ETV Bharat / state

Kakinada woman Arudra: నేను ఉన్నాను... అయినా నేను వినను

author img

By

Published : Nov 3, 2022, 7:36 AM IST

Kakinada woman Arudra: నేను ఉన్నాను... నేను విన్నాను.! పాదయాత్రలో జగన్‌ ఈ డైలాగ్‌ చెప్పని రోజంటూ లేదేమో.! కానీ అధికారంలోకి వచ్చాక సీన్‌ రివర్స్‌ అయింది. పాదయాత్రలో.. ఎదురుపడిన వాళ్లందరినీ తలపై చేయిపెట్టి మరీ ఆశీర్వదించిన జగన్‌... అధికారంలోకి వచ్చాక సామాన్యుల్ని కలవరు... వారి బాధలు వినరు..! ఏదైనా పర్యటన ఉంటే తప్ప.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం దాటని జగన్‌..ఆ కాంపౌండ్‌ బయట పడిగాపులు కాసే బాధితుల మొర వినరు... కనరు.! అన్నా అంటూ వచ్చే వారి మొర ఆలకించరు.! ఆలకిస్తే.. రోజంతా తాడేపల్లి ఇంటి బయట పడిగాపులు కాసిన ఆరుద్రకు ఎందుకు అభయమివ్వలేకపోయారు..? నాడు జనంలోతిరిగిన జగన్‌ నేడు అదే జనాన్ని ఎందుకు కలవలేకపోతున్నారు?

CM Jagan
నేను ఉన్నా నేను వినను

నేను ఉన్నా నేను వినను

Kakinada woman Arudra: నేను ఉన్నాను... నేను విన్నాను.! ఇదీ కలెక్టర్లకు జగన్‌ ఇచ్చిన సందేశం. అధికారంలోకి వచ్చాక మొదటిసారి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ మొదలుకుని స్పందన కార్యక్రమంపై ఎప్పుడు సమీక్షించినా సార్‌ ఇదే చెప్తుంటారు. ప్రతీసోమవారం కలెక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండాలని, బాధితుల గోడు మానవత్వంతో ఆలకించాలని ఉపదేశిస్తుంటారు. ఇవి అధికారులకు చెప్పారు సరే? ఆయన పాటించరా..?

సమస్యలతో వచ్చేవారి నుంచి వినతులు స్వీకరించేందుకు పటిష్ఠమైన వ్యవస్థ ఉంటే సగం సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయని.. ముఖ్యమంత్రే చెబుతున్నారు. అది ఆయన కార్యాలయానికి వర్తించదా..? సీఎం కార్యాలయం సచివాలయం. మంత్రివర్గ సమావేశాలో, అసెంబ్లీ సమావేశాలో ఉంటే తప్ప సార్‌ ఎలాగూ అటువైపు వెళ్లరు. గతంలో ముఖ్యమంత్రులంతా సచివాలయానికి వెళ్లేవారు. వెసులుబాటును బట్టి ప్రజల గోడు వినేందుకు కొంత సమయం కేటాయించేవారు. వచ్చినవారిని కలిసేవారు. వైద్యంగానీ ఇతరత్రా అవసరాలతో వచ్చినవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అప్పటికప్పుడు ఆర్థిక సాయం మంజూరుచేసేవారు. జగన్‌ నిత్యం జపించే రాజశేఖర్‌రెడ్డి కూడాసచివాలయానికి వచ్చే ప్రజల నుంచి అర్జీలు తీసుకునేవారు. కానీ రాజన్న రాజ్యం తెస్తానన్న జగనన్న రూటే సపరేటు. ఆయనకార్యకలాపాలన్నీ తాడేపల్లి కేంద్రంగానే. పోనీ ఆ క్యాంపు కార్యాలయం వద్దైనా ఎవరినైనా కలుస్తారా అంటే అదీలేదు.

అక్కడైనా జగన్‌కు బదులు... వినతులు స్వీకరించి పరిష్కరించే పటిష్ఠ వ్యవస్థ ఉందా? అంటే లేకేం. కాకపోతే అదో మొక్కుబడి తంతు. సీఎంవో నుంచి ఎవరో ఒక అధికారి వచ్చి వినతులు తీసుకుని,పంపేస్తున్నారు. దానివల్ల బాధితులకు భరోసా దొరకడం లేదు. భరోసా ఉంటే ఆరుద్ర ఎందుకు ఆత్మహత్యాయత్నం చేస్తారు. వెన్నెముకలేని కుమార్తెను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కాకినాడ నుంచి తాడేపల్లికి తీసుకొచ్చిన ఆరుద్ర నిజానికి ఒక రోజంతా సీఎంను కలవాలని ప్రయత్నించారు. కానీ అధికారులు కనికరించలేదు. జగన్‌ కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు వెళ్లినప్పుడే ఆయనను కలసి గోడు వెళ్లబోసుకునేందుకు ఆమె ప్రయత్నించారు. అక్కడా.. అధికారులు అనుమతించలేదు. జిల్లా కలెక్టరేట్‌కి వెళ్లి స్పందన కార్యక్రమంలో ఆరేడుసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. అధికారుల్లో చలనం లేదు. అక్కడే స్పందించి ఉంటే ఇంత జరిగేదా? సర్కార్‌ స్పందన సరిగా లేకే ఆరుద్రలాంటి ఎందరో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎన్నికల ముందు ‘నేను ఉన్నాను..నేను విన్నానంటూ దీర్ఘాలు తీసిన జగన్‌ అధికారంలోకి వచ్చాక ప్రజల సమస్యలు వినడమే మానేశారు. ఎక్కువగా క్యాంపు కార్యాలయానికే పరిమితమవుతున్నారు. ఈ మూడున్నరేళ్లలో సమస్యలు చెప్పడానికి వచ్చిన సామాన్య ప్రజల్ని ఎన్నడూ కలవలేదు. పోనీ జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడైనా ప్రజల్ని కలుస్తారా అంటే.. అదీ లేదు. సీఎం పర్యటన అంటేనే ఆ ప్రాంతంలో ఒక అనధికారిక కర్ఫ్యూ పెట్టేస్చారు. విపక్షాలను ముందురోజే నిర్బంధిస్తారు. ప్రజాసంఘాలనూ కట్టడి చేస్తారా. ఆయన కోరుకున్నవాళ్లు, ఆయన్ను కలవాలనుకునే వాళ్లు ఆ దరిదాపుల్లోకి ఎవర్నీ వెళ్లలేరు. రోడ్లపై బారికేడ్లు పెట్టేస్తారు. పరదాలు కట్టేస్తారు. ప్రజలెవరైనా ముఖ్యమంత్రిని దూరం నుంచి చూసి చేతులు ఊపాలే తప్ప, దగ్గరకు వెళ్లి సమస్య చెబుతామంటే కుదరదు. చివరకు సీఎం సభలోకి పెన్నులూ తీసుకెళ్లనివ్వనంత పక్కాగా పోలీసులు ఆంక్షలు పెడుతున్నారు.

పాలకులెవరైనా ప్రజలతో మమేకమవ్వాలనుకుంటారు. ప్రజల సమస్యలు స్వయంగా తెలుసుకుని, ప్రభుత్వ విధానాలు రూపొందించాలనుకుంటారు. వెసులుబాటును బట్టి ప్రజల్ని సీఎం నేరుగా కలిస్తే వారికీ భరోసా ఉంటుంది. అధికారుల్లోనూ జవాబుదారీతనం ఏర్పడుతుంది. సమస్య పరిష్కరించకపోతే సీఎం చివాట్లు పెడతారనే భయమూ ఉంటుంది. ప్రస్తుతం అధికారుల్లో అలాంటి భయాలేవీ కనిపించడంలేదు. ఉంటే కాకినాడకు చెందిన ఆరుద్ర.. ఒకరోజంతా సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చేదా? ఆత్మహత్యాయత్నం చేసేదా? జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆమె గోడు ఎవరూ పట్టించుకోలేదంటే ఇక సమస్యలు ఎవరికి చెప్పుకోవాలన్నదే ప్రశ్న.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.