ETV Bharat / state

ప్రారంభమైన వ్యాక్సినేషన్​ ప్రక్రియ.. ప్రజలకు తొలగనున్న భయం

author img

By

Published : Jan 16, 2021, 4:41 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. ఏడాదిగా విరామం లేకుండా వైద్యులు చేస్తున్న కృషి ఫలించింది. ఎన్నో అడ్డంకులు దాటుకుని కరోనా నివారణా టీకా వినియోగంలోకి వచ్చేసింది. ప్రజలకు గొప్ప ఊరట లభించనుంది. అంతిమ పోరుకు మొదటి అడుగు ప్రారంభమైంది. యుద్ధ ప్రాతిపదికన ఫ్రంట్ లైన్ వారియర్​లకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. రాష్ట్రాలు దాటుకుని వచ్చిన వ్యాక్సిన్ పల్లెలకు చేరింది. గుంటూరు జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అందుబాటులోకి వచ్చేసింది.

covid vaccination in guntur
ప్రారంభమైన టీకా అభయం

గుంటూరు జిల్లాలో కరోనా టీకా కార్యక్రమాన్ని హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. జీజీహెచ్​లోని నాట్కో క్యాన్సర్ విభాగంలో టీకాలు అందించేందుకు ఏర్పాట్లు చేయగా వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి తొలివిడత టీకా అందించారు. వ్యాక్సిన్ తయారీలో శాస్త్రవేత్తల కృషి ఎనలేనిదని మంత్రి ప్రశంసించారు. వ్యాక్సిన్ తీసుకున్నవారు యాంటీ బాడీస్ తయారయ్యే వరకూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

జిల్లాలో 43,500 డోసులు..

జిల్లాలో 43,500 డోసులు ఉన్నాయని, తొలి రోజు 2,466మందికి వ్యాక్సినేషన్ అందించనున్నట్లు వివరించారు. ప్రస్తుతం 31కేంద్రాల్లో టీకా అందిస్తున్నామని, వీటి సంఖ్య ఇంకా పెంచేలా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. టీకా తీసుకున్న తర్వాత ఏమైనా సమస్యలు తలెత్తితే చికిత్స కోసం అత్యవసర విభాగం సిద్ధం చేసినట్లు జిల్లా పాలనాధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. రోజుకు వందమందికి టీకా వేస్తామని పేర్కొన్నారు.

బాపట్ల ఏరియా అసుపత్రిలో ఉప సభాపతి కోన రఘుపతి..

బాపట్ల ఏరియా అసుపత్రిలో ఉప సభాపతి కోన రఘుపతి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఆసుపత్రి కరస్పాండెంట్ రసూల్ మెుదటి టీకా తీసుకున్నారు. తొలి విడతలో టీకా వేయించుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో విడత టీకా వేస్తారు.

చినమట్లపూడి గ్రామంలో ఎంపీ మోపిదేవి వెంకట రమణ రావు..

covid vaccination in guntur
ప్రారంభమైన టీకా అభయం

గుంటూరు జిల్లా నగరం మండలం చినమట్లపూడి గ్రామంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో టీకా ప్రక్రియను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ రావు ప్రారంభించారు. ఎన్నో ఇబ్బందులకు గురి చేసిన మహమ్మరి నుంచి కాపాడేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమించి వ్యాక్సిన్ కనిపెట్టడం శుభ పరిణామమని మోపిదేవి అన్నారు. లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. కరోన నివారణకు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.

చిలకలూరిపేట నియోజకవర్గంలోఎమ్మెల్యే రజిని..

covid vaccination in guntur
ప్రారంభమైన టీకా అభయం

గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని నాదెండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లోని ఫ్రంట్ లైన్ వారియర్​లకు టీకా వేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే రజిని తెలిపారు. రోజుకు వంద మందికి చొప్పున ఐదు రోజుల పాటు వ్యాక్సిన్ వేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అంగన్​వాడీ, ఆశా వర్కర్లు, పంచాయతీరాజ్, రెవెన్యూ ఉద్యోగులకు టీకా వేయనున్నట్లు వెల్లడించారు.

మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆరోగ్య సహాయ కార్యకర్తలు, అంగన్​వాడీ కార్యకర్తలకు టీకా వేశారు. మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణా రెడ్డి నూతక్కి పంచాయితీ పారిశుద్ధ్య కార్మికుడు వీరయ్యతో కోవిషీల్డ్ టీకాను బాక్స్​నుంచి బయటకు తీయించారు. అనంతరం రాంబాబు అనే ఆరోగ్య సహాయకుడికి వ్యాక్సినేషన్ చేశారు. కరోనాతో దాదాపు ఏడాది కాలంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విముక్తి లభించిందని ఎమ్మెల్యే తెలిపారు.

పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారి వెంకటయ్య..

పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారి వెంకటయ్య రోశయ్య కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. మన్నవ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మునిపల్లి గ్రామంలో, పెదకాకాని మండలం వెనిగండ్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకా అందించారు. తొలుత ఆరోగ్య సిబ్బందికి, అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు, 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు త్వరలోనే టీకా అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జీజీహెచ్​ కేంద్రంలో..

గుంటూరు జిల్లాలో జీజీహెచ్​ కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది. ఏఎన్ఎంకు మొదటగా టీకా అందించారు. రెండో టీకాను జీజీహెచ్ సూపరింటెండెంట్​కి అందించారు. వైద్య సిబ్బందిలో ధైర్యం నింపేందుకు తాను కూడా ముందుగా టీకా వేయించుకున్నట్లు తెలిపారు. టీకా తీసుకున్న వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వారికి చికిత్స అందించేందుకు జీజీహెచ్​లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిపుణులైన వైద్యులతో పాటు అన్ని రకాల మందులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. యాంటీబాడీస్ తయారయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీకా తీసుకున్న వారంతా అరగంట పాటు పరిశీలన గదిలో ఉన్నారు. ఎలాంటి సమస్యలు లేకపోవటంతో వారిని పంపించారు.

పెదనందిపాడు ఆసుపత్రిలో..

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పెదనందిపాడు ఆసుపత్రిలో టీకా ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఆరోగ్య సిబ్బందికి మొదటి డోస్ అందించారు. అరగంట వరకు వారిని ఆసుపత్రిలో ఉంచారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఎలాంటి సమస్యలు తలెత్తలేదు.

ఇదీ చదవండి: భార్యపై కత్తితో దాడి.. పరారీలో భర్త

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.