Tiger: కాకినాడ జిల్లాలో ఇంకా దొరకని పులి.. మళ్లీ ఆవులపై దాడి

author img

By

Published : Jun 23, 2022, 3:30 PM IST

చిక్కని పులి

Tiger in kakinada District: కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. గత నెల రోజులుగా పలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాాగా ఎస్​.పైడిపాలెం శివారు పెనుగొండలో ఆవులపై పులి దాడి చేసింది.

కాకినాడ జిల్లా రౌతులవూడి మండంలంలో పులి సంచారం కొనసాగుతోంది. ఎస్.పైడిపాలెం శివారు పెనుగొండలో ఆవులపై పులి దాడి చేసింది. ఈ ఘటనలో ఓ ఆవు తీవ్రంగా గాయపడింది. అదృశ్యమైన మరో ఆవు మృత కళేబరాన్ని గుట్టలపై అటవీ సిబ్బంది గుర్తించారు. పులి పాదముద్రలను కూడా గుర్తించారు. ప్రత్తిపాడు మండలం నుంచి రౌతులపూడి మండలం మీదుగా.. బిళ్లలొద్ది, తోటమానిలొద్ది, తాడువాయి, శృంగధార, పైడిపాల మీదుగా వచ్చిన దారిన పులి కదులుతున్నట్టు అటవీ అధికారులు వెల్లడించారు. మార్గమధ్యలో కంటపడిన పశువుల్ని వేటాడుతోంది. పైడిపాల నుంచి అనకాపల్లి జిల్లాలోని సరుగుడు, నర్సీపట్నం వైపుగా సాగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

నెల రోజులుగా ఇక్కడే: జిల్లా కేంద్రం కాకినాడకు 40 కిలోమీటర్ల దూరంలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, గొల్లప్రోలు మండలాల మధ్య నెల రోజులుగా పులి సంచరిస్తోంది. ఒమ్మంగి, పొదురుపాక, పోతులూరు, కొడవలి, వజ్రకూటం ప్రాంతాలు కొండలు, వాగులు, పుష్కర, ఏలేరు కాలువలతో ఉంటాయి. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు, చెట్లతో ఉన్న మెట్టలు అడవిని తలపిస్తాయి. నెల్లిపూడి, కత్తిపూడి ప్రాంతాల ప్రజల్లో భయాలు తొలగటం లేదు. ఇదే అనువుగా బెబ్బులి భావించి ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆకలికి మించి వేటాడని, బోనులో ఎరవేసినా.. లొంగని వ్యాఘ్రం ఇప్పటికి అయిదు పశువులను వధించింది. దాన్ని తిరిగి అడవిలోకి పంపాలనే మంత్రాంగాన్ని తిప్పికొడుతూ ఇక్కడిక్కడే తిరుగుతోంది.

ఎందుకు ఉందంటే..?

  • పులి ఇన్ని రోజులు అటవీప్రాంత సమీప మైదానంలో తిష్ఠ వేయడానికి కారణాలను వన్యప్రాణి, అటవీ అధికారులు విశ్లేషించుకుంటున్నారు.
  • పులి కౌమారదశకు చేరినపుడు అదో ప్రత్యేక భూభాగాన్ని (టెరిటరీ) ఖాయపరుచుకుంటుంది. మగ పులి 25 నుంచి 40 చ.కి.మీ. విస్తీర్ణాన్ని తన రాజ్యంగా భావిస్తుంది. తన కదలికలు, ఉంచే ఆనవాళ్లతో మిగతా జంతువులు పులి ఉనికిని గుర్తిస్తాయని చెబుతున్నారు. వేటకు అనువుగా ఉన్న పరిస్థితులను అది చూసుకుంటుంది.
  • పులి ఉండే తన సహజ ఆవాసంలో పరిస్థితులకు విఘాతం కలిగి ఉండవచ్ఛు అడవుల్లోనూ ఏదో రూపేణా జనం చేసే చప్పుళ్లు కారణం కావచ్ఛు రిజర్వు ఫారెస్టులనే ఖనిజ తవ్వకాలకు, ఇతర క్వారీలకు కేటాయిస్తున్నారు. విశాఖ మన్యం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపప్రణాళిక మన్యం వంతాడ, ఏజెన్సీ వరకూ జరిగిన పరిణామాలు ఇందుకు నిదర్శనం కాగా..వన్యప్రాణులు జనం బాట పట్టడానికి ఇదో కారణం.
  • ఆహార పిరమిడ్‌లో ప్రాథమిక లబ్ధిదారులు శాకాహార జంతువులు, వాటిపై ఆధారపడే మాంసాహారులు వీటిని నియంత్రించే పులి, చిరుత, సింహం. ఆహార సైకిల్‌కు భంగం అనిపించిన పరిస్థితుల్లోనూ వన్యప్రాణులు పక్కచూపు చూస్తాయి. మన్యం చేరువగా ఉన్న ఈ ప్రాంతంలో పాడిపశువులు, అడవి పందులు, కణుజులు, గొర్రగేదెలు పులి పరిశీలనలో ఉండడం వల్లే ఇన్నిరోజులు తిష్ఠ వేసిందనుకుంటున్నారు.
  • బైనాక్యులర్‌లో కనిపించినంత కంటి దృష్టి ఉండే పెద్దపులి చురుకుదనమూ అంతే.. తనచుట్టూ జరుగుతున్న అలికిడిని ఎంతదూరంలో ఉన్నా పసిగడుతోందని భావిస్తున్నారు.

అడవికి మళ్లేలా.. పులి అని గుర్తించినప్పటి నుంచి దానిని అడవిలోకి పంపే దిశగానే ప్రయత్నాలు చేస్తున్నాం. యుక్త వయసులో ఉన్న మగ పులి అది. తెలివిగానూ తిరుగుతోంది. ఒక ప్రాంతానికి పరిమితమై సంచరించడం లేదు. అందుచేత దాని గమనాన్ని పరిశీలిస్తూ ఊళ్లలోకి రాకుండా పెట్రోలింగ్‌ చేయడమే కీలకం. ఇప్పటివరకు అది పశువులనే వేటాడింది. ప్రజలకు హాని కలగకుండా చూస్తాం. -సెల్వం, వన్యప్రాణి విభాగం డీఎఫ్‌వో

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.