీఎం పదవి కొత్త కాదు:

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పదో తరగతి పరీక్షలను నిర్వహించలేని సీఎం.. 3 రాజధానులు కడతాడట. రాష్ట్రం నుంచి విదేశాలకు గంజాయి, డ్రగ్స్‌ పంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మరో ప్రజాఉద్యమం అవసరం.. దీనికి అందరూ కలిసి రావాలి. ఆ ఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుంది. నేను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదు. సీఎం పదవి నాకు కొత్త కాదు. రాష్ట్రంలో ఉన్న అందరూ పన్నులు కడుతున్నారు. వైకాపా శ్రేణులకు కూడా పన్నులు, ఛార్జీల బాదుడు ఉంది. రాష్ట్ర పునర్‌ నిర్మాణానికి వైకాపా శ్రేణులు కూడా కలిసి రావాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు అండగా ఉండాలని.. వాళ్లే ముందుండి నడిపించాలి.- చంద్రబాబు, తెదేపా అధినేత

ఇదీ చదవండి : 'అసహనం పక్కనపెట్టి పనిపై దృష్టి పెడితే...పరిస్థితులు మెరుగుపడతాయి'

Last Updated :May 7, 2022, 4:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.