అనంతబాబు డ్రైవర్​ హత్య కేసు.. 3 నెలల్లోగా తుది ఛార్జ్‌షీట్ దాఖలుకు హైకోర్టు ఆదేశం

author img

By

Published : Jan 4, 2023, 3:08 PM IST

Updated : Jan 4, 2023, 3:47 PM IST

anantababu case

15:02 January 04

అనంతబాబు కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరణ

HC ON MLC DRIVER MURDER CASE : వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్​ సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐకి అప్పగించేందుకు హైకోర్టు నిరాకరించింది. సీసీ ఫుటేజ్‌కు చెందిన ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను 15 రోజుల్లో తీసుకోవాలని ఆదేశించింది. నివేదిక పరిశీలించి హత్యలో వ్యక్తుల పాత్ర నిర్ధారించాలని ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తులో గుర్తించిన అంశాలతో అదనపు అభియోగపత్రం వేయాలని హైకోర్టు సూచించింది. 3 నెలల్లోగా తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదీ జరిగింది: 2022 మే 19న కాకినాడ కొండయ్యపాలెంలో స్నేహితులతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యంను వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో ఎక్కించుకుని వెళ్లారు. గతంలో ఆయన దగ్గరే డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యాన్ని మాట్లాడే పనుందంటూ తీసుకెళ్లారు. అర్థరాత్రి పన్నెండున్నర గంటలకు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు ఉదయభాస్కర్‌ ఫోన్‌ చేసి .. నాగమల్లితోట వద్ద ప్రమాదం జరిగిందని చెప్పారు. సుబ్రహ్మణ్యాన్ని ఆస్పత్రికి తీసుకెళ్తున్నట్లు వారిని అక్కడికి రమ్మని పిలిచాడు.

మళ్లీ రాత్రి ఒకటిన్నర ప్రాంతంలో తన కారులోనే వెనకసీటులో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు కాపలాగా ఉండే అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చారు. సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడంటూ ఎమ్మెల్సీ చెప్పడంపై కుటుంబసభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో చనిపోతే మృతదేహమంతా నీరుకారుతూ, ఇసుక ఎలా ఉందని నిలదీశారు. ఈ వ్యవహారం మొత్తం చూస్తే ఉదయభాస్కరే తన భర్తను చంపేశాడన్న అనుమాన్ని సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ వ్యక్తం చేశారు.

పైగా నాగమల్లితోట వద్ద రోడ్డు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్సీ చెప్పిన మాటలు అబద్దమనే తేలాయి. అసలు అక్కడ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి హత్య కేసుగా మార్చారు. మే 23న ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేసి.. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి అనంతబాబును తరలించారు.

జైలు నుంచి విడుదల: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు గత డిసెంబర్​ 14న రాజమహేంద్రవరం జైలు నుంచి ఎట్టకేలకు విడుదలయ్యారు. 211 రోజులుగా సెంట్రల్ జైల్లో ఆయన ఖైదీగా ఉన్నారు. మే 19న కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఇంటి నుంచి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేసినట్లు అనంతబాబు ఆరోపణ ఎదుర్కొంటున్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ఆధ్వర్యంలో కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు న్యాయ పోరాటం చేశారు. ఈ కేసులో పోలీసులు విచారణ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అనంతబాబుకు రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ తిరస్కరించింది.

మే 23 నుంచి ఆయన సెంట్రల్ జైల్లోనే ఉన్నారు. ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించిన అనంతబాబుకు దేశ అత్యన్నత న్యాయస్థానం షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రాజమహేంద్రవరంలోని ఫ్యామిలీ కోర్టు షరతులు విధించింది. 50 వేల చొప్పున ఇద్దరు వ్యక్తుల పూచికత్తు, పాస్ పోర్టు కోర్టుకు సమర్పించడంతో పాటు దేశం వదిలి వెళ్లొద్దని ఆదేశించింది. సాక్షుల్ని బెదిరించవద్దని, ఎలాంటి ప్రలోభాలకు గురి చేయవద్దని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో అనంతబాబు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated :Jan 4, 2023, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.